తాడికొండ: సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్ (ఫుల్ అడిషనల్ చార్జి)గా జి.సూర్యసాయి ప్రవీణ్ చంద్ గురువారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. రాయపూడిలోని సీఆర్డీఏ ప్రధాన కార్యాలయం 1వ ఫ్లోర్లోని తన చాంబర్లో ఆయన బాధ్యతలు స్వీకరించారు. తొలుత ఆయనకు కమ్యూనికేషన్స్ విభాగ జాయింట్ డైరెక్టర్ జి.రామరాజు పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ప్రవీణ్ చంద్కు సీఆర్డీఏ కమిషనర్ వి.విజయ రామరాజు, అడిషనల్ కమిషనర్లు ఎ.భార్గవ తేజ, కొల్లాబత్తుల కార్తీక్, ఆఫీస్ మేనేజ్మెంట్ డైరెక్టర్ వల్లభనేని శ్రీనివాసరావు, ఐటీ విభాగ డైరెక్టర్ బి.మల్లికార్జున రెడ్డి, ఇతర ముఖ్య అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.
పొన్నూరు: స్వర్ణపురి పట్టణంలో వేంచేసియున్న సుందరవల్లి రాజ్యలక్ష్మి సమేత సాక్షి భావనారాయణ స్వామివారి బ్రహ్మోత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమాలను ఆలయ అధికారులు, ధర్మకర్తల మండలి ప్రతినిధులు శిఖాకొల్లి గురునాథరావు, కాట్రగడ్డ రామచంద్రరావు, గుడివాడ పవన్, ధరణికోట పద్మావతి, ఆకురాతి అనూరాధ, ఊటుకూరి బాజీ శిరీష, కూరాకుల సత్యనారాయణ, సింహాద్రి వెంకటలక్ష్మి, పరాశరం రంగవల్లి, పొన్నూరు బాలగంగాధర తిలక్ తదితరులు పర్యవేక్షించారు.
నకరికల్లు: మండలంలోని అడ్డరోడ్డు గ్రామంలో వేంచేసి ఉన్న అభయాంజనేయ స్వామి వార్షిక తిరునాళ్ల గురువారం కనుల పండువగా జరిగింది. ధర్మకర్త కాళంగి వెంకట నర్సింహారావు, అర్చకులు వినుకొండ కొండమాచార్యులు ఆధ్వర్యంలో 25వ వార్షిక వేడుకలు ఘనంగా జరిపించారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ స్వామి వారికి లక్ష తమల పాకులతో అర్చన చేశారు. స్వామి వారిని విశేషంగా అలంకరించారు. పలు గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. రాత్రికి స్వామి వారి గ్రామోత్సవం జరిగింది.
గుంటూరు రూరల్: నల్లపాడు, చల్లావారిపాలెం గ్రామాల ఆరాధ్యదైవం సీతారామాంజనేయ స్వామి, ఆంజనేయ స్వామి ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవాన్ని గురువారం కనుల పండువగా నిర్వహించారు. రెండు గ్రామాల ప్రజలు, భవనం కొండారెడ్డి సహాయ సహకారాలతో నిర్వహించిన ఉత్సవాల్లో ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అభిషేకాలు, హోమాలను నిర్వహించారు. స్వామి వారి తీర్థ ప్రసాదం మహా అన్నదాన కార్యక్రమాన్ని మండలం ఎంపీపీ ఇంటూరి పద్మావతి అంజిరెడ్డి ప్రారంభించారు. 20 వేల మందికిపైగా భక్తులు పాల్గొని స్వామి వారిని దర్శించుకుని అన్నప్రసాదం స్వీకరించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.


