పేదల ఇళ్లను నేలమట్టం చేశారు. ప్రత్యామ్నాయం చూపించి ఇళ్లు కూల్చండని ఎంత బతిమాలినా ఆ రాతి గుండెలు కరగలేదు. చిన్నారులు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారు చాలా మంది ఉన్నారయ్యా.. వారిని తరలించేందుకు, సామగ్రి తీసుకెళ్లేందుకు కొంచెం సమయం ఇవ్వండయ్యా అని కాళ్లావేళ్లా పడినా జాలి కూడా చూపలేదు. రూపాయి రూపాయి కూడబెట్టి కట్టుకున్న ఇళ్లను రైల్వే అధికారులు, నగరపాలక సంస్థ అధికారులు కలసి పోలీస్ అధికారులను వందలాది మందిని రంగంలోకి దింపి నెహ్రూనగర్ జీరు లైను అయిన మోతీలాల్ నగర్లో ఇళ్లను కూల్చేశారు.
నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్): మోతీలాల్ నగర్కు చెందిన పేద కుటుంబాలు నెహ్రూనగర్ రైల్వే గేటు దగ్గరలో గత 60 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నాయి. ట్రాక్ పక్కనే డ్రైయిన్ నిర్మాణం చేపట్టేందుకు రైల్వే అధికారులు చర్యలు చేపట్టారు. డ్రైనేజీ నిర్మాణ పనులతో 135 నివాసాలు పూర్తిగా తొలగిస్తున్నామని.. కొద్ది రోజులుగా స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తుంటే దిక్కుతోచని బాధితులు స్థానిక ఎమ్మెల్యే నసీర్ అహ్మద్కు గోడు వెళ్లబోసుకున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రి పెమ్మసాని దృష్టికి సమస్యను తీసుకెళితే కనీస వసతులు లేని ప్రాంతాల్లోకి వెళ్లి ఉండాలని చెబుతున్నారని బాధితులు వాపోయారు. అక్కడ ఉండే పరిస్థితులు లేవని, మౌలిక వసతులు కల్పిస్తే తాము వెళ్తామని చెప్పినా ఫలితం లేకుండాపోయిందని విలపించారు.
ఒక పక్క ఇళ్లు కూలుస్తారని బాధలో మోతీలాల్ నగర్ వాసులు రోదిస్తూ ఆవేదన వ్యక్తం చేస్తుంటే మరో పక్క సీఐలు, ఎస్ఐలు, కానిస్టేబుళ్లు, ఇతర సిబ్బంది బాధితులను వ్యాన్లోకి ఎక్కించి అరెస్టు చేవారు. కూల్చివేతలు పూర్తయిన తరువాత వారిని వదిలిపెట్టారు. ఇందులో కొంతమంది మహిళా పోలీసులు కూడా అత్యుత్సాహం చూపించారు.
మోతీలాల్ నగర్లో రైల్వే ట్రాక్
వెంబడి ఇళ్లను కూల్చివేసిన
రైల్వే, నగరపాలక సంస్థ అధికారులు
ఉదయం 6 గంటల నుంచి వందలాది
మంది పోలీసులు, జేసీబీలతో
వచ్చి కూల్చివేతలు
ఇప్పుడు తమ పరిస్థితి ఏంటని
బాధితుల ఆందోళన
అన్ని విధాలా తమను నాశనం
చేశారని పాలకులకు శాపనార్థాలు
సామగ్రి తీసుకునే అవకాశం కూడా
ఇవ్వలేదంటూ ఆవేదన
ప్రత్యామ్నాయం చూపకుండానే
కూల్చివేతలు చేపట్టడంపై తీవ్ర ఆగ్రహం


