● మౌలిక వసతులు లేని
చోటుకు వెళ్లమనడం తగదు
● చిన్నారులు, వృద్ధులు,
గర్భిణులతో వెళ్లి ఇబ్బందులు పడలేం
● ఎమ్మెల్యేకు స్పష్టం చేసిన
మోతీలాల్నగర్ వాసులు
● ఇళ్ల కూల్చివేత నిర్ణయంపై మణిపురం
బ్రిడ్జిపై బైఠాయించి నిరసన
నెహ్రూనగర్ : గుంటూరు తూర్పు నియోజకవర్గం పరిధిలో 56వ డివిజన్ మోతీలాల్నగర్లో సుమారు 180 కుటుంబాలు రోడ్డున పడబోతున్నాయి. రైల్వే అధికారులు డ్రైయిన్ నిర్మాణం పేరుతో 60 సంవత్సరాలుగా ఉంటున్న వారి ఇళ్లను కూల్చేందుకు రావడంతో వారంతా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము అభివృద్ధికి అడ్డుకాదని.. ఎక్కడైనా తామంతా కలిసి ఉండే విధంగా ఒక స్థలాన్ని చూపించి ఇల్లు కట్టిస్తే వెళ్లిపోతామని చెబుతున్నప్పటికీ స్థానిక ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తగిన చర్యలు తీసుకోవడం లేదని వాపోతున్నారు. రైల్వే అధికారులు బుధవారం ఉదయం ఇళ్లను కూల్చేందుకు వస్తున్నారని తెలుసుకున్న మంగళవారం రాత్రి మోతీలాల్నగర్ వద్ద ఆందోళన చేయడంతో బుధవారం రాలేదు. గురువారం జేసీబీలతో వచ్చి రైల్వే అధికారులు ఇళ్లు కూల్చేశారని తెలుసుకున్న బాధితులు బుధవారం మణిపురం బ్రిడ్జిపై గంటకుపైగా బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో ట్రాఫిక్ స్తంభించిపోవడంతో పోలీసులు వచ్చి పాతగుంటూరు స్టేషన్కు తరలించారు. కాసేపటి తరువాత పూచీకత్తుపై పంపించి వేశారు.


