లక్ష్మీపురం: గుంటూరులో ఏప్రిల్ 5 నుంచి ఏడో తేదీ వరకు జరగనున్న మహిళా ఉద్యోగులు, శ్రామిక మహిళల 10వ రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని మాజీ శాసనమండలి సభ్యుడు, ఆహ్వాన సంఘం గౌరవాధ్యక్షుడు కేఎస్ లక్ష్మణరావు పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక బ్రాడీపేటలోని సీఐటీయూ నగర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో శ్రామిక మహిళ రాష్ట్ర సదస్సు వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ సమాజంలో సగభాగంగా ఉన్న కార్మికవర్గంలో అధిక భాగంగా ఉన్న మహిళలు, శ్రామిక మహిళల సమస్యలు చర్చించేందుకు శ్రామిక మహిళ పదవ రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కనీస వేతనం, పని భద్రత, లేబర్ కోడ్లు అమలులోకి వస్తున్న నేపథ్యంలో పని ప్రదేశాలలో యాజమాన్యాలు పురుషులు, మహిళలు ఇద్దరి హక్కులను కాలరాయటం అవుతుందన్నారు. శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ జి.రమణ మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, స్కీం వర్కర్లుగా ఉన్నవారికి కనీస వేతనం ఇవ్వాలని, పెరుగుతున్న ధరలకనుగుణంగా వేతనాలు పెంచాలన్నారు. పని ప్రదేశాలలో లైంగిక వేధింపుల నిరోధిక కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. 5న మహిళా కార్మికులకు, ఉద్యోగులకు, పిల్లలకు ఆటల పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. 6వ తేదీ సాయంత్రం 5 గంటలకు యూటీఎఫ్ కార్యాలయంలో మహిళలు ఆరోగ్యం అనే అంశంపై సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా కో కన్వీనర్ కే అనురాధ మాట్లాడుతూ 7వ తేదీన ఎంపిక చేయబడిన ప్రతినిధులతో రాష్ట్రవ్యాప్తంగా శ్రామిక మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించి కార్యాచరణ సిద్ధం చేస్తామని తెలిపారు. సమావేశంలో శ్రామిక మహిళా జిల్లా నాయకులు ఎస్ పద్మ, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బి లక్ష్మణరావు, నగర కన్వీనర్ బి ముత్యాలరావు, కో కన్వీనర్ కే శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.


