నరసరావుపేట: జిల్లా కేంద్రమైన నరసరావుపేటకు రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీఓ)గా నియమితులైన బాలకృష్ణ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేసిన బదిలీల్లో భాగంగా ఆయన నందిగామ నుంచి నరసరావుపేటకు వచ్చారు. ఇక్కడ ఆర్డీఓగా పనిచేసిన కె.మధులతను రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు బదిలీ చేశారు. పలువురు ఉద్యోగులు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలియచేశారు. నరసరావుపేట డివిజన్ అభివృద్ధికి తనవంతు సహాయ సహకారాలు అందజేస్తానని నూతన ఆర్డీఓ వెల్లడించారు.
నగరంపాలెం(గుంటూరు వెస్ట్) : స్థానిక బృందావన్గార్డెన్న్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నయ్య కళావేదికపై పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ మాగంటి మురళీమోహన్ ద్వితీయ నాటకోత్సవాలు, గుమ్మడి శ్రీమన్నారాయణ కళా సమితి, వైకే.నాగేశ్వరరావు నాటక కళాపరిషత్ తొమ్మిదవ వార్షికోత్సవాలను నిర్వహించనున్నట్లు నిర్వాహాకులు కాట్రగడ్డ రామకృష్ణప్రసాద్, బొప్పన నరసింహారావు బుధవారం ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు.
ఈనెల 28, 29, 30 తేదిల్లో నాటకోత్సవాలు కొనసాగుతాయని అన్నారు. 28న ఏపీ సృజనాత్మకత సంస్కృతి సమితి చైర్మన్ తేజస్వినికి డాక్టర్ మురళీమోహన్ రంగస్థల పురస్కారం, మా ఇంట్లో మహాభారతం నాటిక ప్రదర్శిస్తారని తెలిపారు. 29న నువ్వో సగం, నేనో సగం నాటిక, 30న ఆర్యచాణక్య చారిత్రాత్మిక నాటకం ప్రదర్శించనున్నారని అన్నారు.


