లక్ష్మీపురం: రాయగడ ఎక్స్ప్రెస్లో బ్యాగు చోరీ చేసిన తల్లి, కొడుకులను రైల్వే పోలీసులు అరెస్ట్ చేసి బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నట్లు రైల్వే జీఆర్పీ సీఐ వీరబాబు వెల్లడించారు. గురువారం గుంటూరు రైల్వే జీఆర్పీ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జీఆర్పి సీఐ వీరబాబు వివరాలు వెల్లడించారు. ఈనెల 19న రాయగడ ఎక్స్ప్రెస్లో విశాఖ పట్నంకు చెందిన సిద్ధాంతి పద్మావతి, భర్త, బంధువులతో కలిసి రైలులో ప్రయాణిస్తున్నారు. 20వ తేదీ తెల్లవారు జామున సుమారు 3.50 గంటల సమయంలో మంగళగిరి వచ్చేసరికి సామగ్రిని పరిశీలించగా హ్యాండ్ బ్యాగ్ కనిపించలేదు. బ్యాగులో 26 గ్రామలు బంగారు చైన్తో పాటు రూ.7వేల నగదు ఉండగా.. భోగిలో వెతుకులాడారు. కనిపించకపోవడంతో ఈనెల 24వ తేదీన జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రైల్వే ఏఎస్సీ శైలేష్ కుమార్, ఆదేశాల మేరకు గుంటూరు డీఎస్ఆర్పీ అక్కేశ్వరరావు పర్యవేక్షణలో జీఆర్పీ సీఐ వీరబాబు, ఆర్పీఎఫ్ పోలీసుల ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల దర్యాప్తులో పాత నేరస్తుల వివరాలు తీసుకొని యాక్టివ్గా ఉన్న పాత నేరస్తులను విచారించగా.. విజయవాడకు చెందిన చెన్నాడా వినోద్ కుమార్ దొంగతనం చేసినట్టుగా ప్రాథమికంగా నిర్ధారించారు. దీంతో గురువారం ఉదయం 9.40 నిమిషాలకు గుంటూరు రైల్వే స్టేషన్ లోని ఈస్ట్ సైడు రైల్ కోచ్ రెస్టారెంట్ వద్ద ముద్దాయి చెన్నాడ వినోద్ కుమార్ దొంగతనం చేసిన బంగారు గొలుసును అమ్మడానికి తన తల్లి చెన్నాడ నాగరాణి అలియాస్ మైలా నాగరాణి, అలియాస్ గోపిశెట్టి నాగరాణితో కలిసి అక్కడ సంచరిస్తుండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి బంగారు చైన్ను, రూ.2వేలు నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించడంలో ఆర్పీఎస్ఐ మహబూబ్ సుభాని, కానిస్టేబుళ్లు వలి, మస్తాన్, ఆర్పీఎఫ్ సీఐబీ ఇన్స్పెక్టర్ వీరబాబు, శంకర్, ఇతర సిబ్బంది కీలక పాత్ర పోషించారని డీఎస్పీ అక్కేశ్వరరావు తెలిపారు. వారిని ప్రత్యేకంగా అభినందించారు.
దొంగిలించిన బంగారం అమ్ముతున్న తల్లీకొడుకులను అరెస్టు చేసిన రైల్వే పోలీసులు


