బెల్లంకొండ: స్టేషన్ ఉన్న పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు తెలిపారు. శనివారం బెల్లంకొండ పోలీస్ స్టేషన్ను ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్లో రికార్డులు, ఫిర్యాదుల నిర్వహణ, కేసుల వివరాలను పరిశీలించారు. మండలవ్యాప్తంగా సీసీ కెమెరాల నిర్వహణను పరిశీలించి, సిబ్బందికి సూచనలు చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వీలైనంత తొందరగా పెండింగ్ కేసులను పూర్తి చేసి, బాధితులకు న్యాయం చేయాలని ఎస్ఐకు సూచించారు. గ్రామాల్లో నాటుసారా తయారీ, విక్రయాలు, గంజాయి సరఫరా వంటి వాటిపై కఠినంగా వ్యవహరించాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటూ, ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలపై దృష్టి సారించాలని, ఎప్పటికప్పుడు సమాచారం సేకరించాలని ఎస్పీ తెలిపారు. గ్రామాల్లో కార్డెన్ సెర్చ్ ఆపరేషన్లు, పల్లెనిద్ర, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. సత్తెనపల్లి డీఎస్పీ ఎం.హనుమంతరావు, పెదకూరపాడు రూరల్ సీఐ ప్రత్తిపాటి సురేష్, స్థానిక ఎస్ఐ పి.గోపి, పోలీస్ సిబ్బంది ఉన్నారు.
పల్నాడు జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు


