ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు
తిరుమల లడ్డూ విషయమై టీడీపీ చేసిన ఆరోపణలు అబద్ధమని తేలడంతో డైవర్షన్ పాలిటిక్స్కు చంద్రబాబు తెరలేపాలని, అందులో భాగంగానే మాజీ మంత్రి అంబటి రాంబాబుపై దాడికి పాల్పడ్డారని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడి్డ విమర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు. పోలీసుల దగ్గరుండి దాడులను ప్రోత్సహించినట్లు ఉందన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు సరికాదన్నారు. ప్రశాంతమైన గుంటూరులో అశాంతిని నెలకొల్పారన్నారు. ఈ దాడులను పూర్తిగా ఖండిస్తున్నామన్నారు. వెంటనే అంబటి రాంబాబుకు రక్షణ కల్పించాలన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వం పోలీసుల అండతో ఇలాంటి హింసలకు పాల్పడటం సరికాదన్నారు. రాష్ట్రంలో విధ్వంస పాలన నడుస్తోందని, అందుకు నిలువెత్తు నిదర్శనం మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసం పై టీడీపీ గుండాలు దాడి చేయటమేనన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి హింసాత్మక చర్యలకు పాల్పడటం సిగ్గుచేటన్నారు. అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా.. లేదా అర్థం కాని పరిస్థితి ఏర్పడిందన్నారు.


