
అధినేతకు నీరాజనం
వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఊరూరా ఘన స్వాగతం
తాడేపల్లి నుంచి తెనాలి వరకు తరలివచ్చిన పార్టీ శ్రేణులు
పలు వాహనాల్లో అభిమాన నాయకుడిని అనుసరించిన నేతలు
మంగళగిరి టౌన్/దుగ్గిరాల: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అడుగడుగునా ప్రజలు, అభిమానులు నీరాజనం పలికారు. పువ్వులు చల్లి ఘన స్వాగతం పలికారు. జై జగన్.. అంటూ నినదించారు. తెనాలిలో ఇటీవల పోలీసులు నడిరోడ్డుపై యువకులను చితకబాదిన సంగతి విదితమే. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన జాన్ విక్టర్ను, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించడానికి తాడేపల్లిలోని తన నివాసం నుంచి మంగళవారం ఉదయం తెనాలికి వైఎస్ జగన్ బయలుదేరారు. ఈ క్రమంలో తెనాలి చేరుకునే వరకు ప్రతి ఊరు, ప్రతి ప్రాంతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, చిన్నారులు, మహిళలు రోడ్డుపై వేచి చూశారు.
నియోజకవర్గ పరిధిలోని తాడేపల్లి భరతమాత సెంటర్ వద్ద వైఎస్సార్సీపీ తాడేపల్లి పట్టణ అధ్యక్షులు బుర్రముక్కు వేణుగోపాల సోమిరెడ్డి, ఇతర నాయకులు, మాజీ కౌన్సిలర్లు, కార్యకర్తలతో కలిసి స్వాగతం పలికారు. అనంతరం కుంచనపల్లి ప్రాతూరు అండర్ పాస్ వద్ద వైఎస్సార్సీపీ రూరల్ అధ్యక్షులు అమరా నాగయ్య, మాజీ అధ్యక్షులు పాటి బండ్ల కృష్ణమూర్తి, మిరియాల రాంబాబు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికారు.
మంగళగిరి నియోజకవర్గ విద్యార్థి విభాగం నాయకులు పులగం సందీప్రెడ్డి, లీగల్ సెల్ అధ్యక్షులు కలకోటి సునీల్ తదితరులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ వెంట బైక్లు, కార్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. మంగళగిరి పట్టణ పరిధిలోని తెనాలి రోడ్డులో వైఎస్సార్సీపీ పట్టణ, రూరల్ అధ్యక్షులు ఆకురాతి రాజేష్, నాలి వెంకటకృష్ణ, బీసీ సెల్ నాయకులు కుంచాల కిషోర్ తదితరులు స్వాగతం పలికారు. మంగళగిరి నుంచి తెనాలి వెళ్లే మార్గంలో పెదవడ్లపూడి పైవంతెన వద్ద వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో చేరుకుని పూలవర్షం కురిపించారు. వైఎస్ జగన్ తన కాన్వాయ్ను ఆపి, ప్రజలకు అభివాదం చేశారు. చుట్టుపక్కల గ్రామస్తులు కూడా అక్కడకు చేరుకుని వైఎస్ జగన్తో కరచాలనం చేసేందుకు ఎగబడ్డారు.
తనకోసం వచ్చిన వారందరినీ నవ్వుతూ పలకరించిన ఆయన.. అందరితో కరచాలనం చేశారు. తర్వాత అక్కడి నుంచి ముందుకు కదిలారు. దుగ్గిరాల మండల పరిధిలో మోరంపూడి సర్పంచ్ ఇత్తడి రమేష్, ఇతర గ్రామాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. దుగ్గిరాల లాకుల వద్ద మండల అధ్యక్షులు శివగోపయ్య, పెరికలపూడి సర్పంచ్ గంపల గంగాధర్, సీనియర్ నాయకులు తిమోతి, నాగేశ్వరరావు, రామకోటిరెడ్డి తదితర నాయకులు వైఎస్ జగన్ రాకకోసం వేచి చూశారు.
తమ అభిమానాన్ని చాటేందుకు పెద్ద ఎత్తున పూలతో ఘన స్వాగతం పలికారు. అధిక సంఖ్యలో జనం తరలి రావడంతో ఆ కూడలి నుంచి బయటకు రావడానికి వైఎస్ జగన్కు కొన్ని నిమిషాలు సమయం పట్టింది. కార్యకర్తల కోసం కాన్వాయ్ ఆపి మరీ వైఎస్ జగన్ అభివాదం చేయడంతో వారందరూ ఆనందోత్సాహంతో కేరింతలు కొట్టారు. సంతోషం వ్యక్తం చేశారు. అభిమానులు బైక్ ర్యాలీలు, కార్లలో, పలు, ఇతర వాహనాలలో అనుసరించగా.. దుగ్గిరాల నుంచి తెనాలికి జన సందోహం నడుమ వైఎస్ జగన్ వెళ్లారు.