CM Jagan Will Lay Foundation Stone For Construction Of Houses For EWS Category - Sakshi
Sakshi News home page

కష్టం తెలిసిన సీఎం.. పేదింటికి మంచి ఘడియలు

Jul 24 2023 1:28 AM | Updated on Jul 24 2023 8:46 AM

- - Sakshi

వరాల రేడు వస్తున్నట్టు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుందో ఏమో.. ఉత్సాహం ఉరకలెత్తుతోంది. పేదింటికి మంచి ఘడియ రాబోతున్నట్టు మంగళాద్రి వేదంలా ఘోషిస్తుందో ఏమో.. శాసన రాజధాని సంతోషగానం చేస్తోంది. ‘ఇంటి’వేల్పు కరుణించినట్టు మోడల్‌ హౌస్‌ మురిసిపోతుందో ఏమో.. కోటి ఆశలతో కృష్ణాయపాలెం నిరీక్షిస్తోంది. కొంగొత్త కలలతో జననేతకు స్వాగతం.. సుస్వాగతం.. అంటూ ఆహ్వానం పలుకుతోంది.

మంగళగిరి: మండలంలోని కృష్ణాయపాలెం జగనన్న లేఅవుట్‌లో ఇళ్ల నిర్మాణాలకు సోమ వారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అట్టహాసంగా శంకుస్థాపన చేయనున్నారు. గుంటూరు, ఎన్టీఆర్‌ జిల్లాలతోపాటు మంగళగిరి నియోజకవర్గం పెదకాకాని మండలంలోని మొత్తం 53 వేల మంది పేదలకు ప్రభుత్వం ఇక్కడ ఇళ్లస్థలాలు ఇచ్చి పట్టాలు పంపిణీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన జరగనుంది. దీనికోసం కృష్ణాయపాలెంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఘనస్వాగతం పలికేందుకు లబ్ధిదారులు, స్థానిక ప్రజలు వేయి కళ్లతో నిరీక్షిస్తున్నారు. ఫలితంగా పండగ వాతావరణం నెలకొంది. ఇక్కడ 53 వేల మందికి ఇళ్ల నిర్మాణం పూర్తయితే కొత్తగా 25 ఊళ్లు ఆవిర్భవించనున్నాయి. దాదాపు 2.50 లక్షల మంది జనాభాకు ఆవాసం కానున్నాయి.

బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు
తాడికొండ: పేదల ఇళ్లకు శంకుస్థాపన అనంతరం తుళ్లూరు మండలం వెంకటపాలెం తిరుమల తిరుపతి ఆలయం సాక్షిగా జరగనున్న బహిరంగ సభకు అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ పనులను పలువురు నాయకులు, అధికారులు ఆదివారం పరిశీలించారు. సీఎం కార్యక్రమాల కో–ఆర్డినేటర్‌ తలశిల రఘురామ్‌, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, ప్రభుత్వ సలహాదారు బత్తుల బ్రహ్మానందరెడ్డి, గుంటూరు మేయర్‌ కావటి మనోహర్‌ నాయుడు, వైఎస్సార్‌ సీపీ తాడికొండ సమన్వయకర్త కత్తెర సురేష్‌తోపాటు పలువురు అధికారులు, సిబ్బంది ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు. సభా వేదిక, గ్యాలరీ, సందర్శకులు, వీఐపీ, మీడియా పాయింట్‌ పనులపై సూచనలు చేశారు. బందోబస్తు కోసం భారీగా పోలీసులు తరలివచ్చారు.

పరిశీలించిన మంత్రులు
బహిరంగ సభ ఏర్పాట్లను ఆదివారం మంత్రులు ఆదిమూలపు సురేష్‌, విడదల రజిని, జోగి రమేష్‌, బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌, సీఆర్డీఏ కమిషనర్‌ వివేక్‌ యాదవ్‌, కలెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి కూడా పరిశీలించారు. సూచనలు, సలహాలు ఇచ్చారు. మంగళగిరి మండలం కృష్ణాయపాలెం లేఅవుట్‌లో ముఖ్యమంత్రి ఆవిష్కరించనున్న పైలాన్‌, మోడల్‌ హౌస్‌ను పరిశీలించి సూచనలు ఇచ్చారు. మొక్కలు నాటే పనుల ఏర్పాట్లు, హెలీప్యాడ్‌ పనులనూ పరిశీలించారు. కార్యక్రమంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మేనేజింగ్‌ డైరెక్టర్‌ లక్ష్మీ శా, తెనాలి సబ్‌ కలెక్టర్‌ గీతాంజలి శర్మ, పలువురు జిల్లా, మండల స్థాయి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

పేదల కష్టం తెలిసిన సీఎం
జగనన్న కాలనీలో జరుగుతున్న పనులతో మరికొద్ది రోజుల్లోనే సొంతిల్లు యజమాని కాబోతుండటం ఆనందంగా ఉంది. ఇక్కడ నిర్మించిన మోడల్‌ హౌస్‌ బాగుంది. నాలాంటి పేదలు స్థలం కొని ఇల్లు కట్టుకోవడం గగనమే. పేదల కష్టం తెలిసిన జగనన్న మాకు సొంతిల్లు ఏర్పరచడం ఎంతో సంతోషంగా ఉంది. ఆయన రుణం తీర్చుకోలేం.
– శంకవరపు కోమలి, కృష్ణాయపాలెం

జగనన్న మేలు మర్చిపోలేం
ఎంతో విలువైన ప్రాంతంలో స్థలం ఇవ్వడమే కాకుండా వెంటనే ఇల్లు నిర్మించేందుకు ప్రభుత్వం కృషి చేయడం అభినందనీయం. పేదలకు ఇంత పెద్ద ఎత్తున స్థలాలు ఇచ్చి ఇళ్లు కట్టించి ఇవ్వనుండటంతో పేదలంతా ఎంతో ఆనందంగా జీవిస్తారు. జగనన్న మేలు మర్చిపోలేం.

– దానబోయిన శ్రీనాగజ్యోతి, ఉండవల్లి

వసతులు బాగున్నాయి
జగనన్న కాలనీలో వసతులు చాలా బాగున్నాయి. రోడ్లు, విద్యుత్‌ సౌకర్యం ఇప్పటికే పూర్తి కావొచ్చాయి. అతి కొద్దికాలంలోనే సొంతింటి కల నెరవేరనుండటంతో చాలా సంతోషంగా ఉంది. జగనన్నకు జీవితాంతం అండగా ఉంటాం. ఆయన రుణం తీర్చుకుంటాం.
– అల్లం కృష్ణకుమారి, ఉండవల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement