అరాచకం ఖాకీచకం | - | Sakshi
Sakshi News home page

అరాచకం ఖాకీచకం

Jun 3 2025 6:31 AM | Updated on Jun 3 2025 6:55 AM

-

రెడ్‌బుక్‌ రాజ్యాంగం కేరాఫ్‌ గుంటూరు 

రెడ్‌బుక్‌ నిర్మాత లోకేష్‌ జిల్లాలో తందనా అంటున్న పోలీసులు 

 వందల మందిపై అక్రమ కేసులు 

 పాత కేసులు బయటకు తీసి అక్రమ అరెస్టులు 

 సోషల్‌ మీడియా కార్యకర్తలను పలు జిల్లాల్లో కేసులు పెట్టి తిప్పిన వైనం 

 ఆటవిక రాజ్యాన్ని తలపిస్తూ రోడ్డు పైనే అరికాలి కోటింగ్‌ 

 పోలీస్‌ వేధింపులతో మనస్తాపం చెంది ఒక వ్యాపారి ఆత్మహత్య 

 పోస్టుమార్టం చేయకుండానే మృతదేహం తరలింపు  

నేడు తెనాలికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాక 

సాక్షి ప్రతినిధి, గుంటూరు: రెడ్‌బుక్‌ రాజ్యాంగానికి గుంటూరు జిల్లా కేరాఫ్‌ అడ్రస్‌గా మారుతోంది. రెడ్‌బుక్‌ను ప్రవేశపెట్టిన మంత్రి నారా లోకేష్‌ ప్రాతినిధ్యం వహించే జిల్లా కావడంతో పోలీసులు మరింత అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే పలు పాత కేసులు తిరగదోడి వందల మంది పార్టీ నాయకులు, కార్యకర్తలపై కేసులు పెడుతున్నారు. సోషల్‌ మీడియా కార్యకర్తలపై వేధింపులకు అడ్డులేకుండా పోయింది. తెనాలి పోలీసులు ఒక కేసులో నిందితులకు నడిరోడ్డుపై అరికాలి కోటింగ్‌ ఇచ్చి తమ ప్రతాపం చూపించారు. దీనిపై ఎన్ని విమర్శలు వచ్చినా, ఎస్సీ కమిషన్‌ వివరణ అడిగినా బాధ్యులను ప్రభుత్వం వెనకేసుకొస్తోంది.

అక్రమ కేసులు

  •  వైఎస్సార్‌సీపీలో చురుగ్గా ఉండే నేతలను టార్గెట్‌ చేశారు. పెదనందిపాడు మండలం వరగానికి చెందిన వైఎస్సార్‌ సీపీ కార్యకర్త ముల్లమూరి హరిప్రసాద్‌ (నాని)పై టీడీపీ నేతలు దాడిచేసి హత్య చేశారు.

  •  మాజీ ఎంపీ నందిగం సురేష్‌పై అక్రమంగా 12 కేసులు పెట్టి జైలులో పెట్టారు. బెయిల్‌పై విడుదలైన తర్వాత మళ్లీ హత్యాయత్నం కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

  • ఆత్మకూరులోని టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడిలో పార్టీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, విజయవాడ పార్లమెంట్‌ ఇనన్‌చార్జి దేవినేని అవినాష్‌, మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిలతో పాటు మరో 42 మందిపై కేసులు నమోదు చేశారు.

  •  దుగ్గిరాల మండలంలో కౌంటింగ్‌ రోజు వైఎస్సార్‌ సీపీ సోషల్‌ మీడియా కార్యకర్తపై దాడి చేయడానికి వచ్చిన టీడీపీ కార్యకర్తలను అడ్డుకునే సమయంలో ఓ వ్యక్తి గాయాల పాలై మృతి చెందగా, ఈ కేసులో సోషల్‌ మీడియా కార్యకర్త కరీమ్‌తో పాటు జెడ్పీటీసీ భర్త వీరయ్యతో పాటు జాన్సన్‌, మరో 20 మందిపై హత్య కేసు నమోదు చేశారు. తాజాగా వీరయ్యపై మరో మూడు కేసులు నమోదు చేశారు.

  •  ఎన్నికలకు ముందు వైఎస్సార్‌ సీపీ నాయకుడు వెంకటరెడ్డిని ఉద్దేశపూర్వకంగా బండితో గుద్దడంతో వెంకటరెడ్డి మృతి చెందగా, వైఎస్సార్‌ సీపీ నాయకులపైనే కేసులు నమోదు చేశారు. దానికి ప్రతీకారంగా ఎన్నికలైన ఆరు నెలల తరువాత వైఎస్సార్‌ సీపీ నాయకులు మున్నంగి వివేకానందరెడ్డి, జక్కిరెడ్డి కృష్ణారెడ్డి, మేకా వెంకటరామిరెడ్డిపై హత్యాయత్నం కేసులు నమోదు చేశారు.

  • సోషల్‌ మీడియా రాష్ట్ర కో–ఆర్డినేటర్‌ మేకా వెంకటరామిరెడ్డిపై 18 కేసులు నమోదు చేశారు. మహిళా నాయకురాలు పాలేటి కృష్ణవేణిపై ఒక కేసు నమోదు చేశారు.

     మంగళగిరి రూరల్‌ పరిధిలో జరిగిన చిన్న గొడవలను ఆసరాగా 10 మంది వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు.

  •  వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త గుంటూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్‌, అప్పటి వైఎస్సార్‌ సీపీ నగర అధ్యక్షుడిగా పదవి వచ్చిన సమయంలో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీకి అనుమతి లేదంటూ కూటమి నేతలు వీఆర్‌ఓ చేత అక్రమ ఫిర్యాదు చేయించి కేసు నమోదు చేశారు.

  •  తాడికొండ మండలం కంతేరు గ్రామంలో రాజకీయ కక్షతో ఎంపీటీసీ, దళిత మహిళ వలపర్ల కల్పనపై అక్రమంగా కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. కంతేరు గ్రామానికి చెందిన జిల్లా యువజన విభాగం అధ్యక్షుడిగా పనిచేసిన కళ్లం హరికృష్ణారెడ్డిపై కూడా అక్రమంగా కేసులు బనాయించి జైలుకు పంపించారు.

  •  తుళ్లూరు మండలం పెదపరిమి గ్రామంలో దళితులపై దాడులు నిర్వహించి ఇబ్బందులకు గురి చేయడంతో గ్రామంలో 20 మంది ఎస్సీలు గ్రామంలో లేకుండా వేరు ప్రాంతాల్లో తలదాచుకుంటున్నారు. ఇప్పటికీ వారు గ్రామానికి రాలేదు.

  •  ఫిరంగిపురం మండలం గరుడాచలం పాలెంలో ఎన్నికల అనంతరం కూటమి నేతలు దళితులపై దాడులు చేసి ఎదురు చెప్పిన వారిపై అక్రమ కేసులు నమోదు చేశారు. ఫిరంగిపురం మండలం పొనుగుపాడు గ్రామంలో అగ్రవర్ణాలు కూటమి ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకుని తమకు రహదారి సౌకర్యం కోసం చర్చి ప్రహరీని వందలాది మంది పోలీసులను మోహరింప చేసి కూల్చి వేశారు. ఎదురించిన వారిపై అక్రమ కేసులు బనాయించారు.

  •  వైఎస్సార్‌ సీపీ వట్టిచెరుకూరు మండలం మండల కన్వీనర్‌ మన్నవ వీర నారాయణపై అక్రమంగా కూటమి నేతలు కేసులు నమోదు చేశారు.

బెదిరించి.. ఆత్మహత్యకు పురిగొల్పి 
బంగారం షాపులో పనిచేసే వ్యక్తి బంగారంతో పరారు అయ్యాడన్న కేసులో, తెనాలిలో బంగారం బట్టీ నిర్వహించే సిద్దేశ్‌ అనే వ్యక్తిని పోలీసు స్టేషన్‌కు పిలిపించి తమదైన శైలిలో మాట్లాడటంతో అదేరోజు రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక కేసులో రిసీవర్‌గా ఉన్న వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటే పోలీసు మాన్యువల్‌ ప్రకారం పోస్టుమార్టం చేయించాలి. అయితే కుటుంబ సభ్యులు అడిగినందున, ఫిర్యాదు ఏమీ లేనందున పోస్టుమార్టం చేయించలేదని పోలీసులు చెప్పడం గమనార్హం. ఈ కేసు తమకు చుట్టుకుంటుందన్న భయంతో సిద్దేశ్‌ కుటుంబ సభ్యులు, యూనియన్‌ సభ్యులపై ఒత్తిడి తీసుకువచ్చి మృతదేహాన్ని వారి స్వస్థలానికి ఆఘమేఘాలపై పంపించేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. తెనాలి పోలీసుల పైశాచిక దాడికి గురైన బాధితులను పరామర్శించేందుకు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం తెనాలి పర్యటనకు వస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement