పాలమూరు మట్టిబిడ్డల ఇంటి ఇలవేల్పుగా వెలుగొందుతున్న అమ్మాపురం శ్రీకురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన ఉద్దాల ఉత్సవం మంగళవారం భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ముత్యాల పల్లకీలో దళిత పూజారులు ఉద్దాలను తీసుకురాగా వేలాది మంది భక్తులు వాటిని తాకి పునీతులయ్యారు.
చిన్నచింతకుంట మండలం చిన్నవడ్డెమాన్లోని ఉద్దాల మండపం నుంచి కురుమూర్తిస్వామి ఆలయం వరకు దారి పొడవునా ఆయా గ్రామాల ప్రజలు ఉద్దాలకు మంగళహారతులతో స్వాగతం పలికారు.
కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాల్లో ప్రధానమైన ఘట్టమైన ఉద్దాల ఉత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు.
వడ్డెమాన్లోని ఉద్దాల మండపంతోపాటు జాతర మైదానం జనం హోరెత్తింది. భక్తులు స్వామివారి పాదుకలను దర్శించుకునేందుకు పోటీ పడ్డారు. దీంతో కురుమూర్తి సప్తగిరులు అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడి నామస్మరణతో మార్మోగాయి.


