
అభిప్రాయం
వలసానంతర భారత చరిత్రలో అత్యంత ప్రాధాన్యత గల పరిణామమైన ఎమర్జెన్సీకి ఈ జూన్ 25 అర్ధరాత్రికి యాబై ఏళ్లు నిండాయి. ప్రాథమిక హక్కులను రద్దు చేసి ప్రజల హక్కులను కొల్లగొట్టడం, అక్రమంగా నిర్బంధించడం, బలవంతపు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సల వంటి ఇష్టారాజ్యపు విధానాలను రుద్దడం, నగర సుందరీకరణ పేరుతో నివాస స్థలాలను కూల్చి వేయడం, అధికార, న్యాయ వ్యవస్థలను సొంత ప్రయోజనాల కోసం దుర్విని యోగం చేయడం భారత రాజ్యానికి కొత్తేమీ కాదు గానీ, ఆ పనులన్నీ జరిగిన ఎమర్జెన్సీకి ఆ స్థాయిలో అపకీర్తి రావడానికి ఒక కారణం ఉంది. అప్పటివరకూ ఆ దమనకాండ అంతా సాధారణ ప్రజల మీద అమలవుతుండినప్పటికీ, ఎమర్జెన్సీయే మొదటిసారిగా మధ్యతరగతికి, తెల్లబట్టలవాళ్లకు, పార్లమెంటరీ రాజకీయ ప్రత్యర్థులకు కూడా భారత రాజ్యపు దెబ్బల రుచి చూపింది.
పాఠాలు నేర్చుకున్నామా?
ఆ ఎమర్జెన్సీ కాళరాత్రి గడిచిపోయి ఐదు దశాబ్దాలు గడిచింది. ఇందిరా గాంధీతో సహా ఆ కాళ రాత్రికి కారకులైనవారిలో అత్యధికులు మరణించారు. బాధితులలో కూడా చాలా మంది మరణించారు, లేదా తమ జీవితపు చరమాంకంలో ఉన్నారు. ఇప్పుడు ఆ పాత ఎమర్జెన్సీ గురించి తెలుసుకోవడం, అధ్యయనం చేయడం, విమర్శించడం కేవలం అకడమిక్ ఆసక్తే తప్ప వర్తమాన ఆచరణ కాదు. కాకపోతే ఆ ఎమర్జెన్సీ అనుభవం తర్వాత ఈ దేశం మరెప్పుడూ అటువంటి పరిస్థితి రాగూడదని ఆకాంక్షించింది గనుక వర్తమాన పాలనలను విమర్శనాత్మకంగా చూడటం అవసరం, సముచితం కూడా!
ఎమర్జెన్సీ అనంతరం వేలాది పేజీల వివరణలు, విమర్శలు, విశ్లేషణలు వచ్చాయి. బాధితులు ఎవరైనప్పటికీ ఎమర్జెన్సీ అత్యాచారాలకు అటువంటి నిరసన రావడం సముచితమే. ఆ నిరసన వ్యాప్తి వల్లనే 1977 మార్చ్ ఎన్నికలలో ఇందిరా గాంధీ, కాంగ్రెస్ పార్టీ దిగ్గజాలు ఓటమికి గుర య్యారు. ఆ ఎన్నికల్లో గెలిచిన జనతా పార్టీ ప్రభుత్వం ఎమ ర్జెన్సీ అత్యాచారాలను పరిశో ధించడానికి, విచారణ జరపడా నికి మాజీ ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ జయంతిలాల్ ఛోటాలాల్ షా నేతృత్వాన 1977 మేలో ఒక కమిషన్ను నియమించింది. షా కమిషన్గా సుప్రసిద్ధమైన ఈ కమిషన్ అనేకమంది సాక్షులను విచారించి, సాక్ష్యాధారాలు సేకరించి 1978 మార్చ్, ఏప్రిల్, ఆగస్ట్ లలో మూడు భాగాల నివేదిక సమర్పించింది.
వర్తమాన వాస్తవం
ఆ 543 పేజీల నివేదికను ఇప్పుడు చదువుతుంటే అదేదో గడిచిపోయిన దుర్ఘటనల మీద చారిత్రక పత్రం అనిపించదు. నామవాచకాలు మారిస్తే, గత పదకొండు సంవత్సరాల పాలనా వ్యవహారాల మీద నివేదిక కావ చ్చునని అనిపిస్తుంది. ఈ పాల కులు ఆ ఎమర్జెన్సీ బాధితులు కావడం, ఇప్పటికీ ఆ ఎమర్జెన్సీని నిరంతరం విమర్శిస్తుండటం, తమ పాలనలో పదకొండు సంవత్సరాలుగా అవే ఎమర్జెన్సీ విధానాలను ఎమర్జెన్సీ ప్రకటించకుండానే అమలు చేస్తుండటం క్రూరమైన పరిహాసం.
‘‘ఆచరణలో, ప్రభుత్వానికి అనుకూలంగా లేని వార్తలను తొక్కిపట్టడానికి, ప్రభుత్వానికి అనుకూ లమైన వార్తలను పైకెత్తడానికి, కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులకు అనుకూలంగా లేని వార్తలను తొక్కి పట్టడానికి సెన్సార్షిప్ విధానాన్ని దుర్వినియోగం చేశారు’’ అని అప్పుడు షా కమిషన్ నివేదిక రాసింది. ఇప్పుడు అధికారికంగా సెన్సార్షిప్ విధానం ఏమీ లేదు. కానీ ప్రభుత్వానికి, అధికార పార్టీకి అనుకూలంగా లేని వార్తలను తొక్కిపెట్టే విధానాలు ముమ్మరంగా సాగుతున్నాయి.
అప్పుడు ఎమర్జెన్సీలో ఆంతరంగిక భద్రతా చట్టం (మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్– మీసా), డిఫెన్స్ ఆఫ్ ఇండియా రూల్స్ అనే ముందస్తు నిర్బంధ చట్టాలను వినియోగించుకుని, కారణాలు చూపకుండా, విచారణ జరపకుండా లక్ష మందిని ఇరవై ఒక్క నెలల పాటు నిర్బంధించారు.
ఇప్పుడు బెయిల్ ఇవ్వడాన్ని కఠినతరం చేసే సవరణలతో చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఆన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్) కింద వేలాది మందిని నిర్బంధించి, అబద్ధపు ఆరోపణలతో, విచారణ లేకుండా ఏళ్ల తరబడి నిర్బంధిస్తున్నారు. అప్పుడు ఒక్క తుర్క్మన్ గేట్ మురికివాడ కూల్చివేత జరిగితే, ఇప్పుడు కనీసం అర డజను రాష్ట్రాల నుంచి కూల్చివేతల వార్తలు నిరంతరం వస్తున్నాయి.
‘‘ప్రభుత్వంలోనో, ప్రభుత్వానికి దగ్గరగానో ఉన్న ఒక వ్యక్తి, లేదా ఒక బృందం వ్యక్తిగత ప్రయో జనాలు నెరవేర్చడం కోసం అధికారిక యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయడం భవిష్యత్తులో జరగకుండా ఉండే చర్యలను చేపట్టడం వర్తమాన, భావి తరాల కోసం జాతి చేయవలసిన పని’’ అని జస్టిస్ షా 1978లో రాశారు. ఆ హితవచనంలో ప్రస్తావించిన వ్యక్తీ, బృందమూ మారి ఉండవచ్చు గాని నేటికీ పరిస్థితి ఏమాత్రం మారలేదు. యాభై ఏళ్లు నిండిన సందర్భంగా చాలా మంది నాటి ఎమర్జెన్సీని సరిగ్గానే తలచు కున్నారు. కానీ కొనసాగుతున్న అప్రకటిత ఎమర్జెన్సీ సంగతి ఏమిటి?
ఎన్. వేణుగోపాల్
వ్యాసకర్త ‘వీక్షణం’ సంపాదకుడు