నరేంద్ర మోదీ (భారత ప్రధాని) రాయని డైరీ | PM Narendra Modi Rayani Diary | Sakshi
Sakshi News home page

నరేంద్ర మోదీ (భారత ప్రధాని) రాయని డైరీ

Jun 7 2026 4:05 AM | Updated on Jun 7 2026 4:05 AM

PM Narendra Modi Rayani Diary

మాధవ్‌ శింగరాజు

జూన్‌ 10కి, ప్రధానిగా నాకు 4,398 నిండి 4,399 వస్తాయి! మహాపురుషుడు జవహర్‌ లాల్‌ నెహ్రూ పాలనా కాలాన్ని దాటేస్తున్నందువల్ల నాకు కలుగుతున్న గుర్తింపే తప్ప, అదేమీ నాకు మాత్రమే ప్రత్యేకమైన గుర్తింపు కాదు. బుధవారం, ఢిల్లీలోని అశోక హోటల్లో కూటమి మిత్రులు నన్ను సన్మానించేందుకు సిద్ధం అవుతున్నారు! ‘‘అవసరమా!’’ అని నేను వారిని ప్రశ్నించాను. ‘‘అవును మోదీజీ, ఇది చరిత్రాత్మక అవసరం’’ అన్నారు మిత్రులు. ‘‘ఇందులో నేను సాధించినది ఏమిటి?’’ నన్ను నేను ప్రశ్నించుకున్నాను. ‘‘సుదీర్ఘ పదవీ కాలం... నిరంతర పాలన...’’ అని వారి నుంచి సమాధానం వినిపించింది! సుదీర్ఘ పదవీ కాలానికీ, నిరంతర పాలనకూ ఒకరిని దాటుకుని పోవటమే కొలమానం, కాలమానం అయితే... పండిట్‌ నెహ్రూ పదవీ కాలాన్ని కాక, నెహ్రూ అంతటివారిని దాటుకుని రావటమే ఏ ప్రధానికైనా అసలైన గుర్తింపు. దురదృష్టవశాత్తూ ఆ గుర్తింపును ఆయన కుమార్తె కూడా దక్కించుకోలేక పోయారు. 

శ్రీమతి గాంధీ 4,077 రోజులు మాత్రమే నిరవధికంగా ప్రధానిగా ఉన్నారు. తక్కిన ప్రధానులలో దీర్ఘకాలం పాలనలో ఉన్నవారు మన్మోహన్‌ సింగ్‌ ఒక్కరే. ఆయన 3,656 రోజులు ప్రధానిగా కొనసాగారు. ఎవరూ కూడా దరిదాపుల్లోనికైనా వెళ్లలేని మహనీయుడు నెహ్రూజీ. 2019లో, రెండోసారి నేను ప్రధాని అయినప్పుడు ఇదే జూన్‌ నెలలో లోక్‌సభలో పండిట్‌ నెహ్రూ మాటల్ని గుర్తు చేసుకున్నాను. దేశాన్ని కర్తవ్య మార్గంలో నడిపించాలని నెహ్రూజీ కన్న కలను, మనమందరం కలిసి నెరవేర్చాలని ఆకాంక్షించాను. 2023లో కొత్త పార్లమెంట్‌ భవన్‌లోకి మారినప్పుడు కూడా, ఆ ప్రారంభోత్సవంలో, ఎంతో గొప్పదైన నెహ్రూజీ ‘ట్రిస్ట్‌ విత్‌ డెస్టినీ’ ప్రసంగం దేశానికి ఒక శాశ్వతమైన, సామూహిక భావోద్వేగంగా నిలిచిపోయిందని గుర్తు చేశాను.

అటువంటి మహోన్నతుడిని ఎవరు దాటగలరు? ఎప్పటికి దాటగలరు? ‘‘లేదు మోదీజీ, మీ 12 ఏళ్ల నిరంతర పాలనను శ్లాఘిస్తూ ప్రత్యేక సంయుక్త తీర్మానాన్ని ప్రవేశపెట్టే భాగ్యాన్ని మాకు కల్పించాల్సిందే’’ అని కూటమి మిత్రుడు చంద్రబాబు నాయుడు పట్టుబట్టారు. ఆయనతో పాటుగా మిగతా కూటమి ముఖ్యమంత్రులు– మేఘాలయ నుంచి కాన్రాడ్‌ సంగ్మా, నాగాలాండ్‌ నుంచి నీఫియు రియో, పుదుచ్చేరి నుంచి రంగస్వామి, సిక్కిం నుంచి ప్రేమ్‌ సింగ్‌ తమాంగ్‌– వారి వారి రాష్ట్రాల పూలగుత్తులు, ప్రతిపత్తులు, ప్రభుభక్తులతో ఢిల్లీకి రాబోతున్నారు! ఆ రోజు నేను, ఏ మాత్రం నా గురించి కాక, నెహ్రూజీ గురించి మాత్రమే ప్రసంగించటం సభా మర్యాద.

ఇదే మర్యాదను నేను 2015లో బ్రిటిష్‌ పార్లమెంటులో ప్రసంగిస్తున్నప్పుడు పాటించాను. భారతదేశానికీ, బ్రిటన్‌కూ మధ్య మేధో వారథిగా నిలిచిన నెహ్రూను మనసారా స్మరించాను. ఆయన రాజకీయాలతో నేను ఏకీభవించక పోవచ్చు, కానీ రాజకీయాలకు అతీతంగా ఆయన్ని నేను గౌరవిస్తాను. పండిట్‌జీ నుంచి మన్మోహన్‌సింగ్‌ వరకు ప్రతి ప్రధానీ దేశాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేసినవారే. రెండుసార్లు, రెండు 13 రోజులపాటు మాత్రమే ప్రధానిగా ఉన్న గుల్జారీలాల్‌ నందా కూడా ఆ కృషిలో ముఖ్య భాగం కలిగివున్నవారే. ఈ రోజు నేనున్న స్థానం, రేపు నేను చేరుకోబోతున్న సంఖ్య... గతాన్ని వెనక్కు నెట్టేసేవి కాదు, భారతదేశ భవిష్యత్తుకు బలమైన పునాదిని వేసేవి. పరుగుల కన్నా ప్రవాహం ముఖ్యం. ఆ, కాల ప్రవాహంలో నేనొక కార్యకర్తను. 4399 అనేది నా బ్యాడ్జి నంబర్‌. అంతే!  

Advertisement
 
Advertisement
Advertisement