
వరుణ మహర్షి కొడుకు భృగు మహర్షి. తండ్రి వద్ద భృగువు సకల శాస్త్రాలూ నేర్చుకున్నాడు. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత భృగువుకు బ్రహ్మజ్ఞానం సాధించాలనే కోరిక కలిగింది. ఒకనాడు తండ్రి వద్దకు వెళ్లి తనకు బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించమని అడిగాడు.
‘కుమారా! అన్న ప్రాణ నేత్ర శ్రోత్ర మనో వాక్కులన్నీ పరబ్రహ్మ సాధనకు మార్గాలే! వీటన్నింటిలోనూ బ్రహ్మతత్త్వం ఇమిడి ఉంది. అది దేని నుంచి ఉత్పన్నమైనదో, దేనితో పోషణ పొందుతున్నదో, చివరకు దేనిలో లయమవుతున్నదో, దానికి మూలమేమిటో తెలుసుకోవాలి. దానిని తపస్సు ద్వారా మాత్రమే సాధించాలి. అందువల్ల వెళ్లి తపస్సు చెయ్యి’ అన్నాడు.
తండ్రి ఆదేశంతో భృగు మహర్షి దీక్ష తీసుకుని, ఒక నిర్జనారణ్యానికి చేరుకుని, అక్కడ నియమ నిష్ఠలతో తపస్సు ప్రారంభించాడు. కొంతకాలం గడిచాక ‘అన్నమే పరబ్రహ్మ స్వరూపం’ అని అతడికి స్ఫురించింది. అన్నం ద్వారానే అన్ని ప్రాణులూ ఉత్పన్నమవుతున్నాయి. అన్నం వల్లనే పోషణ పొందుతున్నాయి. అన్నం భూమి నుంచి పుడుతోంది. మరణించిన తర్వాత అన్ని ప్రాణులూ ఈ భూమిలోనే కలసిపోతున్నాయి. కాబట్టి ‘అన్నమే పరబ్రహ్మ స్వరూపం’ అని నిర్ధారణకు వచ్చాడు. వెంటనే తండ్రి వద్దకు వెళ్లి ఇదే విషయాన్ని తెలియజేశాడు.
భృగువు మాటలు విన్న వరుణ మహర్షి, ‘కుమారా! నువ్వు ఇంకా మొదటి మెట్టు మీదనే ఉన్నావు. ఇంకా సాధన చేయాలి’ అన్నాడు.
భృగు మహర్షి మళ్లీ అడవులకు వెళ్లి, తపస్సు చేయడం ప్రారంభించాడు. ఇంకొంత కాలం గడిచింది. ‘ప్రాణమే బ్రహ్మ’ అని ఆయన గ్రహించాడు. లోకంలోని సమస్త జీవులు ప్రాణం వల్లనే జీవిస్తున్నాయి. ప్రాణం ఉన్నప్పుడే మనుగడ సాగిస్తున్నాయి. ప్రాణం పోయినప్పుడు మృత్యువులో లయమైపోతున్నాయి అందుకే ప్రాణమే సర్వసృష్టికి మూలాధారమని భావించి, ఇదే సంగతిని తండ్రికి చెప్పాడు.కొడుకు మాటలకు వరుణుడు నవ్వి, ‘కుమారా! ఇదివరకటి కంటే కాస్త ముందుకు వెళ్లావు. ప్రాణం వల్లనే జీవులు మనుగడ సాగిస్తున్నా, ప్రాణమే బ్రహ్మ కాదు. బ్రహ్మజ్ఞానం నీకు పూర్తిగా అవగతం కావాలంటే, మరింత సాధన అవసరం. ఇంకా తపస్సు కొనసాగించు’ అన్నాడు.
తండ్రి మాటలకు భృగుమహర్షి నిరాశ చెందకుండా, యథప్రకారం మళ్లీ అడవులకు వెళ్లి, మరింత కఠిన నియమ నిష్ఠలతో తపస్సు ప్రారంభించాడు. కొంత కాలం గడిచింది. సృష్టికి మూలం మనస్సు అని తలచాడు భృగువు.మనస్సు వల్లనే స్త్రీ పురుషులు పరస్పరం ఆకర్షితులవుతున్నారు. మనస్సు వల్లనే లోకంలోని సమస్త ప్రాణులు ఉద్భవిస్తున్నాయి. జన్మించిన తర్వాత కూడా మనోధర్మం ప్రకారం ఇంద్రియాల ద్వారానే జీవనం సాగుతోంది. మరణం తర్వాత ఇంద్రియాలకు జ్ఞానం ప్రసాదించే శక్తి పోతుంది. అవన్నీ మనస్సులోనే లీనమైపోతాయి. అందువల్ల మనస్సే బ్రహ్మ అనుకున్నాడు.తండ్రి వద్దకు వెళ్లి, తపస్సులో తాను గ్రహించినది చెప్పాడు. ‘తండ్రీ! మనస్సే బ్రహ్మ’ అని నాకు తపస్సులో స్ఫురించింది.
అందువల్ల మనస్సే బ్రహ్మ అనుకుంటున్నాను’ అన్నాడు.‘కాదు. నీకు బ్రహ్మతత్త్వం పూర్తిగా అవగతం కాలేదు. మళ్లీ తపస్సు కొనసాగించు’ అన్నాడు వరుణుడు.భృగువు మళ్లీ మొక్కవోని దీక్షతో తపస్సు కొనసాగించాడు. తపస్సులో కొన్నేళ్లు గడిచిపోయాయి. ‘ఆనందమే పరబ్రహ్మ స్వరూపం’ అని స్ఫురించింది. సర్వమూ ఆనందం నుంచే జనిస్తుంది, ఆనందంలోనే లయమవుతుంది. ఆనందానికి అతీతమైనది మరేదీ లేదు.
అందువల్ల ‘ఆనందో బ్రహ్మ’ అనుకున్నాడు. తండ్రి వద్దకు వెళ్లి ఇదే సంగతిని తెలియజేశాడు.భృగువు ‘ఆనందో బ్రహ్మ’ అని పలకడంతోనే వరుణ మహర్షి పరమానందభరితుడయ్యాడు.‘కుమారా! లెస్సగా గ్రహించావు. ఉత్తమోత్తమ పరమాత్మ తత్త్వం ఆనందం. అన్నం, ప్రాణం, మనస్సు, విజ్ఞానం కూడా పరబ్రహ్మ స్వరూపాలే! కాని, ఇవి ఒకదాని కన్నా మరొకటి సూక్ష్మమైనవి. వీటన్నింటినీ మించినది ఆనందం. ఈ ఆనందం క్షణికమైనది కాదు, శాశ్వతమైనది. పరబ్రహ్మోపాసన క్రమంగా జరగాలి.
అంటే, ఒక్కొక్క మెట్టు పైకి వెళ్లాలి. అన్నాన్ని ఎన్నడూ నిందించరాదు. ప్రాణం, మనస్సు అన్నంపైనే ఆధారపడి ఉన్నాయి. అయితే, మానవులు తినడం కోసం జీవించరాదు, జీవించడానికి తినాలి. అన్నాన్ని నియమ ప్రకారమే స్వీకరించాలి. అన్నాన్ని పూజిస్తే, తర్వాతివన్నీ లభిస్తాయి. అందువల్ల ఆహారాన్ని వదలకుండా, ప్రాణాన్ని నిలుపుకుంటూ, మనస్సును వికసింపజేసుకుని, విజ్ఞానానుభవం ద్వారా బ్రహ్మానందం పొందాలి’ అంటూ కొడుకుకు బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించాడు వరుణుడు.తండ్రి ఆదేశం ప్రకారం విడువకుండా మళ్లీ మళ్లీ కొనసాగించిన తన తపస్సు ఫలవంతమైనందుకు భృగుమహర్షి పరమానందం చెందాడు.
∙సాంఖ్యాయన