సెల్ఫ్‌మేడ్‌ బిలియనీర్‌ | Radha Vembu has been a key figure in the growth of Zoho Corporation | Sakshi
Sakshi News home page

సెల్ఫ్‌మేడ్‌ బిలియనీర్‌

Jul 4 2026 3:35 AM | Updated on Jul 4 2026 3:35 AM

Radha Vembu has been a key figure in the growth of Zoho Corporation

మన లక్ష్యం ఎంత పెద్దదైతే మనమంతా అంత శ్రమించాలి. అనుకున్నది సాధించేవరకు విశ్రమించకుండా తపిస్తే విజయాలు వాటంతటవే వస్తాయి. భారత ఆర్థిక రంగానికి మహిళాశక్తి కొత్త ఊపిరినిస్తోంది. రాధా వెంబు అంటే మీకు తెలుసా? చాలామందికి ఈ పేరు అంతగా పరిచయం లేకపోవచ్చు కాని జోహో సంస్థ గురించి తెలుసా అంటే తెలుసని టక్కున సమాధానమిస్తాం. ఆ జోహో కంపెనీలో కీలక పదవిలో బాధ్యతలు నిర్వహించడమే కాకుండా, సంస్థలో దాదాపు 48 శాతం స్టేక్‌ హోల్డర్‌ కలిగిన వ్యాపారస్తులే ఈ రాధా వెంబు. స్వయం కృషితో ఎదిగి జోహోను వేలకోట్ల సంస్థగా నిలబెట్డడంలో రాధా వెంబు పాత్ర ఎంతో కీలకం. హ్యురాన్‌ లిస్ట్‌లో అత్యంత ధనికురాలైన భారతీయ మహిళ వ్యాపారవేత్తగా ఆమె ఎదిగిన వైనం ఎంతో ఆదర్శ్రపాయం.

జోహో మొదలైనప్పటి నుంచి..
రాధా వెంబు 1972లో చెన్నైలో జన్మించారు. ఐఐటీ మద్రాస్‌లో ఇండస్ట్రియల్‌ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ పూర్తి చేశారు. చిన్నప్పటి నుంచే సాంకేతికత, వ్యాపార నిర్వహణ వంటి విషయాలపై అవగాహన పెంచుకున్నారు. 1996లో తన సోదరుడు శ్రీధర్‌ వెంబుతో కలిసి అడ్వంట్‌ నెట్‌ అనే సంస్థ ప్రారంభించారు. కాలక్రమంలో అదే జోహోగా రూపాంతరం చెందింది. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో వ్యాపారసంస్థలకు క్లౌడ్‌ ఆధారిత సాఫ్ట్‌వేర్‌ సేవలను అందిస్తూ నేడు జోహో టాప్‌ గ్లోబల్‌ టెక్నాలజీ కంపెనీల్లో ఒకటిగా నిలిచింది.

నిరాడంబరత
ఎన్ని విజయాలు సాధించినా, ఎన్ని సేవా కార్యక్రమాలు చేసినా రాధావెంబు ప్రచారానికి మాత్రం దూరం. వార్తాపత్రికల్లో, టీవీ చానెళ్లలో కూడా ఆమె కనిపించేది అంతంత మాత్రమే. తన ప్రతిభ, నిరంతర కృషితో నేడు జోహో సంస్థను ప్రపంచస్థాయి కంపెనీగా రూపుదిద్దిన వైనం శ్లాఘనీయం. నేటి సోషల్‌ మీడియా యుగంలో ఏ మాత్రం ప్రచార ఆర్భాటానికి పోకుండా, తన పని తాను చేసుకుపోవడం తప్ప వేరే ధ్యాస లేని రాధావెంబు జీవితం వ్యాపార రంగంలో ఓ ప్రత్యేక అధ్యాయం.

సమాజసేవ...
వ్యాపార విజయాలతో పాటు సామాజిక సేవలోనూ రాధా వెంబు తనదైన ముద్ర వేశారు. మా ద్వారా విద్య, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి, సామాజిక సంక్షేమ రంగాల్లో అనేక సేవా కార్యక్రమాలకు ఆమె ఆర్థికసాయం అందిస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన విద్యను ఏర్పాటు చేయడం, పేద కుటుంబాలకు ఆరోగ్య సదుపాయాలు అలాగే గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాల కల్పన తదితర కార్యక్రమాలకు ఆమె అధిక ప్రాధాన్యం ఇస్తారు.

సంపద.. కీర్తి...
తొలినాళ్లలో ఒడిదొడుకులు ఎదుర్కొన్నా నిరంతర శ్రమతో రాధావెంబు వ్యాపారంలో నిలదొక్కుకోగలిగారు. ప్రస్తుతం జోహోలో ప్రధాన వాటాదారుగా ఉండటంతో పాటు జోహో మెయిల్‌కి ప్రోడక్ట్‌ మేనేజర్‌గా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సంస్థలో కొత్త ఉత్పత్తుల రూపకల్పన, నాణ్యత ప్రమాణాలు, వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా సేవలను అభివృద్ధి చేయడంలో రాధా వెంబు ముఖ్యపాత్ర వహించారు. 2024 హ్యురాన్‌ ఇండియా రిచ్‌ లిస్ట్‌లో రాధావెంబు భారతదేశంలోనే అత్యంత సంపన్నురాలిగా నిలిచారు. ప్రస్తుతం ఆమె నికర సంపద విలువ యాభై ఐదు వేలకోట్లకు పైనే...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement