మధ్యప్రదేశ్లోని భోపాల్లోట్విషా శర్మ ఉదంతం యావత్తు దేశాన్ని దిగ్బ్రాంతికి గురిచేసింది. ఈ కేసు రోజుకో మలుపుతిగరుతూ చాలా షాకింగ్ విషయాలే వెలుగులోకి వస్తున్నాయి. అదీగాక ఈ కేసు విచారణ సందర్భంగా ధర్మాసనం చేసిన కీలక వ్యాఖ్యలు అందర్నీ ఆలోచింపచేసేలా ఉన్నాయి. సుప్రీంకోర్టు ఈ కేసు వాదోపవాదనలు విచారిస్తూ..అసలు వరకట్నం కోరలకు కన్న కూతురిని బలి చేయడం కంటే, విడాకులు తీసుకుని పుట్టింట్లో ఆమెను బతనివ్వడమే మేలని హితవు పలకడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.
అంతేగాదు ధర్మాసనం వ్యాఖ్యలు ప్రతి తల్లిదండ్రుల తీరుకు చెంపెట్టులా ఉండటం విశేషం. అలాగే మానసిక నిపుణులు సైతం కూతుళ్ల విషయంలో తల్లిదండ్రుల ధోరణి మారాలని హితవు పలుకుతున్నారు. కష్టపడి చదివించి పాతికేళ్లు అల్లారుముద్దుగా పెంచుకున్న కూతుర్ని పెళ్లి అనే రెండక్షరాలకు బలి అవ్వకాకుండా ఎలా కాపాడుకోవాలి, ఎలా పెంచాలి వంటి వాటి గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
ప్రతి పేరెంట్ తమ కుమార్తెలకు అంగరంగ వైభవంగా పెళ్లిచేయడం గొప్ప బహుమతి కాదని అంటున్నారు. వివాహం తనను ఊపిరాడనివ్వని పరిస్థితుల్లోకి నెట్టేస్తే..ధైర్యంగా బయటకొచ్చి నిలబడేలా ఉండాలి, అందుకు ఆమె కుటుంబ సభ్యులు కూడా సహకరించాలని అంటున్నారు.
వరకట్నం మరణాలను నివారించాలంటే పేరెంట్స్ని తమ కుమార్తెలను జీవితంలో ఎదురయ్యే ఒడిదుకులకు ఆమెను సిద్ధం చేసేలా ట్రైన్ చేయాలి. సాంప్రదాయకంగా పెళ్లి చేయడం కంటే..ఆమెకు ఈ వైవాహిక బంధం రక్షణ, స్వేచ్ఛను ఇవ్వగలదా చూడాలి. అలాగే మన ఇంటి ఆడపిల్లలకు ముందుకు మానసిక ధైర్యం, ఆర్ధిక స్వేచ్ఛ వంటివి నేర్పించాలి.
ఇక వివాహానికి పునాది త్యాగం కాదు, భద్రతే ముఖ్యం అని గ్రహించాలి. అలాగే ఆడపిల్లలకు అత్తంటిలో సమస్యలు, హింసను ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడితే ప్రతి తల్లిదండ్రులు సద్దుకోమని చెప్పడం కాదు. ధైర్యంగా బయటకు వచ్చేలా స్వేచ్ఛను ఇవ్వాలి. దీంతోపాటు ప్రతి తల్లిదండ్రల్లో పెళ్లితో తమ అమ్మాయి పరాయిది అనే భావాన్ని తొలగించాలి.
ఆ వైవాహిక జీవితం నరకప్రాయంగా మారినప్పుడు ఆమె కుటుంబ సభ్యులు దగ్గరగా తీసుకోవాలి, భద్రత అందించాలి. చిన్నప్పటి నుంచి అత్తారింటికి వెళ్లే అమ్మాయి ఇలా ఉండాలి అని స్టోపాయిజన్లా కుమార్తెలకు ఎక్కించడం మానాలి. అంతేగాదు ఆడపిల్లలు కూడా అత్తంట్లో సమస్య వస్తే..పుట్టింటికి వెళ్లడాన్ని అపరాధ భావంలా కాకుండా తన హక్కుగా ధైర్యంగా వచ్చేలా చేయాలి.
అలాగే శ్రద్ధ అన్న పేరుతో కుమార్తెలను ప్రతి నిమిషం పర్యవేక్షించడం, కట్టుబాట్లు విధించడం వంటివి చేయకూడదని అంటున్నారు. వాళ్లను ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తుల్లా తీర్చిదిద్దాలన్నారు.
ఆడిపిల్లకు ఇచ్చే బంగారం, డబ్బు అత్యవసర నిధుల్లోకి మళ్లించాలి. అది ఆమెకు పెళ్లి తర్వాత భరోసానిచ్చే నిధిలా ఉంటుంది. సమస్య ఎదురైతే ధైర్యంగా బయటకకు వచ్చి బతకగలను అన్న ధైర్యం అందిస్తుంది. లక్షలు ఖర్చుపెట్టి ఆర్భాటంగా పెళ్లి చేస్తే..కేవలం నాలుగు రోజులే గుర్తుంటుంది. అదే డబ్బు మిగిల్చి ఆమె స్త్రీ ధనంగా ఇస్తే..ఆమెకు భరోసానిస్తుందని చెబుతున్నారు మానసిక నిపుణులు.
ఒకవేళ కూతురు పుట్టింట్లో ఉంటే చుట్టూ జనాలు ఏం అనుకుంటారో అన్న భయంతో ముందే తలుపులు వేసుకుని కూర్చొవద్దని పిలుపునిస్తున్నారు. మన అమ్మాయికి అత్తంట్లో కష్టం వస్తే భయపడొద్దు..ఎప్పటికీ పుట్టింటి తలుపులు నీ కోసం తెరిచే ఉంటాయన్న నమ్మకం ఇవ్వండని సూచిస్తున్నారు. అలాగే బాధను సాధరణీకరించొద్దు, తొలగించి, ఆత్మవిశ్వాసంతో తలెత్తుకుని బతికేలా ధైర్యం ఇవ్వండని చెబుతున్నారు మానసిక నిపుణులు.
(చదవండి: మంచి ఉద్యోగం నుంచి సివిల్స్, లవ్ అన్ని ఫెయిల్ చివరికి..!)


