అతిరథులు ఈ అతివలు.. | International Women's Day 2025 | Sakshi
Sakshi News home page

అతిరథులు ఈ అతివలు..

Mar 8 2025 8:15 AM | Updated on Mar 8 2025 8:15 AM

International Women's Day 2025

ఈ సృష్టిలో శక్తి మంతమైనవి రెండే అంశాలున్నాయి.. అందులో ఒకటి ప్రకృతి, మరొకటి మగువ అని ఆనాడే ఓ ప్రఖ్యాత రచయిత చెప్పాడు. సమాజమంతా మహిళలను కీర్తిస్తూ.. మహిళా సాధికారత అంటూ గొంతెత్తుతున్నప్పటికీ.. తమ గౌరవాన్ని, గొప్పతనాన్ని కాపాడుకోడానికి ఆ తల్లులు నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారు. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యంలో పలువురి స్ఫూర్తిదాయక మహిళల ఇతివృత్తాలను తెలుసుకుందాం.. 

సాహిత్యం.. సావాసం..
తన ప్రయాణమంతా సాహిత్యంతోనే.. తన మనసంతా ప్రకృతిమయం. గొప్ప గొప్ప విషయాలు ఎక్కడో ఉండవు.. కాస్త తరచి చూస్తే మనచుట్టూనే, మన మధ్యే ఉంటాయంటారు ప్రముఖ రచయిత స్వర్ణ కిలారి. సామాజిక ఇతివృత్తాలతో పలు ప్రభావ వంతమైన కథలు, రచనలు, అనువాదం చేసిన స్వర్ణ కిలారి.. మహిళల ట్రావెలింగ్‌ అనుభవాలతో ఇంతియానం అనే పుస్తకానికి సంపాదకీయం రాశారు. విశ్వవ్యాప్త ప్రయాణాలు చేసిన మగువలు.. విభిన్న అంశాల పై వారి అనుభవాలు, ఆలోచనలకు  అక్షరరూపం తీసుకొచ్చారు. మరికొద్ది రోజుల్లో ఇంతియానం 2.0 సైతం రాబోతోంది. ఈ నేపథ్యంలో తన స్ఫూర్తివంతమైన ఆలోచనలు ఆమె మాటల్లోనే..

ది షూటింగ్‌ స్టార్‌ స్ఫూర్తితో..
రచనలన్నా, సాహిత్యమన్నా నాకెంతో ఇష్టం. ఇందులో భాగంగానే నాకు బాగా నచ్చిన కొన్ని పుస్తకాలను తెలుగులోకి అనువాదం చేశాను. ఇందులో కేరళకు చెందిన బాల మేధావి క్లింట్‌ బయోగ్రఫీ లిప్తకాలపు స్వప్నం, ది గోట్‌ లైఫ్‌ అనే ప్రముఖ రచనను మేక బతుకు పేరుతో తెలుగులోకి అనువాదం చేశాను. వ్యక్తిగతంగా నల్ల బంగారం, 13 వంటి రచనలు చేశాను. ఒక రచన కోసం నార్త్‌ థాయ్‌లాండ్‌ వెళ్లిన సమయంలో.. ఉన్న కొద్ది ఆస్తిని అమ్మి ప్రపంచ యాత్ర చేసిన అమ్మాయి నవ్య నాథ్‌ రాసిన ది షూటింగ్‌ స్టార్‌ బుక్‌ చదివి ఆశ్చర్యపోయాను. ఇలా మన తెలుగువారి ట్రావెలాగ్స్‌తో మంచి పుస్తకం తీసుకురావాలని అప్పుడే నిర్ణయించుకుని పని ప్రారంభించాను.

 ఇందులో భాగంగా మన తెలుగు మహిళలు చేసిన అద్భుత ప్రయాణాలు, అనుభవాలు చూసి స్ఫూర్తిని పొందాను. ఇందులో ఒంటరిగా ప్రయాణలు చేసిన వారు ఎందరో ఉన్నారు. ఇంటి నుంచి బయటకి వచ్చి ఉద్యోగాలు చేయడమే గగనమైన తరుణంలో స్థానిక ఆదిలాబాద్, కాకినాడ అడవులు మొదలు.. విదేశాల్లోని దండకారణ్యాలు, నగరాలు, సంస్కృతులు ఎన్నెన్నో వింతలు, విశేషాలను ఆస్వాదించిన మహిళ ప్రయాణ కథలు నాకు జీవితకాల సంతృప్తినిచ్చాయి. ఇలా 45 మంది కథలతో మొదటి పుస్తకం ముద్రించాను. ప్రస్తుతం మరో 55 మంది వనితల ప్రయాణ కథలతో ఇంతియానం 2.0ను తీసుకురానున్నాను. ఆడవారి ట్రావెలాగ్‌ వినూత్నంగా, విభిన్నంగా ఉంటుంది. 

వారు చూసే కోణం, ఆస్వాదించే విధానం కాస్త భిన్నంగా ఉంటుంది. ఉమెన్‌ ట్రావెంలింగ్‌ అంత సులభం కూడా కాదు. సామాజికంగా, శారీరకంగా, మానసికంగా పలు అంశాలు సహకరించవు. ఈ సారి మహిళల సోలో కథలతో పాటు తల్లీ కూతుళ్లు వంటి వైవిధ్యాలున్నాయి. వ్యక్తిగతంగా నేను మెక్సికో, బాలి, శ్రీలంక, అమెరికా, భూటాన్‌ వంటి దేశాలు ప్రయాణించాను. నా రచన 13 కోసం ఉత్తర థాయిలాండ్‌ వెళ్లి అక్కడ చియాంగ్‌ రాయ్‌ గుహలో చిక్కుకున్న 13 మంది పిల్లల నిజజీవిత కథను, వ్యథను రాశాను. భవిష్యత్తులో మరిన్ని రచనలు చేయాలనుంది. 
– స్వర్ణ కిలారి, ప్రముఖ రచయిత్రి, హైదరాబాద్‌

వైకల్యాన్ని జయించి.. 
తానోక దివ్యాంగురాలు.. చిన్నప్పటి నుంచి అందరిలానే తానూ వివక్షకు గురైంది. ముందే దివ్యాంగురాలివి, అందులోనూ అమ్మాయివి.. నువ్వేం చేయగలవు, నీ వల్ల ఏమీ కాదు అనే మాటల తూటాలు ఆమె మనసును విచి్ఛన్నం చేశాయి. ఎలాగైనా తనను తాను నిరూపించుకోవాలి, ఎవరి, జాలి, సహాయంపైన ఆధార పడకూడదని నిశ్చయించుకుని ఇంటిని వదిలి హైదరాబాద్‌ నగరానికి చేరుకుంది. సంపూర్ణంగా తన పనులు తాను చేసుకోలేకపోయినా, అందరిలా నడవలేకపోయినా.. కుంగిపోకుండా కంప్యూటర్‌ వర్క్‌ నేర్చుకుని, డీటీపీ వర్క్‌ చేసి తన ఖర్చుల వరకూ సంపాదించుకునేది. 

తానే కాదు తనలాంటి మరికొందరికి ఆశ్రయం ఇవ్వాలని ‘ఆద్య నిలయం ట్రస్ట్‌’ ఏర్పాటు చేసి మరి కొందరు మహిళా దివ్యాంగులకు ఉచితంగా ఆశ్రయం, ఆహారం, వసతులను అందిస్తోంది. ఈ క్రమంలో తమకు కూడా మగతోడు ఉంటే బాగుంటుంది.. వైకల్యం దేహానికే కానీ మనసుకు కాదు. అందరిలాగే తమకు కూడా అనుభూతులు, కోరికలు, ఇష్టాలు ఉంటాయని.. మిత్రుల సూచనతో మరో దివ్యాంగ వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. అలా తను సతీష్‌ అనే దివ్యాంగుడినిపెళ్లి చేసుకోవడమే కాకుండా తనలాంటి మరికొందరికి పెళ్లిల్లు చేయిస్తోంది.  

మరికొందరికి బాసటగా.. 
దివ్యాంగులకు మొదటి వివక్ష వారి కుటుంబాల నుంచే మొదలవుతుంది. నువ్వేం చేయలేవు.. జీవితాంతం వారు పెట్టింది తింటూ ఇంట్లో ఓ మూలన కూర్చో అనే సందర్భాలే ఎక్కువ. ఇలాంటి తరుణంలో మా ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ, మా కష్టంతో ముందుకు సాగుతున్నాం. ఇలా మరికొందరు దివ్యాంగులకు ఆశ్రయం ఇస్తూ ఒక కుటుంబంగా బతుకుతున్నాం. మా ప్రయాణంలో ఆర్థికంగా, సామాజికంగా, మానసికంగా తోడ్పాటును అందించిన వారు ఎందరో ఉన్నారు. నా పెళ్లిని సర్వ్‌ నీడి అనే స్వచ్ఛంద సంస్థ జరిపించింది. నా మొదటి పెళ్లి రోజు సందర్భంగా ఆత్మీయుల్లో ఒకరు డబ్బులు ఇచ్చి పార్టీ చేసుకోమన్నారు. ఆ డబ్బుతో నేను మరికొందరు దివ్యాంగుల జంటలకు పెళ్లి పరిచయ వేదిక ఏర్పాటు చేశాను. ఇప్పటి వరకూ ఐదు జంటలకు చేశాను. మరికొన్ని చేసే ప్రయత్నంలో ఉన్నాను.  
– క్రిష్ణప్రియ, ఆద్య నిలయం ట్రస్ట్, హైదరాబాద్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement