ఆధ్యాత్మి కథ
దశరథ మహారాజు ఎదురు చూస్తున్న శుభతరుణం రానే వచ్చింది. కౌసల్యాదేవి పరిపూర్ణ దివ్యత్వంతో ఉట్టిపడుతున్న శ్రీరామునికి జన్మనిచ్చింది. ఈ శుభవార్తను ఒక చెలికత్తె వెళ్లి దశరథ మహారాజుకు విన్నవించగా ఆయన పట్టలేని ఆనందంతో ఎంతో విలువైన ఒక రత్నాల హారాన్ని ఆమెకు కానుకగా అందించబోయాడు. అప్పుడా చెలికత్తె, ‘మహారాజా! నాకు ఇవేవీ వద్దు. నేను కోరుకునేది ఒకటి ఉంది.
ఇప్పుడు జన్మించిన బిడ్డను ఎత్తుకొని ఆడించి పాడించి లాలించే భాగ్యాన్ని నాకివ్వండి, చాలు’ అన్నది. సామాన్యురాలైన ఒక చెలికత్తె ఎంతటి ఉత్కృష్టమైన కోరిక కోరుకుందో! ఒక్కొక్కరి జన్మాంతర సుకృతం చేత ఈ విధమైన పవిత్ర భావాలు వారిలో ఆవిర్భవిస్తుంటాయి.
అరణ్యవాసానికి బయల్దేరిన సీతారామలక్ష్మణులు గంగానదిని దాటవలసి వచ్చింది. పడవ నడిపే గుహుడు, ‘ప్రభూ! నేను మిమ్మల్ని ఈ నది దాటిస్తాను. అందుకు ప్రతిఫలంగా నన్ను ఈ భవసాగరం దాటించాలి‘ అని రెండు చేతులు జోడించి అభ్యర్థించాడు. గుహుడు చదివిన చదువు ఏపాటిది! అతను కనబరచిన ఆధ్యాత్మిక పరిణతి ఎంత మహోన్నతమైనది!?
ధ్రువుడు ఎలాగైనా శ్రీమహావిష్ణువు అనుగ్రహం పొంది తన తండ్రి తొడపై కూర్చోవాలన్న కోరికతో తపస్సు చేశాడు. విష్ణుమూర్తి సాక్షాత్కరించి ఏం కావాలని అడుగగా ఆ పసివాడు. ‘స్వామీ ఈ దట్టమైన అడవిలో నేను తపస్సు చేస్తున్న సంగతి తెలిసిన మీకు నా మనసులోని కోరిక తెలియదా?’ అంటాడు.
‘మనసులో ఉన్నది మాటలో వ్యక్తం చేయనిదే పరమివ్వడానికి వీలుకాద’ని విష్ణుమూర్తి వివరించగా, ‘స్వామీ నేను గాజు పెంకుకోసం వెతుకుతూ వస్తే నాకు అమూల్యమైన పజ్రమే లభించింది. మీ దర్శన భాగ్యం పొందిన నాకు ఇక తాత్కాలిక సంతోషాన్నిచ్చే రాజ్యాలు, భోగభాగ్యాలు అక్కర్లేదు. శాశ్వతానందాన్నిచ్చే మీ సాయుజ్యమే కావాల’ని కోరాడు. రాజ్యసుఖాలతోపాటూ పరమపదాన్ని కూడా ధ్రువునికి అనుగ్రహించాడు శ్రీమన్నారాయణుడు.
భక్త ధ్రువునివలె శాశ్వతానంద్రపాప్తిని కోరుకుందాం. గుహునివలె భవసాగరాన్ని దాటించవలసిందిగా స్వామిని ప్రార్థిద్దాం. ఆ చెలికత్తెలా దైవసన్నిధిని ఒక పెన్నిధిగా భావించుకుందాం. – తరిగొప్పుల వీఎల్లెన్ మూర్తి


