
భారతీయ విశ్వవిద్యాలయాల నుంచి డాక్టర్ ఆఫ్ సైన్స్ పట్టా అందుకున్న మహిళ, ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ జనరల్ ప్రెసిడెంట్గా వ్యవహరించిన స్త్రీమూర్తి, మహిళా శాస్త్రవేత్తగా రాజ్యసభ సభ్యులు కావడం వంటి ప్రత్యేకతలు అసీమా చటర్జీ (Dr Asima Chatterjee) (1917– 2006) సొంతం. ప్రకృతి ఉత్పత్తులైన అల్కలాయిడ్స్, కామెరిన్స్, టెర్పనాయిడ్స్ విషయంలోఆమె కృషి విశేషమైనది. భారతీయ ఔషధ మొక్కలకు సంబంధించి వి.విశ్వాస్ గ్రంథానికి చాలా రకాలుగా అదనపు సమాచారాన్ని జోడించి ‘ట్రీటైస్ ఆన్ మెడిసినల్ ప్లాంట్స్’ను ఆరు భాగాల గ్రంథంగా వెలువరించారు.
అసీమా చటర్జీ 1917 సెప్టెంబరు 23న బెంగాల్ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. 1944లో పి.కె. బోస్ సారథ్యంలో కలకత్తా విశ్వవిద్యాలయం నుంచి తొలి భారతీయ మహిళగా డీఎస్సీ పొందారు. వృక్ష ఉత్పత్తులకు సంబంధించి, సేంద్రియ రసాయనాలపై అధ్యయ నమే ఆవిడ పరిశోధన. ఆ సిద్ధాంత గ్రంథాన్ని నోబెల్ బహుమతి గ్రహీత ఎ.ఆర్. టాడ్ పరీక్షించి గొప్పగా అభినందించారు. ఆమె భర్త వరదానంద చటర్జీ భౌతిక రసాయనశాస్త్రంలో దిట్ట.
1947లో ఆమె అమెరికా వెళ్లి నాలుగేళ్లలో ముగ్గురు వేరు వేరు విశ్వవిద్యాలయాల ఆచార్యుల దగ్గర పరిశోధన చేశారు. ఇందులో నోబెల్ బహుమతి గ్రహీత పాల్ కారర్ ఒకరు. 1950లో భారతదేశానికి తిరిగి వచ్చి కలకత్తా విశ్వవిద్యాలయంలో ఉద్యోగ జీవితాన్ని కొనసాగించారు. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తూ ఈ విజ్ఞాన శాస్త్ర మహా సభలకు ప్రధాన కార్యదర్శిగా, కోశాధికారిగా, 1975లో ప్రధాన అధ్యక్షులుగా వ్యవహరించారు. భారతీయ ఔషధ మొక్కలు, ఆయుర్వేదానికి సంబంధించి సాల్ట్ లేక్ (కలకత్తా)లో, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో రీజనల్ రీసర్చి ఇన్స్టిట్యూట్ రావడానికి కృషి చేశారు. మూర్ఛవ్యాధికి విరుగుడుగా ఆయుష్ –56, అలాగే మలేరియాను నిర్మూలించేందుకు ఔషధాలను తయారు చేశారు. అసీమా పొందిన ఎన్నో గౌరవాలు, పురస్కారాలలో 1975లో లభించిన పద్మ విభూషణ్ ఒకటి.
ప్రజావళిలో శాస్త్రీయ అభినివేశం లేకపోతే ఫలితం శూన్యమని ఆమె నమ్మే వారు. శాస్త్ర సాంకేతిక అభివృద్ధి పట్టణాల వద్దే ఆగిపోతే మంచిది కాదనీ, గ్రామ సీమలలోనూ అది వ్యాప్తి కావాలనీ అనేవారు. రాజ్యసభ సభ్యురాలిగా 1982 నుంచి 8 ఏళ్ల పాటు సేవలు అందించారు. విజ్ఞానమాతకు ఆభరణంగా భాసి ల్లిన అసీమా చటర్జీ 2006 నవంబర్ 22న తన 89వ యేట కన్ను మూశారు.
– డా.నాగసూరి వేణుగోపాల్
ఆకాశవాణి మాజీ ఉన్నతాధికారి