హిమగిరి గుండెల్లో వెలిగిన జ్యోతిర్లింగం విశ్వనాథుడి కైలాస ధామం కేదార్నాథ్ ఈ యాత్ర అంటేనే మదిలోని గుబుళ్లన్నీ వదిలేసి పరమశివుని పాదాల దగ్గర మౌనంగా కూర్చోవడంలాంటిది. గాలిలో వినిపించే ‘ఓం నమఃశివాయ‘ మంత్రం, గంటల నాదం, ఆలయ ప్రాంగణంలో ఉండే అద్మాత్మిక దివ్య శక్తి మనకు తెలియకుండానే మనల్ని ఒక భక్తి లోకానికి తీసుకుని వెళ్తుంది.కేదార్నాథ్ కేవలం ఒక టూరిజం స్పాట్ మాత్రమే కాదు. ఇది ప్రతి భక్తుడి జన్మ ధన్యం అయ్యే ఒక పవిత్ర క్షేత్రం. హిమవంతుడి ఒడిలో, పర్వతాల మధ్య కొలువుతీరిన ఆ మహాదేవుని చూసే ప్రతి కన్ను ధన్యమే అని భక్తుడికి అనిపిస్తుంది.
మహాదేవుడి దివ్య సన్నిధిలో
కేదార్నాథ్ ఆలయం దగ్గర నిల్చుని ఆకాశంలో చూస్తే ఆ ధవళ వర్ణపు మంచు కొండలు, శివ భగవానుడి జటాజూటంలా కనిపిస్తాయి. ఆయలం లోపల ఉండే స్వయంభూ లింగం ముందు తలవంచితే ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ చిన్నవిగా అనిపిస్తాయి. ఆ చల్లటి గాలిలో కూడా భక్తుల గుండెల్లో ఉన్న భక్తి వేడిని నింపుతుంది.
సందర్శనీయ ప్రదేశాలు
ఆలయం వెనక ఉన్న భైరవనాథ్ క్షేత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది. అక్కడికి వెళ్తే మొత్తం కేదార్ లోయ మహాదేవుడి పాదాల దగ్గర ఉన్నట్టు కనిపిస్తుంది. అది చూస్తేనే భక్తి పరవశం కలుగుతుంది.
కొంచెం దూరంలో ఉండే వాసుకి తల్ సరస్సు నిత్య ప్రశాంతతకు మారుపేరుగా నిలుస్తుంది. అది చూస్తే ప్రకృతి మొత్తం ఆ శివుడి రూపమే అని అర్థం అవుతుంది.
తెలియాల్సినవి..
దర్శన సమయం: ఆలయ ద్వారాలు అక్షయ తృతీయ నుంచి కార్తీక పౌర్ణమి వరకు భక్తుల కోసం తెరిచి ఉంటాయి.
ప్యాకేజీలు: కేదార్నాథ్ వెళ్లాలనుకునే భక్తుల కోసం 5 రోజుల నుంచి 10 రోజుల వరకు బడ్జెట్ను బట్టి అనేక ప్యాకేజీలు లభిస్తాయి.
రిజిస్ట్రేషన్: యాత్రకు వెళ్లే ముందు ఉత్తరాఖండ్ గవర్నమెంట్ పోర్టల్లో బయోమెట్రిక్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరి. రిజిస్ట్రేషన్ పూర్తిగా ఉచితం. క్యూఆర్ కోడ్ పాస్ జాగ్రత్తగా కాపాడుకోవాలి.
ప్రయాణం: ఉత్తరాఖండ్లోని రిషికేష్ నుండి రుద్రప్రయాగ్ మీదుగా గౌరీకుండ్ చేరుకోవాలి. అక్కడి నుండి 16 కి.మీ ట్రెక్కింగ్ ప్రారంభమవుతుంది.
వసతి సదుపాయాలు: కేదార్నాథ్ టాప్ దగ్గర కాటేజీలు, రూమ్లు ఉంటాయి. అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటే మంచిది.
ఏం చూడాలి? ఏం తినాలి?
కేదార్నాథ్ వెళ్తే సాయంత్రం జరిగే హారతి తప్పక చూడాలి. ఆ హారతి వెలుగులో ఆలయం బంగారు వర్ణంలో మెరిసి΄ోతుంది. కేదార్నాథ్లో భోజనానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ ఖర్చు మాత్రం కాస్త ఎక్కువే ఉంటుంది. ఇక్కడ లభించే ‘పహాడి మ్యాగీ’ ఒక క్విక్ స్నాక్లా ఎంజాయ్ చేయవచ్చు.
ఎలా వెళ్లాలంటే..
హరిద్వార్లో గంగా స్నానం చేసి రిషికేష్ నుంచి కేదార్ యాత్ర మొదలు పెట్టడం ఒక సంప్రదాయం. అక్కడి నుంచి రిషికేష్ సోన్ ప్రయాగ్ మార్గంలో నుండి గౌరీకుండ్ చేరుకోవాలి. అక్కడి నుంచి కాలినడకన యాత్రనున కొనసాగించాల్సి ఉంటుంది.
చాలా మంది ఈ యాత్రను ట్రెక్కింగ్ అని పిలుస్తుంటారు. కానీ మనం మాత్రం దీనిని ఒక తపస్సులా భావించి అంతే పవిత్రంగా అడుగులు ముందుకేయాలి. ప్రతి అడుగులో ‘శంభో శంకర’ అంటూ భక్తులు పైకి వెళ్తుంటే ఆ పర్వతాలే స్పందిస్తున్నట్టుగా అనిపిస్తుంది.
ఎక్కడ ఉండాలి?
కేదార్నాథ్ లోయలో ఉండటం అంటే మహాదేవుడి ఒడిలో నిద్రించడం లాంటిదే. చిన్న చిన్న కాటేజీల్లో కూర్చుని బయట చూస్తే గుడి దగ్గర వెలిగే దీపాలు ఆకాశంలోని నక్షత్రాల్లా కనిపిస్తాయి.
ఏం చేయాలి?
ఆలయ ప్రాంగణంలో మౌనంగా కూర్చుని ధ్యానం చేయవచ్చు. ఫోన్లలో ఫొటోలు తీయడానికి బదులు కళ్లతో చూస్తూ మనసులో శివుడిని కొలుస్తూ గడిపిన క్షణాలు జీవితాంతం గుర్తుంటాయి.
వీలు చూసుకొని మందాకిని నది తీరంలో కూర్చొని ఆ ప్రవాహాన్ని ఫీల్ అవ్వాలి. నది ప్రవాహంలో మన మదిలోని ఆలోచనలను కొట్టుకు పోతున్నట్టుగా భావించి, కడిగిన ముత్యంలాంటి మనసుతో ఇంటికి తిరిగి చేరుకోవచ్చు.
సూర్యోదయం సమయంలో ఆలయం బంగారు వర్ణంలో మారడం చూడటాన్ని అస్సలు వదులుకోకూడదు.
యాత్ర – బడ్జెట్ వివరాలు
కేదార్నాథ్ యాత్ర ప్లాన్ చేస్తున్నప్పుడు ప్యాకేజీ అంటే కేవలం టికెట్ మాత్రమే కాదు. అది మన ప్రయాణం, భోజనం, వుండే చోటు అన్నీ కలిసిన ఒక పూర్తి ప్రణాళిక. ఈ యేడాది కేదార్నాథ్ ఆలయం ద్వారాలు ఏప్రిల్ 22న తెరుచుకున్నాయి. కాబట్టి మీరు ఇప్పుడే మీ యాత్ర ప్రణాళిక సిద్ధం చేసుకోవచ్చు. పర్యటను ఎలా ఎంచుకుంటున్నారు అనేదానిని బట్టి, మొత్తం ఖర్చు మారుతుంది.
బడ్జెట్ అంచనా
సాధారణంగా 5 రోజుల నుంచి 10 రోజుల వరకు యాత్రకు అయ్యే ఖర్చు బడ్జెట్లో రూ.25,000 నుంచి రూ.35,000 వరకు ఉంటుంది.
కాస్త కంఫర్ట్గా వెళ్లాలి అనుకుంటే రూ.45,000 నుంచి రూ.65,000 వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది.
ఇక లగ్జరీగా, సౌకర్యవంతంగా యాత్ర చేయాలి అనుకుంటే మాత్రం రూ.1.4 లక్ష నుంచి రూ.2.3 లక్షల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది.
రవాణా ఖర్చులు
ట్రావెల్ విషయానికి వస్తే.. రైలులో సుమారు రూ.5,000 వరకు ఖర్చు అవుతుంది. హైదరాబాద్ నుంచి డెహ్రాడూన్ వరకు అప్ అండ్ డౌన్ రూ.17,000 నుంచి రూ.33,000 వరకు, లేదా హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు రూ.13,000 నుంచి రూ.17,000 వరకు ఖర్చు అవుతుంది. చాలా మంది ముందుగా ఢిల్లీ చేరుకుని, అక్కడి నుంచి హరిద్వార్ లేదా రిషికేష్కు బస్ లేదా ట్రైన్లో వెళ్లి యాత్రను కొనసాగిస్తారు.
వసతి సదుపాయాలు
గౌరీకుండ్, సోన్ ప్రయాగ్ ప్రాంతాల్లో బడ్జెట్ గెస్ట్ హౌజ్లు రూ.1,000 లోపు దొరుకుతాయి. స్టాండర్డ్ హోటల్స్ సుమారు రూ.3,000 వరకు ఉంటాయి. కేదార్నాథ్ టాప్ దగ్గర పీక్ సీజన్లో ఖర్చు కొంచెం ఎక్కువగా ఉంటుంది. జీఎంవీఎన్ టెంట్స్ లేదా రూమ్స్ రూ.1,000 నుంచి ప్రారంభమవుతాయి కానీ ముందుగా ఆన్లైన్ బుకింగ్ చేసుకోవడం తప్పనిసరి.
ఫుడ్ ఖర్చు
ఫుడ్ విషయానికి వస్తే సింపుల్ థాలీ లేదా స్నాక్స్ కోసం రోజుకు ఒక వ్యక్తికి సుమారు రూ.500 నుంచి రూ.1,000 వరకు ఖర్చు అవుతుంది. మొత్తంగా ఫుడ్, స్టే కలిపి రోజుకు రూ.1,200 నుంచి రూ.4,000 వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది.
ప్యాకేజీలు, హెలికాప్టర్
ఐఆర్సీటీసీ ఫ్లైట్ ప్యాకేజీలు ఎంచుకుంటే హైదరాబాద్ నుంచి సుమారు రూ.74,000లో సకల సౌకర్యాలతో ట్రిప్ పూర్తి చేసుకోవచ్చు. అదే కొన్ని బడ్జెట్ ప్యాకేజీలు రూ.27,000 నుంచే లభిస్తాయి. సోన్ ప్రయాగ్ నుంచి కేదార్నాథ్కు హెలికాప్టర్ సర్వీస్ కూడా అందుబాటులో ఉంటుంది. దీనికి రూ.7,000 నుంచి రూ.10,000 వరకు ఖర్చు అవుతుంది. ఈ సర్వీస్ను ఐఆర్సీటీసీ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలి.
లోకల్ ట్రాన్స్పోర్ట్
లోకల్ ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే సోన్ ప్రయాగ్ నుంచి గౌరీకుండ్కు గవర్నమెంట్ షటిల్ ట్యాక్సీ ఫేర్ కేవలం రూ.50 మాత్రమే ఉంటుంది, అయితే ప్రైవేట్ ట్యాక్సీలు ఎక్కువగా చార్జ్ చేసే అవకాశం ఉంది.
ముఖ్య సూచనలు
మే, జూన్ నెలల్లో యాత్రికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. కాస్త ప్రశాంతంగా యాత్ర చేయాలనుకుంటే సెప్టెంబర్ నుంచి అక్టోబర్ మధ్యలోనూ న్ చేసుకోవచ్చు. వెళ్లే ముందు వాతావరణ అప్డేట్స్ తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి. స్థానిక అధికారుల సూచనలు టించడం చాలా ముఖ్యం. ఈ బడ్జెట్ వివరాలు కేవలం ఒక అవగాహన కోసం మాత్రమే, ప్లాన్, సీజన్ ఆధారంగా ఖర్చులు మారవచ్చు.
– ఎం.జి.కిశోర్, ప్రయాణికుడు


