ఢిల్లీ నుంచి ఢిల్లీకి: ద ఇండియన్‌ పనోరమ టూర్‌ | 6 Nights And 7 Days Indian Panorama Journey Of Maharajas Express, Check Out Complete Details Inside | Sakshi
Sakshi News home page

ఢిల్లీ నుంచి ఢిల్లీకి: ద ఇండియన్‌ పనోరమ టూర్‌

Jul 14 2025 6:06 AM | Updated on Jul 14 2025 9:53 AM

6 Nights Indian Panorama Journey Of Maharajas Express

‘ద ఇండియన్‌ పనోరమ’ టూర్‌. ఇది ఏడు రోజుల యాత్ర. ఐఆర్‌సీటీసీ నిర్వహిస్తున్న ఈ టూర్‌ ఢిల్లీ నుంచి మొదలై ఢిల్లీకి చేరడంతో పూర్తవుతుంది. ఈ టూర్‌లో జైపూర్, రణతంబోర్, ఫతేపూర్‌ సిక్రీ, ఆగ్రా, ఓర్చా, ఖజురహో, వారణాసి ప్రదేశాలు కవర్‌ అవుతాయి.

పనోరమ టూర్‌లో ఏమేమి ఉన్నాయి?
యూపీ... ఎంపీ... రాజస్థాన్‌ రాష్ట్రాలు.
ఆరు రోజుల్లో మూడు రాష్ట్రాల పర్యటన.
జయ్‌పూర్‌లో సన్‌డయల్‌ను చూస్తాం.
అమేర్‌ కోటలో మాన్‌సింగ్‌ మందిరం.
రామ్‌బాగ్‌ రాజమందిరంలో భోజనం.
పులి పుట్టిల్లు రణతంబోర్‌ సఫారీ.
విజయం పేరుకే పరిమితమైన ఫతేపూర్‌.
ఏడు వింతల్లో స్థానం పొందిన తాజ్‌మహల్‌.
ఢిల్లీకి మోడలైన ఓర్చా ఐలాండ్‌ఫోర్ట్‌.
బ్రిటిష్‌ ఇంజనీర్‌లను దిగ్భ్రమకు గురిచేసిన...
ఆలయాల పుట్ట... ఖజురహో నగరం.
సారనాథ్‌ స్థూపం... సిల్క్‌ వీవింగ్‌ సెంటర్‌.
వారణాసిలో గంగాహారతి... పడవ విహారం.
వారం రోజులు ఏడు క్షణాలను తలపిస్తాయి.

1రోజు
ఢిల్లీ నుంచి జైపూర్‌కు ప్రయాణం. ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్‌ రైల్వే స్టేషన్‌లో ఉదయం ఏడున్నరకు పర్యాటకులకు స్వాగతం. రైలెక్కిన తర్వాత తొమ్మిది గంటలకు మహారాజాస్‌ ఎక్స్‌ప్రెస్‌ ఢిల్లీ నుంచి జయ్‌పూర్‌కు బయలుదేరుతుంది. పన్నెండు గంటలకు టూర్‌ మేనేజర్‌ పర్యాటకులకు ఈ టూర్‌ గురించిన వివరాలు తెలియచేస్తారు. ఒంటి గంటకు రైల్లోనే లంచ్‌. మూడున్నరకు రైలు జయ్‌పూర్‌కు చేరుతుంది. అమేర్‌ ఫోర్ట్‌ సందర్శనం. తిరిగి రాత్రి ఎనిమిది గంటలకు వచ్చి రైలెక్కాలి. రాత్రి భోజనం రైల్లోనే. రాత్రి బస రైల్లోనే. రైలు జయ్‌పూర్‌ స్టేషన్‌లోనే ఉంటుంది.

అమేర్‌ కోట
జయ్‌పూర్‌కి పదకొండు కిలోమీటర్ల దూరాన ఉన్న నగరం అమేర్‌. ఇందులోని కోట అమేర్‌ కోటగా వ్యవహారంలోకి వచ్చింది. రాజపుత్రుల నిర్మాణకౌశలానికి నిదర్శనం ఈ కోట. దీని నిర్మాణం నాటికే మనదేశంలో మొఘల్‌ పాలన మొదలైంది. అమేర్‌ కోటలోని కొన్ని ప్యాలెస్‌లలో మొఘల్‌ ఆర్కిటెక్చర్‌ సమ్మేళనం కూడా కనిపిస్తుంది. ఈ కోటను కట్టించిన మాన్‌సింగ్‌కి పన్నెండు మంది రాణులు. ఒక్కో రాణికి ఒక్కొక్క గది ఉంటుంది. ప్రతి గది నుంచి పై అంతస్థులోని మాన్‌సింగ్‌ గదికి మెట్లు ఉన్నాయి. శీలాదేవి ఆలయద్వారం, గణేశ్‌పోల్‌ ముఖద్వార నిర్మాణం అద్భుతంగా ఉంటాయి. ప్యాలెస్‌ లోపల గోడలకు పాలరాతిలో చేసిన ఇన్‌లే వర్క్‌ను చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది.

2రోజు
జయ్‌పూర్‌ పర్యటన. ఉదయం ఎనిమిది గంటలకు రైల్లోనే బ్రేక్‌ఫాస్ట్‌. తొమ్మిదింటికి రైలు దిగి సిటీ ప్యాలెస్, గ్యాలరీల వీక్షణానికి వెళ్లాలి. ఒంటిగంటకు తిరిగి రైలెక్కిన తర్వాత భోజనం. ఆ తర్వాత విశ్రాంతి. రైల్లో ఏర్పాటు చేసిన యాక్టివిటీలతో సేదదీరవచ్చు. సాయంత్రం ఆరు గంటలకు రామ్‌బాగ్‌ ప్యాలెస్‌కు వెళ్లాలి. డిన్నర్‌ ప్యాలెస్‌లోనే. తొమ్మిదిన్నరకు తిరిగి రైలెక్కాలి. రాత్రి పదకొండు గంటలకు రైలు జయ్‌పూర్‌నుంచి సవాయ్‌ మాధోపూర్‌ (రణతంబోర్‌)కు బయలుదేరుతుంది.

గులాబీ నగరం!
ఈ నగరం పేరు జయ్‌పూర్, రెండవ సవాయ్‌ జయ్‌సింగ్‌ నిర్మించాడు. బ్రిటిష్‌ రాజకుటుంబీకులు భారత్‌ సందర్శనార్థం వచ్చిన సందర్భంగా జయ్‌పూర్‌లోని భవనాలకు గులాబీరంగులు వేశారు. అప్పటి నుంచి పింక్‌సిటీ అనే పేరు వాడుకలోకి వచ్చింది. యునెస్కో సాధారణంగా ఒక కట్టడాన్ని లేదా ప్రదేశాన్ని మాత్రమే హెరిటేజ్‌ సైట్‌ల జాబితాలోకి తీసుకుంటుంది. ఒక నగరం మొత్తాన్ని హెరిటేజ్‌సైట్‌గా గుర్తించడం అరుదు. ఆ గౌరవం జయ్‌పూర్‌కి దక్కింది. సైక్లింగ్‌ ప్రేమికులు జయ్‌పూర్‌లో రెండు రోజులు బస చేసి, సైకిల్‌ అద్దెకు తీసుకుని పర్యాటక ప్రదేశాలను చుట్టివస్తారు. అంత సమయం లేని వాళ్లు వాహనంలో సిటీ టూర్‌ చేస్తారు. సిటీప్యాలెస్, హవామహల్, జల్‌మహల్‌ వంటి రాజపుత్రుల మార్కు నిర్మాణాలతో పాటు మనదేశ విజ్ఞానానికి ప్రతీక అయిన జంతర్‌మంతర్‌ని తప్పకుండా చూడాలి. దీనిని 1734లో నిర్మించారు. అతిపెద్ద సన్‌డయల్‌ ఇక్కడే ఉంది.

రామ్‌బాగ్‌ తొలి ప్యాలెస్‌హోటల్‌
రామ్‌బాగ్‌ ప్యాలెస్‌ జయ్‌పూర్‌కి మణిహారం వంటిది. యాభై ఎకరాల్లో విస్తరించిన ఈ ప్యాలెస్‌ ప్రధాన నగరానికి ఎనిమిది కిలోమీటర్ల దూరాన ఉంది. ఇందులో జయ్‌పూర్‌ రాజు సవాయ్‌ రెండవ మాన్‌సింగ్, మహారాణి గాయత్రీ దేవి నివసించారు. రాజకుటుంబీకుల వివాహ వేడుకలు, పోలో ఆటలు ఇక్కడే జరిగేవి. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సంస్థానాలను విలీనం చేసిన క్రమంలో ఈ ప్యాలెస్‌ను హోటల్‌గా మార్చారు. కొంతకాలం రాజకుటుంబమే నిర్వహించింది. తర్వాత తాజ్‌ గ్రూప్‌ నిర్వహిస్తోంది. ప్యాలెస్‌లో రాజభోజనం చేసే అవకాశం ఈ టూర్‌ కల్పిస్తోంది.

3రోజు
రణతంబోర్‌ నుంచి ఫతేపూర్‌ సిక్రీ. ఉదయం ఆరున్నరకు రైలు దిగి రణతంబోర్‌ నేషనల్‌ పార్కుకు వెళ్లాలి. తొమ్మిది ముప్పావుకు వెనక్కి వచ్చి రైలెక్కాలి. అప్పుడు బ్రేక్‌ఫాస్ట్‌ ఇస్తారు. పదింపావుకి రైలు ప్రయాణం ఫతేపూర్‌ సిక్రీ వైపు సాగుతుంది. మధ్యాహ్న భోజనం తర్వాత రెండూ ముప్పావుకు రైలు ఫతేపూర్‌ సిక్రీకి చేరుతుంది. మూడు నుంచి ఫతేపూర్‌ సిక్రీ నగర పర్యటన మొదలు. సాయంత్రం ఆరు గంటలకు తిరిగి రైలెక్కాలి. రైలు ఆగ్రా వైపు సాగుతుంది. ఏడున్నరకు భోజనం. ఎనిమిది గంటలకు రైలు ఆగ్రా స్టేషన్‌కు చేరుతుంది.

రణతంబోర్‌ పులి పుట్టిల్లు
రణతంబోర్‌ విస్తారమైన అడవి. కొంతభాగం పులుల సంరక్షణ కేంద్రం. రాయల్‌ బెంగాల్‌ టైగర్‌లు సంచరించే నేల ఇది. ఈ అడవిలో ఏడువందల అడుగుల ఎత్తు కొండ మీద ఓ కోట. ఇది జయ్‌పూర్‌ రాజవంశానికి చెందిన కోట. రాజపుత్రుల శత్రుదుర్భేద్య కోటలంత పెద్దది కాదు, కానీ నిర్మాణపరంగా పెద్దదే. యునెస్కో ఈ కోటను హిల్‌ ఫోర్ట్స్‌ ఆఫ్‌ రాజస్థాన్‌ కేటగిరీలో వరల్డ్‌ హెరిటేజ్‌ సైట్‌గా గుర్తించింది. ఈ అడవిలో చంబల్‌ నది ప్రవహిస్తుంది.

విజయవంతం కాని ఫతేపూర్‌ 
ఫతేపూర్‌ అంటే... సిటీ ఆఫ్‌ విక్టరీ. అంటే విజయనగరం అని అర్థం. విఫలమైన అక్బర్‌ ప్రయత్నాల్లో ఇదొకటి. ఎవరూ సొంతం చేసుకోని అక్బర్‌ బ్రెయిన్‌ చైల్డ్‌ ‘దీన్‌ ఈ ఇలాహి’ మతం కూడా ఇక్కడే పుట్టింది. ఇక్కడ పుట్టిన జహంగీర్‌ కూడా మొఘల్‌ పాలకుల్లో అత్యంత తక్కువ సమయం పాలించిన పాలకుడు, ఎటువంటి చారిత్రక గొప్పదనం లేని పాలకుడుగా మిగిలిపోయాడు. పాతికేళ్ల కిందట ఆర్కియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా ఈ ప్రదేశంలో తవ్వకాలు చేపట్టింది. సిక్రీ అనే ఈ గ్రామంలో అక్బర్‌ నగరాన్ని నిర్మించకముందు శుంగ జాతి ప్రజలు నివసించేవారని, కన్యాకుబ్జ బ్రాహ్మణుల ఆధీనంలో ఉండేదని వెల్లడైంది. అక్బర్‌కు ఇష్టమైన భార్య మరియమ్‌ ఉజ్‌ జమానీకి మగపిల్లవాడు పుట్టిన ఈ ప్రదేశంలోనే రాజధానిని నిర్మించాలని అక్బర్‌ ముచ్చటపడ్డాడు. సుమారు 150 అడుగుల ఎత్తులో ఉన్న కొండ మీద అద్భుతమైన నగరాన్ని నిర్మించాడు. యునెస్కో ఈ నగరాన్ని వరల్డ్‌ హెరిటేజ్‌ సైట్‌గా గుర్తించింది.

4రోజు
ఆగ్రా పర్యటన. ఆరున్నరకు తాజ్‌ మహల్‌ సందర్శన. తొమ్మిది గంటలకు తాజ్‌ ఖేమాలో బ్రేక్‌ఫాస్ట్‌. పదకొండు గంటలకు తిరిగి రైలెక్కాలి. రైలు ప్రయాణం ఓర్చా వైపు సాగుతుంది. మధ్యాహ్న భోజనం తర్వాత విశ్రాంతి, రైల్లో ఏర్పాటు చేసిన యాక్టివిటీలతో సేదదీరడం. రాత్రి భోజనం ఏడున్నరకు.

వాహ్‌ వండర్‌ఫుల్‌ తాజ్‌!
తాజ్‌మహల్‌ మనదేశానికి గర్వకారణం. ఇది యునెస్కో గుర్తించిన హెరిటేజ్‌ సైట్‌ మాత్రమే కాదు. ప్రపంచ వింత కూడా. ఏడు వింతల జాబితా కోసం 2007లో ఓటింగ్‌ జరిగినప్పుడు మొదట తాజ్‌ చాలా వెనుకబడింది. వెనుకబడిందనే విషయం మీద ప్రభావవతమైన కథనాలను వార్తాపత్రికలు, ఎలక్ట్రానిక్‌ మీడియా చానెళ్లు ప్రసారం చేయడంతో దేశమంతా చైతన్యవంతమైంది. ఉత్సాహవంతులు చురుగ్గా ఓటింగ్‌లో పాల్గొని తాజ్‌ మహల్‌కు ఓటు వేసి గెలిపించారు. తాజ్‌మహల్‌ మాత్రం ‘నన్ను ప్రేమించండి లేదా సమాధికి ఇంత గొప్ప నిర్మాణం అవసరమా అని ద్వేషించండి... నన్ను మాత్రం గుర్తించి తీరాల్సిందే’ అన్నట్లు ఠీవిగా ఉంటుంది. గోడలకు ఉన్న రంగురంగు ఇన్‌లే వర్క్‌ వస్త్రం మీద దారంతో అందంగా కుట్టిన పూలను తలపిస్తుంది. గోడలకు పాలరాతిలో చెక్కిన పూలను చూస్తే మైనాన్ని కరిగించి మూసలో పోసి గోడకు అతికించారా అనిపిస్తుంది. మెత్తని రాతిలో ఉలి చేసిన చాతుర్యానికి, శిల్పకారుడి నైపుణ్యానికి సలామ్‌ అనాల్సిందే. ఈ టూర్‌లో ఆగ్రాలోని రెడ్‌ఫోర్ట్‌ను కూడా చూడాలి. అక్బర్‌ తొలి రాజధాని ఆగ్రా. ఈ ఎర్ర కోట నుంచే పాలన సాగించాడు.

5రోజు
ఓర్చాకు రావడం, ఖజురహోకి ప్రయాణం. ఉదయం ఆరున్నరకు రైలు ఓర్చా స్టేషన్‌కు చేరుతుంది. ఓర్చా కోట సందర్శనం, గ్రామాల పర్యటన తర్వాత తిరిగి రైలెక్కాలి. తొమ్మిదీ ముప్పావుకు బ్రేక్‌ఫాస్ట్‌. మహారాజాస్‌ ఎక్స్‌ప్రెస్‌ ఖజురహోకు సాగుతుంది. ఒంటిగంటకు లంచ్‌. మూడింటికి రైలు ఖజురహోకి చేరుతుంది. రైలు దిగి అక్కడి ప్రసిద్ధ దేవాలయాల దర్శనం. ఆరున్నరకు వెనక్కి వచ్చి మహారాజాస్‌ ఎక్స్‌ప్రెస్‌ ఎక్కాలి. విశ్రాంతి, యాక్టివిటీస్‌తో సేదదీరడం. ఏడున్నరకు రాత్రి భోజనం. రాత్రి పదిగంటలకు రైలు వారణాసికి బయలుదేరుతుంది.

ఐలాండ్‌ ఫోర్ట్‌
ఓర్చా కోట మరీ పురాతనమైనదేమీ కాదు. పదహారవ శతాబ్దపు నిర్మాణం. బుందేల్‌ రాజపుత్రుల కోట ఇది. రుద్రప్రతాప్‌ సింగ్‌ మొదలు పెట్టాడు. ఆ తర్వాత వచ్చిన పాలకులు ఒక్కో ప్యాలెస్‌ను నిర్మిస్తూ విస్తరించారు. మొఘల్‌ పాలకుడు జహంగీర్‌ ఈ రాజ్యానికి అతిథిగా విచ్చేసిన సందర్భంగా ఆయన బస కోసం అప్పటి బుందేల్‌ఖండ్‌ రాజు వీర్‌ సింగ్‌ దేవ్‌ ఏకంగా ఒక మందిరాన్నే కట్టించారు. అదే జహంగీర్‌ ప్యాలెస్‌. ఢిల్లీ నగరాన్ని డిజైన్‌ చేసిన ఆర్కిటెక్ట్‌ ల్యూటియెన్స్‌ కూడా ఓర్చా కోట, ప్యాలెస్‌ల డిజైన్‌లతో ప్రభావితమయ్యాడు. ఈ కోట నిర్మాణంలో గొప్పతనం ఏమిటంటే... కోటలోని మూలనున్న చిన్న గదుల్లోకి కూడా సూర్యరశ్మి ధారాళంగా ప్రసరించడానికి చిన్న చిన్న గూళ్లున్నాయి. ఈ కోటలో మరో ప్రత్యేకత ఏమిటంటే... ఇది ఐలాండ్‌ ఫోర్ట్‌. బేత్వా, జామ్ని నదుల సంగమస్థలిలో ఏర్పడిన దీవి మీద నిర్మించారు. అందుకే ఈ కోట నుంచి ప్రధాన నేలమీదకు వంతెన కూడా ఉంటుంది. సాధారణంగా శత్రువుల దాడుల నుంచి రక్షణ కోట చుట్టూ కందకం తవ్వుతారు. ఇక్కడ నీటి మధ్యలో కోట ఉంటుంది.

ఆలయ నగరం ఖజురహో
ఖజురహో జైన, హిందూ దేవాలయాలకు ప్రసిద్ధి. ఎక్కువ ఆలయాలు తొమ్మిది, పది, పదకొండు శతాబ్దాలనాటివి. పన్నెండవ శతాబ్దం నాటికి ఆ సంఖ్య 85కి చేరింది. బుందేల్‌ఖండ్‌ను పాలించిన చందేల రాజవంశస్థులు నిర్మించిన ఆలయాలివన్నీ. ఇవన్నీ నగర వాస్తు శైలి నిర్మాణాలు. యునెస్కో ఈ ప్రదేశాన్ని హెరిటేజ్‌ సైట్‌గా గుర్తించింది. వైష్ణవం, శైవ ఆలయాలు, జైన ఆలయాలు నిర్మాణపరంగా చాలా ప్రత్యేకమైనవి. బ్రిటిష్‌ ఇంజనీర్‌లు ఈ నిర్మాణాలను స్వయంగా పరిశీలించి కథనాలను రాశారు. ఈ ప్రదేశం 1986లో యునెస్కో జాబితాలో చేరింది.

6రోజు
వారణాసి విహారం. ఉదయం ఎనిమిది గంటలకు రైల్లోనే బ్రేక్‌ఫాస్ట్‌. మధ్యాహ్న భోజనం హోటల్‌ తాజ్‌ గాంజెస్‌లో. లంచ్‌ తర్వాత సారనాథ్‌ స్థూపం, సిల్క్‌ వీవింగ్‌ సెంటర్‌ సందర్శనం. నాలుగన్నరకు గంగానదిలో పడవ విహారం, గంగాహారతి దర్శనం. ఎనిమిది గంటలకు తిరిగి మహారాజాస్‌ ఎక్స్‌ప్రెస్‌ చేరిన తర్వాత ఎనిమిదన్నరకు డిన్నర్‌. తొమ్మిదిన్నరకు ఢిల్లీకి ప్రయాణం.

సారనాథ్‌
బుద్ధుడి జీవితంలో సారనాథ్‌ ప్రముఖమైన ప్రదేశం. సిద్ధార్థుడు ధ్యానం చేసి బుద్ధుడైన తర్వాత తొలిసారిగా ప్రవచనం బోధించిన ప్రదేశం. బౌద్ధానికి సంబంధించిన పుస్తకాలు, వ్యాసాల్లో బుద్ధుడు ఒక చెట్టు కింద కూర్చుని ఐదుగురు శిష్యులకు బోధిస్తున్న చిత్రం ఉంటుంది. అది సారనాథ్‌లోని తొలి ప్రబోధానికి ప్రతీకాత్మక చిత్రం. సారనాథ్‌లోని బౌద్ధ స్థూపం, ప్రపంచదేశాల్లోని బుద్ధుని శిల్పాలతో ఓ గార్డెన్‌ ఉన్నాయిక్కడ. వారణాసి చేనేత కేంద్రం ఉందిక్కడ. మగ్గం ఉంటుంది. నేత ప్రక్రియలను వివరిస్తారు. ఇది సొసైటీ ఆధీనంలో నడుస్తుంది. అందుకే ఈ వీవింగ్‌ సెంటర్‌లో అమ్మే చేనేత చీరలను కచ్చితమైనవిగా భావిస్తారు. ఇక వారణాసిలో గంగాహారతిని చూడడం నయనానందకరం. ఈ టూర్‌లో కాశీ విశ్వనాథుడి దర్శనం లేదు. ఆసక్తి ఉన్న వాళ్లు మధ్యలో వీలు చేసుకుని విశ్వనాథుని దర్శనానికి వెళ్లవచ్చు.

7రోజు
తొమ్మిదింటికి రైల్లోనే బ్రేక్‌ఫాస్ట్‌. పన్నెండున్నరకు రైలు ఢిల్లీకి చేరుతుంది. స్టేషన్‌లో ఐఆర్‌సీటీసీ ఉద్యోగుల వీడ్కోలుతో పర్యటన పూర్తవుతుంది.

ప్యాకేజ్‌ ధరలివి: 
→ డీలక్స్‌ క్యాబిన్‌ లో ఒక్కొక్కరికి దాదాపుగా ఏడు లక్షల రూపాయలు. సూట్‌లో ఒక్కొక్కరికి పదమూడు లక్షల రూపాయలు. ప్రెసిడెన్షియల్‌ సూట్‌లో 22లక్షలకు పైగా అవుతుంది. వీటికి ఐదు శాతం జీఎస్‌టీ అదనం.
→ ఈ ప్రదేశాల్లో పర్యటనకు అక్టోబర్‌ నుంచి ఏప్రిల్‌ మధ్య సమయం అనువుగా ఉంటుంది. కాబట్టి బుకింగ్‌ ఇంకా మొదలవలేదు. 90 రోజుల ముందు సైట్‌ ఓపెన్‌ అవుతుంది.
→ ప్రయాణం మొత్తం 2,300 కిమీల ప్రయాణం.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement