breaking news
Tour Darshan
-
ఢిల్లీ నుంచి ఢిల్లీకి: ద ఇండియన్ పనోరమ టూర్
‘ద ఇండియన్ పనోరమ’ టూర్. ఇది ఏడు రోజుల యాత్ర. ఐఆర్సీటీసీ నిర్వహిస్తున్న ఈ టూర్ ఢిల్లీ నుంచి మొదలై ఢిల్లీకి చేరడంతో పూర్తవుతుంది. ఈ టూర్లో జైపూర్, రణతంబోర్, ఫతేపూర్ సిక్రీ, ఆగ్రా, ఓర్చా, ఖజురహో, వారణాసి ప్రదేశాలు కవర్ అవుతాయి.పనోరమ టూర్లో ఏమేమి ఉన్నాయి?యూపీ... ఎంపీ... రాజస్థాన్ రాష్ట్రాలు.ఆరు రోజుల్లో మూడు రాష్ట్రాల పర్యటన.జయ్పూర్లో సన్డయల్ను చూస్తాం.అమేర్ కోటలో మాన్సింగ్ మందిరం.రామ్బాగ్ రాజమందిరంలో భోజనం.పులి పుట్టిల్లు రణతంబోర్ సఫారీ.విజయం పేరుకే పరిమితమైన ఫతేపూర్.ఏడు వింతల్లో స్థానం పొందిన తాజ్మహల్.ఢిల్లీకి మోడలైన ఓర్చా ఐలాండ్ఫోర్ట్.బ్రిటిష్ ఇంజనీర్లను దిగ్భ్రమకు గురిచేసిన...ఆలయాల పుట్ట... ఖజురహో నగరం.సారనాథ్ స్థూపం... సిల్క్ వీవింగ్ సెంటర్.వారణాసిలో గంగాహారతి... పడవ విహారం.వారం రోజులు ఏడు క్షణాలను తలపిస్తాయి.1రోజుఢిల్లీ నుంచి జైపూర్కు ప్రయాణం. ఢిల్లీలోని సఫ్దర్జంగ్ రైల్వే స్టేషన్లో ఉదయం ఏడున్నరకు పర్యాటకులకు స్వాగతం. రైలెక్కిన తర్వాత తొమ్మిది గంటలకు మహారాజాస్ ఎక్స్ప్రెస్ ఢిల్లీ నుంచి జయ్పూర్కు బయలుదేరుతుంది. పన్నెండు గంటలకు టూర్ మేనేజర్ పర్యాటకులకు ఈ టూర్ గురించిన వివరాలు తెలియచేస్తారు. ఒంటి గంటకు రైల్లోనే లంచ్. మూడున్నరకు రైలు జయ్పూర్కు చేరుతుంది. అమేర్ ఫోర్ట్ సందర్శనం. తిరిగి రాత్రి ఎనిమిది గంటలకు వచ్చి రైలెక్కాలి. రాత్రి భోజనం రైల్లోనే. రాత్రి బస రైల్లోనే. రైలు జయ్పూర్ స్టేషన్లోనే ఉంటుంది.అమేర్ కోటజయ్పూర్కి పదకొండు కిలోమీటర్ల దూరాన ఉన్న నగరం అమేర్. ఇందులోని కోట అమేర్ కోటగా వ్యవహారంలోకి వచ్చింది. రాజపుత్రుల నిర్మాణకౌశలానికి నిదర్శనం ఈ కోట. దీని నిర్మాణం నాటికే మనదేశంలో మొఘల్ పాలన మొదలైంది. అమేర్ కోటలోని కొన్ని ప్యాలెస్లలో మొఘల్ ఆర్కిటెక్చర్ సమ్మేళనం కూడా కనిపిస్తుంది. ఈ కోటను కట్టించిన మాన్సింగ్కి పన్నెండు మంది రాణులు. ఒక్కో రాణికి ఒక్కొక్క గది ఉంటుంది. ప్రతి గది నుంచి పై అంతస్థులోని మాన్సింగ్ గదికి మెట్లు ఉన్నాయి. శీలాదేవి ఆలయద్వారం, గణేశ్పోల్ ముఖద్వార నిర్మాణం అద్భుతంగా ఉంటాయి. ప్యాలెస్ లోపల గోడలకు పాలరాతిలో చేసిన ఇన్లే వర్క్ను చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది.2రోజుజయ్పూర్ పర్యటన. ఉదయం ఎనిమిది గంటలకు రైల్లోనే బ్రేక్ఫాస్ట్. తొమ్మిదింటికి రైలు దిగి సిటీ ప్యాలెస్, గ్యాలరీల వీక్షణానికి వెళ్లాలి. ఒంటిగంటకు తిరిగి రైలెక్కిన తర్వాత భోజనం. ఆ తర్వాత విశ్రాంతి. రైల్లో ఏర్పాటు చేసిన యాక్టివిటీలతో సేదదీరవచ్చు. సాయంత్రం ఆరు గంటలకు రామ్బాగ్ ప్యాలెస్కు వెళ్లాలి. డిన్నర్ ప్యాలెస్లోనే. తొమ్మిదిన్నరకు తిరిగి రైలెక్కాలి. రాత్రి పదకొండు గంటలకు రైలు జయ్పూర్నుంచి సవాయ్ మాధోపూర్ (రణతంబోర్)కు బయలుదేరుతుంది.గులాబీ నగరం!ఈ నగరం పేరు జయ్పూర్, రెండవ సవాయ్ జయ్సింగ్ నిర్మించాడు. బ్రిటిష్ రాజకుటుంబీకులు భారత్ సందర్శనార్థం వచ్చిన సందర్భంగా జయ్పూర్లోని భవనాలకు గులాబీరంగులు వేశారు. అప్పటి నుంచి పింక్సిటీ అనే పేరు వాడుకలోకి వచ్చింది. యునెస్కో సాధారణంగా ఒక కట్టడాన్ని లేదా ప్రదేశాన్ని మాత్రమే హెరిటేజ్ సైట్ల జాబితాలోకి తీసుకుంటుంది. ఒక నగరం మొత్తాన్ని హెరిటేజ్సైట్గా గుర్తించడం అరుదు. ఆ గౌరవం జయ్పూర్కి దక్కింది. సైక్లింగ్ ప్రేమికులు జయ్పూర్లో రెండు రోజులు బస చేసి, సైకిల్ అద్దెకు తీసుకుని పర్యాటక ప్రదేశాలను చుట్టివస్తారు. అంత సమయం లేని వాళ్లు వాహనంలో సిటీ టూర్ చేస్తారు. సిటీప్యాలెస్, హవామహల్, జల్మహల్ వంటి రాజపుత్రుల మార్కు నిర్మాణాలతో పాటు మనదేశ విజ్ఞానానికి ప్రతీక అయిన జంతర్మంతర్ని తప్పకుండా చూడాలి. దీనిని 1734లో నిర్మించారు. అతిపెద్ద సన్డయల్ ఇక్కడే ఉంది.రామ్బాగ్ తొలి ప్యాలెస్హోటల్రామ్బాగ్ ప్యాలెస్ జయ్పూర్కి మణిహారం వంటిది. యాభై ఎకరాల్లో విస్తరించిన ఈ ప్యాలెస్ ప్రధాన నగరానికి ఎనిమిది కిలోమీటర్ల దూరాన ఉంది. ఇందులో జయ్పూర్ రాజు సవాయ్ రెండవ మాన్సింగ్, మహారాణి గాయత్రీ దేవి నివసించారు. రాజకుటుంబీకుల వివాహ వేడుకలు, పోలో ఆటలు ఇక్కడే జరిగేవి. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సంస్థానాలను విలీనం చేసిన క్రమంలో ఈ ప్యాలెస్ను హోటల్గా మార్చారు. కొంతకాలం రాజకుటుంబమే నిర్వహించింది. తర్వాత తాజ్ గ్రూప్ నిర్వహిస్తోంది. ప్యాలెస్లో రాజభోజనం చేసే అవకాశం ఈ టూర్ కల్పిస్తోంది.3రోజురణతంబోర్ నుంచి ఫతేపూర్ సిక్రీ. ఉదయం ఆరున్నరకు రైలు దిగి రణతంబోర్ నేషనల్ పార్కుకు వెళ్లాలి. తొమ్మిది ముప్పావుకు వెనక్కి వచ్చి రైలెక్కాలి. అప్పుడు బ్రేక్ఫాస్ట్ ఇస్తారు. పదింపావుకి రైలు ప్రయాణం ఫతేపూర్ సిక్రీ వైపు సాగుతుంది. మధ్యాహ్న భోజనం తర్వాత రెండూ ముప్పావుకు రైలు ఫతేపూర్ సిక్రీకి చేరుతుంది. మూడు నుంచి ఫతేపూర్ సిక్రీ నగర పర్యటన మొదలు. సాయంత్రం ఆరు గంటలకు తిరిగి రైలెక్కాలి. రైలు ఆగ్రా వైపు సాగుతుంది. ఏడున్నరకు భోజనం. ఎనిమిది గంటలకు రైలు ఆగ్రా స్టేషన్కు చేరుతుంది.రణతంబోర్ పులి పుట్టిల్లురణతంబోర్ విస్తారమైన అడవి. కొంతభాగం పులుల సంరక్షణ కేంద్రం. రాయల్ బెంగాల్ టైగర్లు సంచరించే నేల ఇది. ఈ అడవిలో ఏడువందల అడుగుల ఎత్తు కొండ మీద ఓ కోట. ఇది జయ్పూర్ రాజవంశానికి చెందిన కోట. రాజపుత్రుల శత్రుదుర్భేద్య కోటలంత పెద్దది కాదు, కానీ నిర్మాణపరంగా పెద్దదే. యునెస్కో ఈ కోటను హిల్ ఫోర్ట్స్ ఆఫ్ రాజస్థాన్ కేటగిరీలో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించింది. ఈ అడవిలో చంబల్ నది ప్రవహిస్తుంది.విజయవంతం కాని ఫతేపూర్ ఫతేపూర్ అంటే... సిటీ ఆఫ్ విక్టరీ. అంటే విజయనగరం అని అర్థం. విఫలమైన అక్బర్ ప్రయత్నాల్లో ఇదొకటి. ఎవరూ సొంతం చేసుకోని అక్బర్ బ్రెయిన్ చైల్డ్ ‘దీన్ ఈ ఇలాహి’ మతం కూడా ఇక్కడే పుట్టింది. ఇక్కడ పుట్టిన జహంగీర్ కూడా మొఘల్ పాలకుల్లో అత్యంత తక్కువ సమయం పాలించిన పాలకుడు, ఎటువంటి చారిత్రక గొప్పదనం లేని పాలకుడుగా మిగిలిపోయాడు. పాతికేళ్ల కిందట ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈ ప్రదేశంలో తవ్వకాలు చేపట్టింది. సిక్రీ అనే ఈ గ్రామంలో అక్బర్ నగరాన్ని నిర్మించకముందు శుంగ జాతి ప్రజలు నివసించేవారని, కన్యాకుబ్జ బ్రాహ్మణుల ఆధీనంలో ఉండేదని వెల్లడైంది. అక్బర్కు ఇష్టమైన భార్య మరియమ్ ఉజ్ జమానీకి మగపిల్లవాడు పుట్టిన ఈ ప్రదేశంలోనే రాజధానిని నిర్మించాలని అక్బర్ ముచ్చటపడ్డాడు. సుమారు 150 అడుగుల ఎత్తులో ఉన్న కొండ మీద అద్భుతమైన నగరాన్ని నిర్మించాడు. యునెస్కో ఈ నగరాన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించింది.4రోజుఆగ్రా పర్యటన. ఆరున్నరకు తాజ్ మహల్ సందర్శన. తొమ్మిది గంటలకు తాజ్ ఖేమాలో బ్రేక్ఫాస్ట్. పదకొండు గంటలకు తిరిగి రైలెక్కాలి. రైలు ప్రయాణం ఓర్చా వైపు సాగుతుంది. మధ్యాహ్న భోజనం తర్వాత విశ్రాంతి, రైల్లో ఏర్పాటు చేసిన యాక్టివిటీలతో సేదదీరడం. రాత్రి భోజనం ఏడున్నరకు.వాహ్ వండర్ఫుల్ తాజ్!తాజ్మహల్ మనదేశానికి గర్వకారణం. ఇది యునెస్కో గుర్తించిన హెరిటేజ్ సైట్ మాత్రమే కాదు. ప్రపంచ వింత కూడా. ఏడు వింతల జాబితా కోసం 2007లో ఓటింగ్ జరిగినప్పుడు మొదట తాజ్ చాలా వెనుకబడింది. వెనుకబడిందనే విషయం మీద ప్రభావవతమైన కథనాలను వార్తాపత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా చానెళ్లు ప్రసారం చేయడంతో దేశమంతా చైతన్యవంతమైంది. ఉత్సాహవంతులు చురుగ్గా ఓటింగ్లో పాల్గొని తాజ్ మహల్కు ఓటు వేసి గెలిపించారు. తాజ్మహల్ మాత్రం ‘నన్ను ప్రేమించండి లేదా సమాధికి ఇంత గొప్ప నిర్మాణం అవసరమా అని ద్వేషించండి... నన్ను మాత్రం గుర్తించి తీరాల్సిందే’ అన్నట్లు ఠీవిగా ఉంటుంది. గోడలకు ఉన్న రంగురంగు ఇన్లే వర్క్ వస్త్రం మీద దారంతో అందంగా కుట్టిన పూలను తలపిస్తుంది. గోడలకు పాలరాతిలో చెక్కిన పూలను చూస్తే మైనాన్ని కరిగించి మూసలో పోసి గోడకు అతికించారా అనిపిస్తుంది. మెత్తని రాతిలో ఉలి చేసిన చాతుర్యానికి, శిల్పకారుడి నైపుణ్యానికి సలామ్ అనాల్సిందే. ఈ టూర్లో ఆగ్రాలోని రెడ్ఫోర్ట్ను కూడా చూడాలి. అక్బర్ తొలి రాజధాని ఆగ్రా. ఈ ఎర్ర కోట నుంచే పాలన సాగించాడు.5రోజుఓర్చాకు రావడం, ఖజురహోకి ప్రయాణం. ఉదయం ఆరున్నరకు రైలు ఓర్చా స్టేషన్కు చేరుతుంది. ఓర్చా కోట సందర్శనం, గ్రామాల పర్యటన తర్వాత తిరిగి రైలెక్కాలి. తొమ్మిదీ ముప్పావుకు బ్రేక్ఫాస్ట్. మహారాజాస్ ఎక్స్ప్రెస్ ఖజురహోకు సాగుతుంది. ఒంటిగంటకు లంచ్. మూడింటికి రైలు ఖజురహోకి చేరుతుంది. రైలు దిగి అక్కడి ప్రసిద్ధ దేవాలయాల దర్శనం. ఆరున్నరకు వెనక్కి వచ్చి మహారాజాస్ ఎక్స్ప్రెస్ ఎక్కాలి. విశ్రాంతి, యాక్టివిటీస్తో సేదదీరడం. ఏడున్నరకు రాత్రి భోజనం. రాత్రి పదిగంటలకు రైలు వారణాసికి బయలుదేరుతుంది.ఐలాండ్ ఫోర్ట్ఓర్చా కోట మరీ పురాతనమైనదేమీ కాదు. పదహారవ శతాబ్దపు నిర్మాణం. బుందేల్ రాజపుత్రుల కోట ఇది. రుద్రప్రతాప్ సింగ్ మొదలు పెట్టాడు. ఆ తర్వాత వచ్చిన పాలకులు ఒక్కో ప్యాలెస్ను నిర్మిస్తూ విస్తరించారు. మొఘల్ పాలకుడు జహంగీర్ ఈ రాజ్యానికి అతిథిగా విచ్చేసిన సందర్భంగా ఆయన బస కోసం అప్పటి బుందేల్ఖండ్ రాజు వీర్ సింగ్ దేవ్ ఏకంగా ఒక మందిరాన్నే కట్టించారు. అదే జహంగీర్ ప్యాలెస్. ఢిల్లీ నగరాన్ని డిజైన్ చేసిన ఆర్కిటెక్ట్ ల్యూటియెన్స్ కూడా ఓర్చా కోట, ప్యాలెస్ల డిజైన్లతో ప్రభావితమయ్యాడు. ఈ కోట నిర్మాణంలో గొప్పతనం ఏమిటంటే... కోటలోని మూలనున్న చిన్న గదుల్లోకి కూడా సూర్యరశ్మి ధారాళంగా ప్రసరించడానికి చిన్న చిన్న గూళ్లున్నాయి. ఈ కోటలో మరో ప్రత్యేకత ఏమిటంటే... ఇది ఐలాండ్ ఫోర్ట్. బేత్వా, జామ్ని నదుల సంగమస్థలిలో ఏర్పడిన దీవి మీద నిర్మించారు. అందుకే ఈ కోట నుంచి ప్రధాన నేలమీదకు వంతెన కూడా ఉంటుంది. సాధారణంగా శత్రువుల దాడుల నుంచి రక్షణ కోట చుట్టూ కందకం తవ్వుతారు. ఇక్కడ నీటి మధ్యలో కోట ఉంటుంది.ఆలయ నగరం ఖజురహోఖజురహో జైన, హిందూ దేవాలయాలకు ప్రసిద్ధి. ఎక్కువ ఆలయాలు తొమ్మిది, పది, పదకొండు శతాబ్దాలనాటివి. పన్నెండవ శతాబ్దం నాటికి ఆ సంఖ్య 85కి చేరింది. బుందేల్ఖండ్ను పాలించిన చందేల రాజవంశస్థులు నిర్మించిన ఆలయాలివన్నీ. ఇవన్నీ నగర వాస్తు శైలి నిర్మాణాలు. యునెస్కో ఈ ప్రదేశాన్ని హెరిటేజ్ సైట్గా గుర్తించింది. వైష్ణవం, శైవ ఆలయాలు, జైన ఆలయాలు నిర్మాణపరంగా చాలా ప్రత్యేకమైనవి. బ్రిటిష్ ఇంజనీర్లు ఈ నిర్మాణాలను స్వయంగా పరిశీలించి కథనాలను రాశారు. ఈ ప్రదేశం 1986లో యునెస్కో జాబితాలో చేరింది.6రోజువారణాసి విహారం. ఉదయం ఎనిమిది గంటలకు రైల్లోనే బ్రేక్ఫాస్ట్. మధ్యాహ్న భోజనం హోటల్ తాజ్ గాంజెస్లో. లంచ్ తర్వాత సారనాథ్ స్థూపం, సిల్క్ వీవింగ్ సెంటర్ సందర్శనం. నాలుగన్నరకు గంగానదిలో పడవ విహారం, గంగాహారతి దర్శనం. ఎనిమిది గంటలకు తిరిగి మహారాజాస్ ఎక్స్ప్రెస్ చేరిన తర్వాత ఎనిమిదన్నరకు డిన్నర్. తొమ్మిదిన్నరకు ఢిల్లీకి ప్రయాణం.సారనాథ్బుద్ధుడి జీవితంలో సారనాథ్ ప్రముఖమైన ప్రదేశం. సిద్ధార్థుడు ధ్యానం చేసి బుద్ధుడైన తర్వాత తొలిసారిగా ప్రవచనం బోధించిన ప్రదేశం. బౌద్ధానికి సంబంధించిన పుస్తకాలు, వ్యాసాల్లో బుద్ధుడు ఒక చెట్టు కింద కూర్చుని ఐదుగురు శిష్యులకు బోధిస్తున్న చిత్రం ఉంటుంది. అది సారనాథ్లోని తొలి ప్రబోధానికి ప్రతీకాత్మక చిత్రం. సారనాథ్లోని బౌద్ధ స్థూపం, ప్రపంచదేశాల్లోని బుద్ధుని శిల్పాలతో ఓ గార్డెన్ ఉన్నాయిక్కడ. వారణాసి చేనేత కేంద్రం ఉందిక్కడ. మగ్గం ఉంటుంది. నేత ప్రక్రియలను వివరిస్తారు. ఇది సొసైటీ ఆధీనంలో నడుస్తుంది. అందుకే ఈ వీవింగ్ సెంటర్లో అమ్మే చేనేత చీరలను కచ్చితమైనవిగా భావిస్తారు. ఇక వారణాసిలో గంగాహారతిని చూడడం నయనానందకరం. ఈ టూర్లో కాశీ విశ్వనాథుడి దర్శనం లేదు. ఆసక్తి ఉన్న వాళ్లు మధ్యలో వీలు చేసుకుని విశ్వనాథుని దర్శనానికి వెళ్లవచ్చు.7రోజుతొమ్మిదింటికి రైల్లోనే బ్రేక్ఫాస్ట్. పన్నెండున్నరకు రైలు ఢిల్లీకి చేరుతుంది. స్టేషన్లో ఐఆర్సీటీసీ ఉద్యోగుల వీడ్కోలుతో పర్యటన పూర్తవుతుంది.ప్యాకేజ్ ధరలివి: → డీలక్స్ క్యాబిన్ లో ఒక్కొక్కరికి దాదాపుగా ఏడు లక్షల రూపాయలు. సూట్లో ఒక్కొక్కరికి పదమూడు లక్షల రూపాయలు. ప్రెసిడెన్షియల్ సూట్లో 22లక్షలకు పైగా అవుతుంది. వీటికి ఐదు శాతం జీఎస్టీ అదనం.→ ఈ ప్రదేశాల్లో పర్యటనకు అక్టోబర్ నుంచి ఏప్రిల్ మధ్య సమయం అనువుగా ఉంటుంది. కాబట్టి బుకింగ్ ఇంకా మొదలవలేదు. 90 రోజుల ముందు సైట్ ఓపెన్ అవుతుంది.→ ప్రయాణం మొత్తం 2,300 కిమీల ప్రయాణం. -
దసరాకు ఆర్టీసీ ‘ స్పెషల్’!
యాదాద్రి: తెలంగాణలో అతిపెద్ద పండుగ అయిన దసరాకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ధ ఏటా స్పెషల్ బస్సులు నడుపుతోంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆయా ప్రాంతాలకు ప్రత్యేక సర్వీసులతో మంచి ఆదాయాన్ని అర్జిస్తోంది. ఇందులో భాగంగానే ఈనెల 13వ తేదీ నుంచి 15 వరకు, తిరిగి 19 నుంచి 22వ తేదీ వరకు నల్లగొండ ఆర్టీసీ రీజియన్ పరిధిలో 409 బస్సులను నడపాలని అధికారులు నిర్ణయించారు. గతేడాది మాదిరిగానే ఈ ప్రత్యేక బస్సుల్లో సాధారణ చార్జీలనే వసూలు చేయనున్నారు. ఇక ఆర్టీసీ ఎండీ సజ్జనార్ నియామకం తర్వాత వినూత్న కార్యక్రమాలతో ముందుకు వస్తుండగా.. రాఖీ సందర్భంగా సత్ఫలితాలు ఇచ్చిన గిఫ్ట్ల కార్యక్రమాన్ని ఈ పండుగకు ప్రవేశపెట్టనున్నారు. 10 మందికి రూ.9,900 చొప్పున నగదు బహుమతులు ఇవ్వనున్నారు. 10 మంది ప్రయాణికులకు గిఫ్ట్లు ప్రయాణికుల ఆదరణ పొందడం.. తద్వారా మంచి ఆదాయాన్ని గడించేందుకు వినూత్న కార్యక్రమాలతో ఆర్టీసీ ముందుకు వస్తోంది. రాఖీ సందర్భంగా చేపట్టిన బహుమతుల పథకానికి ప్రయాణికుల నుంచి మంచి స్పందన రావడంతో ఈ దసరాకు కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఇందుకోసం రీజియన్ పరిధిలో ఐదుగురు మహిళలు, ఐదుగురు పురుషులను ఎంపిక చేయనున్నారు. పండుగకు ముందు ఈనెల 21 నుంచి 23 వరకు, పండుగ తర్వాత 28నుంచి 30వ తేదీల్లో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారు తమ టికెట్ వెనుక పేరు, ఫోన్నంబర్ రాసి.. ఆర్టీసీ ఏర్పాటు చేసే బాక్సుల్లో వేయాల్సి ఉంటుంది. ఈ బాక్సులను నల్ల గొండ, దేవరకొండ, చౌటుప్పల్, చిట్యాల, నార్కట్పల్లి, కొండమల్లేపల్లి, మిర్యాలగూడ, కోదాడ, సూర్యాపేట హైటెక్ బస్టాండ్, కొత్తబస్టాండ్, యాదగిరిగుట్ట కొత్త బస్టాండ్, పాతబస్టాండ్, భువనగిరి బస్టాండ్లలో ఏర్పాటు చేయనున్నారు. రద్దీ రోజులను గుర్తించి.. ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా నల్లగొండ, నార్కట్పల్లి, మిర్యాలగూడ, దేవరకొండ, కోదాడ, సూర్యాపేట, యాదగిరిగుట్ట మొత్తం ఏడు ఆర్టీసీ డిపోలు ఉన్నాయి. ప్రధానంగా ఉమ్మడి జిల్లావాసులు ఉద్యోగాలు, ఇతర పనులు, విద్య కోసం రాజధాని హైదరాబాద్లోనే అధికంగా ఉంటుంటారు. ఈ నేపథ్యంలో విద్యాసంస్థలకు సెలవులు ఉండడం, బతుకమ్మ, దసరా అతి పెద్ద పండుగలు కావడంతో పెద్దఎత్తున జనం సొంత గ్రామాలకు తరలి వస్తుంటారు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి ఆయా డిపోలకు వచ్చే ప్రయాణికుల రద్దీ అధికంగా ఉంటుంది. మొదట్లో విద్యాసంస్థలకు సెలవు ఉండడంతో ఈనెల 13 నుంచి 15వ తేదీ వరకు, తర్వాత సాధారణ జనం రద్దీ కారణంగా 19నుంచి 22వ తేదీ వరకు.. ఇలా మొత్తంగా ఏడు రోజుల పాటు ప్రయాణికుల రద్దీ ఉంటుందని భావించి ఆయా తేదీల్లో రాజధానికి అదనపు బస్సులు నడపనున్నారు. 409 బస్సులు.. సాధారణ చార్జీలు పండుగ నేపథ్యంలో ఆర్టీసీ నల్లగొండ రీజియన్ పరిధిలో మొత్తం 409 బస్సులతో అధికారులు షెడ్యూల్ ప్రకటించారు. మొదటిరోజు శుక్రవారం ఏడు డిపోల నుంచి 56 బస్సులను నడిపారు. ఇక 14వ తేదీన 36 బస్సులు నడపనున్నారు. 15వ తేదీన 35 బస్సులు తిప్పుతారు. తిరిగి ఈనెల 19న 71 బస్సులు, 20వ తేదీన 56 బస్సులు, 21వ తేదీన 75 బస్సులు, 22వ తేదీన 80 బస్సులు నడపనున్నారు. అయితే గతంలో స్పెషల్ బస్సులను నడిపితే 20 శాతం మేర చార్జీలు అదనంగా వసూలు చేసేవారు. 2022లో బస్ చార్జీలు రెండుసార్లు పెంచడం, చిల్లర సమస్యతో మరోసారి పెంచడంతో గతేడాది దసరా స్పెషల్ బస్సులకు చార్జీలను పెంచలేదు. ఈ సారి కూడా రోజువారీగా వసూలు చేసే చార్జీలనే తీసుకోనున్నారు. ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలి బతుకమ్మ, దసరా పండుగకు ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని నల్లగొండ రీజియన్ పరిధిలో 409 ప్రత్యేక బస్సులు నడుపుతున్నాం. ప్రయాణికులు స్పెషల్ బస్సులను సద్వినియోగం చేసుకోవాలి. ప్రయాణికుల రద్దీని బట్టి ఇంకా అదనంగా సర్వీసులు నడుపుతాం. ఈ పండుగకు నగదు బహుమతులు అందిస్తున్నాం. – ఎస్.శ్రీదేవి, ఆర్టీసీ ఆర్ఎం, నల్లగొండ -
అగుంబే... అద్భుతః
టూర్దర్శన్ నింగిని తాకే కొండలను నీలిమబ్బులు చుంబించే దృశ్యాలు ఈశాన్యంలోని చిరపుంజిలో మాత్రమే కాదు, దక్షిణాదిలో అగుంబేలోనూ కనిపిస్తాయి. అందుకే, కర్ణాటకలోని అగుంబేను ‘చిరపుంజి ఆఫ్ సౌత్’ అంటారు. అరేబియన్ సముద్ర తీరానికి 55 కిలోమీటర్ల దూరంలో పడమటి కనుమల్లో ఉన్న ఈ చిన్న గ్రామం ప్రకృతి ప్రేమికులకు సాక్షాత్తు స్వర్గధామమే. నింగిని తాకే కొండలు, దట్టమైన అడవులతో నిండిన లోయలు, అడుగడుగునా తారసపడే జలపాతాలు... అద్భుతః అనిపిస్తాయి. కర్ణాటకలోని షిమోగా జిల్లాలో మూడు చదరపు కిలోమీటర్ల చిన్న గ్రామం అగుంబే. జనాభా దాదాపు ఐదువందలు మాత్రమే. పక్షుల కిలకిలలు తప్ప పట్టణ ప్రాంతపు రణగొణలేవీ ఇక్కడ వినిపించవు. పడమటి కనుమల్లో పుష్కలంగా వర్షాలు కురిసే ప్రదేశం ఇది. అందుకే పచ్చదనానికి చిరునామాలా ఉంటుంది. ఏం చూడాలి? అగుంబే చుట్టుపక్కల ముఖ్యంగా చూడాల్సినవి ఇక్కడి జలపాతాలనే. కొండల మీదుగా నేల మీదకు ఉరికే జలపాతాలు ఇక్కడ అడుగడుగునా తారసపడతాయి. ముఖ్యంగా బర్కానా జలపాతం, కూడ్లుతీర్థ జలపాతం, జోగిగుండి జలపాతం వంటి జలపాతాలు పర్యాటకులకు కనువిందు చేస్తాయి. ఈ జలపాతాల వద్ద చాలామంది పిక్నిక్ పార్టీలు చేసుకుంటూ ఉంటారు. * అగుంబే-ఉడిపి రోడ్డుకు చేరువలోని ఎత్తయిన శిఖరంపై ఉన్న సన్సెట్ వ్యూపాయింట్ నుంచి సూర్యాస్తమయ దృశ్యాన్ని తిలకించడానికి కూడా పర్యాటకులు ఇష్టపడతారు. ఇక్కడి నుంచి చూస్తే సుదూరాన అరేబియన్ సముద్రంలోకి కుంగుతున్న సూర్యబింబం కనిపిస్తుంది. * ఇక్కడ చూడాల్సిన ప్రదేశాల్లో అగుంబే రెయిన్ ఫారెస్ట్ రీసెర్చ్ స్టేషన్ ఒకటి. ఏడాది మొత్తంలో 7 వేల మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అగుంబేలోని అడవుల వైవిధ్యంపై ఇక్కడి శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగిస్తూ ఉంటారు. వాటి విశేషాలను ఇక్కడ తెలుసుకోవచ్చు. * అగుంబేలోని శ్రీకృష్ణ ఆలయం, శ్రీ సిద్ధి వినాయక ఆలయం, నడబర ఈశ్వరాలయం, ఇక్కడకు చేరువలోని నాగూరులో ఆంజనేయ ఆలయం వంటి పురాతన ఆలయాలు ఆధ్యాత్మిక ఆసక్తి గల పర్యాటకులను ఆకట్టుకుంటాయి. * ఇక్కడి చేరువలోనే ఉడిపి శ్రీకృష్ణ క్షేత్రం, శృంగేరీ శంకరాచార్య పీఠం ఉన్నాయి. అగుంబేలో విహార యాత్ర తర్వాత వీటిని కూడా సందర్శించుకోవచ్చు. * ఇక్కడి జీవవైవిధ్యాన్ని తిలకించాలనుకునే వారు అగుంబే చేరువలోని సోమేశ్వర వన్యప్రాణి అభయారణ్యం, కుద్రేముఖ్ జాతీయ పార్కులను తిలకించవచ్చు. ఈ రెండు చోట్ల రకరకాల వన్యప్రాణులు, అరుదైన పక్షులు కనిపిస్తాయి. ఏం చేయాలి? * అగుంబేలోని ఎత్తయిన కొండలు పర్వతారోహకులకు సవాలుగా ఉంటాయి. సరదాగా ఈ కొండలపై ట్రెక్కింగ్ చేయవచ్చు. అయితే తరచు కురిసే వానల వల్ల నిత్యం తడిగా ఉండే ఈ కొండలపై ఆచి తూచి అడుగులేయాల్సి ఉంటుంది. * వాహనాల రద్దీ తక్కువగా ఉండే ఇక్కడి వీధులు నడక, జాగింగ్, సైక్లింగ్ వంటి వ్యాయామ కాలక్షేపాలకు అనువుగా ఉంటాయి. * ఊరికి దూరంగా ప్రశాంత వాతావరణంలో వనవిహారాలకు వెళ్లవచ్చు. జలపాతాల వద్ద జలక్రీడలు ఆడవచ్చు. పిక్నిక్ పార్టీలు చేసుకోవచ్చు. ఏం కొనాలి? * అగుంబే చేనేత పరిశ్రమకు ప్రసిద్ధి. ఇక్కడి రక్షాకవచ చేనేత సహకార పరిశ్రమలో స్థానిక చేనేత కళాకారులు నేసిన దుస్తులను సరసమైన ధరలకు కొనుక్కోవచ్చు. * ఇక్కడి బజారులోని చిన్న చిన్న దుకాణాల్లో వనమూలికలు, తేనె వంటి అటవీ ఉత్పత్తులు కూడా చౌకగా దొరుకుతాయి. * అరేబియన్ సముద్రానికి దగ్గరగా ఉండటం, చుట్టుపక్కల విరివిగా జలపాతాలు ఉండటంతో ఇక్కడి రెస్టారెంట్లలో దొరికే చేపల వంటకాలను ఆస్వాదించవచ్చు. ఎలా చేరుకోవాలి? * ఇక్కడకు దగ్గర్లోని రైల్వేస్టేషన్ ఉడిపిలో ఉంది. రైలు మార్గంలో వచ్చేవారు ఉడిపి చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో అగుంబే చేరుకోవచ్చు. * ఉడిపి నుంచి అగుంబే వరకు బస్సులు, ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయి. * విమానాల్లో వచ్చేవారు మంగళూరు విమానాశ్రయంలో దిగి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఇక్కడకు రావాల్సి ఉంటుంది.