పోషకాహారంపై మల్లగుల్లాలు | - | Sakshi
Sakshi News home page

పోషకాహారంపై మల్లగుల్లాలు

Aug 2 2026 12:58 AM | Updated on Aug 2 2026 12:58 AM

సమస్యకు ప్రధాన కారణాలు

నూజివీడు: ఆర్జీయూకేటీ అధికారుల అసమర్థత, అనుభవరాహిత్యం, సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల ట్రిపుల్‌ఐటీలో చదువుకుంటున్న దాదాపు 8,800 మంది పేద విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందడం లేదు. విద్యాసంవత్సరం ప్రారంభమై నెల రోజులు గడిచినా విద్యార్థులకు కోడిగుడ్డు, చికెన్‌ వడ్డించకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారుల తీవ్ర జాప్యం వల్ల ప్రజల్లో, తల్లిదండ్రుల్లో ట్రిపుల్‌ఐటీ పట్ల ఉన్న గౌరవం క్రమేణా తగ్గిపోతోంది.

నామినేషన్‌ పద్ధతిలో కేటాయింపు

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా 2024 సెప్టెంబరులో పాత మెస్‌ కాంట్రాక్టర్లను తప్పించారు. అయితే పారదర్శకంగా టెండర్లు పిలవకుండా, నామినేషన్‌ పద్ధతిలో మెస్‌ నిర్వహణను ‘హరేకృష్ణ చారిటబుల్‌ ఫౌండేషన్‌’కు అప్పగించారు.

ముందే తెలిసినా నిర్లక్ష్యం: తాము శాకాహారమే అందిస్తామని, చికెన్‌, కోడిగుడ్లు పెట్టలేమని ఫౌండేషన్‌ స్పష్టం చేసినప్పటికీ... అధికారులకు దూరదృష్టి, అవగాహన లేకపోవడంతో వారికి కాక వేరేవారికి టెండర్లు ఇవ్వకుండా అత్యుత్సాహంతో ఫౌండేషన్‌కే బాధ్యతలు అప్పగించారు.

తాత్కాలిక ప్రత్యామ్నాయం విఫలం

గతేడాది దసరా నుంచి నాన్‌–వెజ్‌ బాధ్యతలను క్యాంపస్‌లోని ‘హెల్పింగ్‌ హ్యాండ్స్‌’ (ఫ్యాకల్టీ ఆధ్వర్యంలో నడిచే సంస్థ)కు అప్పగించారు. అయితే, ఈ విద్యాసంవత్సరంలో నాన్‌–వెజ్‌ పెట్టడం తమవల్ల కాదని హెల్పింగ్‌ హ్యాండ్స్‌ చేతులెత్తేయడంతో సమస్య మరింత జటిలమైంది.

అధికారుల దిద్దుబాటు చర్యలు.. తాజా పరిస్థితి

నెలరోజుల నుంచి చికెన్‌, గుడ్డు పెట్టకపోవడంతో వస్తున్న తీవ్ర విమర్శలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఆర్జీయూకేటీ అధికారులు ఎలాగైనా సరే హెల్పింగ్‌ హ్యాండ్స్‌ ప్రతినిధులను బతిమాలైనా సరే వారితోనే పెట్టించడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ మేరకు శుక్రవారం వారితో సమావేశం ఏర్పాటు చేసి చికెన్‌, గుడ్డు పెట్టేలా ఒప్పించినట్లు తెలిసింది. సేవా ధృక్ఫథంతో ఏర్పాటైన హెల్పింగ్‌ హ్యాండ్స్‌కు ఎలా ఇస్తారనే దానిపై గతంలోనే విమర్శలు వ చ్చినా మరలా ఆ సంస్థకే అప్పగించడం గమనార్హం. దీంతో ఇక నుంచి హెల్పింగ్‌ హ్యాండ్స్‌ బాధ్యతలు నిర్వర్తించే ఫ్యాకల్టీ గుడ్డు, చికెన్‌ పెట్టే పనిలో నిమగ్నం కానున్నారు. గుడ్డు, చికెన్‌ పెట్టడానికి ఒక విద్యార్థికి వారానికి రూ.46.20 కేటాయించిన నేపథ్యంలో వారానికి ఎన్ని రోజులు గుడ్డు, చికెన్‌ పెడతారో మన్ముందు తెలియనుంది.

ట్రిపుల్‌ఐటీలో విద్యార్థులకు అందని గుడ్డు, చికెన్‌

మెనూలోనూ కోతలు

నెల రోజులు దాటినా పిలవని టెండర్లు

హెల్పింగ్‌ హ్యాండ్స్‌కు బాధ్యతలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement