ఏలూరు (ఆర్ఆర్పేట): రాష్ట్ర ప్రభుత్వం, సమగ్ర శిక్ష, పీఎం శ్రీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పారా క్రీడోత్సవాల్లో ఏలూరు జిల్లా విద్యార్థులు ప్రతిభ కనబరిచి జిల్లా ఖ్యాతిని రాష్ట్ర స్థాయిలో చాటారని జిల్లా విద్యాశాఖాధికారి ఎం. వెంకటలక్ష్మమ్మ ప్రశంసించారు. పోటీల్లో పతకాలు సాధించిన విద్యార్థులను బుధవారం తన కార్యాలయంలో ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఏలూరు జిల్లాకు చెందిన క్రీడాకారులు తమ ప్రతిభ, పట్టుదల, ఆత్మవిశ్వాసంతో విశేషంగా రాణించి మొత్తం 37 పతకాలను కై వసం చేసుకున్నారని తెలిపారు. వాటిలో 14 స్వర్ణ పతకాలు, 15 రజత పతకాలు, 8 కాంస్య పతకాలు ఉన్నాయని వివరించారు. ఈ విజయాలు విద్యార్థుల కఠిన శ్రమ, నిరంతర సాధన, అంకితభావానికి నిదర్శనమన్నారు. రాష్ట్ర స్థాయిలో విజేతలుగా నిలిచి ఏలూరు జిల్లా ప్రతిష్టను ఇనుమడింపజేసిన విద్యార్థులను, వారికి శిక్షణ అందించిన కోచ్లను, ఉపాధ్యాయులను, తల్లిదండ్రులను ఆమె అభినందించారు. భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లోనూ మరిన్ని విజయాలు సాధించి రాష్ట్రానికి, దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు.


