ఏలూరు (ఆర్ఆర్పేట): రాష్ట్రంలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై నిరంతరం పోరాడాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించారని వైఎసార్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధికార ప్రతినిధి గెడ్డం సుధీర్ తెలిపారు. మంగళవారం తాడేపల్లిలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన మర్యాద పూర్వకంగా కలుసుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో విద్యారంగం ప్రస్తుతం తిరోగమనంలో ఉందని, ఆఖరికి విద్యార్థులకు యూనిఫారం ఇవ్వడానికి కూడా ప్రభుత్వం చందాలు వసూలు చేసే పరిస్థితికి దిగజారిందని, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయకపోవడంతో అనేక మంది పేద కుటుంబాల విద్యార్థులు చదువుకు దూరమయ్యే ప్రమాదంలో పడ్డారని వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.
జంగారెడ్డిగూడెం: మట్టి అక్రమ రవాణా చేస్తున్న 3 మట్టి ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు ఎస్సై షేక్ జబీర్ తెలిపారు. సోమవారం రాత్రి మట్టి అక్రమ రవాణాపై సమాచారం అందడటంతో పుట్లగట్లగూడెం కొంగల చెరువు వద్దకు వెళ్లేసరికి అనుమతులు లేకుండా మట్టిని తరలిస్తున్న 3 మట్టి ట్రాక్టర్లను గుర్తించి సీజ్ చేసినట్లు చెప్పారు. తదుపరి చర్యల నిమిత్తం రెవెన్యూ శాఖకు సమాచారం ఇచ్చినట్లు ఆయన తెలిపారు.


