దళారులను ఆశ్రయించి మోసపోవద్దు | - | Sakshi
Sakshi News home page

దళారులను ఆశ్రయించి మోసపోవద్దు

May 26 2026 3:02 AM | Updated on May 26 2026 3:02 AM

దళారులను ఆశ్రయించి మోసపోవద్దు యువతి అదృశ్యంపై కేసు నమోదు వడదెబ్బ తగిలి మృతి

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రవాణా శాఖ సేవలను పొండంలో కొంతమంది దళారులను నమ్మి మోసపోతున్నారని, దీనివల్ల వారు అధిక మొత్తంలో సొమ్ము పోగొట్టుకుంటున్నారని ఉప రవాణా కమిషనర్‌ షేక్‌ కరీమ్‌ అన్నారు. సోమవారం స్థానిక ఉప రవాణా కమిషనర్‌ కార్యాలయంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ దళారుల వ్యవస్థను నిర్ములించి, రవాణా శాఖ సేవలను పౌరులకు మరింత చేరువ చేసే ఉద్దేశంతో 2001లో ప్రభుత్వం రవాణా శాఖ సేవలను ఆన్‌లైన్‌ విధానంలోకి తీసుకువచ్చిందన్నారు. ఆన్‌లైన్‌ విధానంపై అవగాహన లేని కొందరు, దళారులను – మధ్యవర్తులను ఆశ్రయిస్తున్నారన్నారు. మొబైల్‌ ఫోన్‌, కంప్యూటర్లను ఉపయోగించుకుని లేదా సీఎస్‌ఎసీ సెంటర్లు, ఈసేవల ద్వారా ప్రభుత్వం నిర్ణయించిన రసీదు రుసుం మాత్రమే చెల్లించి పౌరులు రవాణా సేవలను పొందాలన్నారు. వాహనాల ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్స్‌ కోసం చలానా ఆన్‌లైన్‌లో చెల్లించి, ఆటోమేటిక్‌ టెస్టింగ్‌ స్టేషన్‌ (ఏటీఎస్‌) ద్వారా వాహన ఎఫ్‌సీ వాహనదారు స్వయంగా పొందవచ్చునని, ఏటీఎస్‌ల వద్ద ఆర్టీఏ అధికారుల ప్రమేయం ఏమీ ఉండదని స్పష్టం చేశారు. ఎవరికై నా రవాణా సేవలను పొందటంలో ఇబ్బందులు కలిగితే తమ కార్యాలయంలోని హెల్ప్‌ డెస్క్‌ వద్దకు వచ్చి సమాచారాన్ని పొందొచ్చని కరీమ్‌ తెలిపారు.

జంగారెడ్డిగూడెం: యువతి అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఎన్‌వీ ప్రసాద్‌ తెలిపారు. మండలంలఘొక గ్రామానికి చెందిన 22 ఏళ్ళ యువతి ఈ నెల 20 నుంచి కనిపించడం లేదని తెలిపారు. చుట్టుపక్కల, బంధువులు, స్నేహితుల ఇంటి వద్ద వెతికినా కనిపించకపోవడంతో తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

భీమవరం అర్బన్‌: భీమవరం రూరల్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో సోమవారం వడదెబ్బ తగిలి వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం దిర్సుమర్రు గ్రామంలోని రామాయణపురం గ్రామానికి చెందిన గంధం శివశంకర్‌ రావు (35) వడదెబ్బ తగిలి మృతి చెందాడు. ఆయన కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రూరల్‌ ఎస్‌ఐ వీర్రాజు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు .

Advertisement
 
Advertisement
Advertisement