ఏలూరు (టూటౌన్): కార్మికులు సంవత్సరాల తరబడి ఈపీఎఫ్ఓకి చందాదారులుగా ఉంటూ, లక్షలాది రూపాయలు చందా చెల్లిస్తున్నప్పటికీ కనీస పెన్షన్ పెంపుదల విషయంలో కేంద్రంలోని మోదీ–షా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఐఎఫ్టీయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి యు. వెంకటేశ్వరరావు ఆరోపించారు. సోమవారం స్థానిక బీఎస్ఎన్ఎల్ భవనంలోని ఈపీఎఫ్ఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ.. కనీస పెన్షన్ రూ. 7,500 పెంపుదలకై కార్మిక వర్గం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫారసులు, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సూచనలు, సుప్రీంకోర్టు సలహాల మేరకు కనీస పెన్షన్ రూ.7500కు పెంచాలని, ఆరు నెలలకు ఒకసారి పెన్షన్ పెరిగే విధంగా డీఏ లింక్ చేయాలని, కుటుంబ సభ్యులందరికీ వైద్య సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఐఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు, నగర అధ్యక్షులు బి. సోమయ్య, అనుబంధ ఏపీ ప్రగతిశీల ఈపీఎఫ్ పెన్షనర్ల సంక్షేమ సంఘం నాయకులు కోసూరి నూకరాజు, బుద్ధా నాగేశ్వరరావు, కింతల చిట్టయ్య, కొంపంగి కృష్ణ, బగాది రమణ, బుడుమూరు శ్రీనివాసరావు, కె. దేవేందర్, కె. విజయలక్ష్మి, పి. మంగతాయారు పాల్గొన్నారు.


