పోలవరం రూరల్: పోలవరం మండలంలో మట్టి తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. ఎల్ఎన్డీపేట రిజర్వాయర్ నుంచి ఇష్టానుసారంగా మట్టిని తవ్వేస్తున్నారు. అలాగే పోలవరం గ్రామంలోని కొత్తూరు చెరువు నుంచి కూడా మట్టి తవ్వకాలు ప్రారంభించారు. ఈ మట్టిని తరలించి దళారులు సొమ్ము చేసుకుంటున్నారు. వాస్తవానికి మట్టి తరలింపునకు కొంతమేర అనుమతులు తీసుకున్నప్పటికీ, ఆ అనుమతుల పరిమితికి మించి దళారులు ప్రవేశించి ఇటుక బట్టీలకు మట్టిని తరలించేస్తున్నారు. చెరువు, రిజర్వాయర్లలో కూడా హిటాచీ మిషన్లు, ట్రాక్టర్లు పెట్టి పగలూ రాత్రి తేడా లేకుండా తరలిస్తున్నారు. దీనివల్ల జలాశయంలో భారీగా గోతులు ఏర్పడుతున్నాయి. మట్టి అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నా సంబంధిత అటవీశాఖ అధికారులు అటువైపు కన్నెత్తి చూడని పరిస్థితి ఏర్పడింది. ప్రధాన రహదారుల్లో ట్రాక్టర్లపై మట్టి తరలిస్తున్నా ఆపే నాథుడే లేడు. పొలాలు మెరక చేసుకునేందుకు రైతులకు మట్టి తోలుకునేలా అనుమతులు ఇచ్చారనే పేరుతో, దాన్ని ఇటుక బట్టీలకు తరలించేస్తున్నారు. ఎల్ఎన్డీపేట రిజర్వాయర్ నుంచి నేషనల్ హైవే రోడ్డుకు మట్టి తరలించేందుకు అనుమతులు ఉన్నాయని చెబుతున్నారు గానీ, ఆ పేరుతో ఇతర ప్రాంతాలకు మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. మైనింగ్ అధికారులు, సంబంధిత శాఖాధికారులు ఇటువైపు చూసిన దాఖలాలు లేవు.


