జంగారెడ్డిగూడెం: తాడువాయి సమీపంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ చేయి తెగిపడింది. దీనికి సంబంధించి ఎస్సై ఎన్వీ ప్రసాద్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉంగుటూరు మండలం కాకర్లమూడి గ్రామానికి చెందిన 54 మంది భక్తులు తాడేపల్లిగూడెం డిపో ఆర్టీసీ బస్సు మాట్లాడుకుని తెలంగాణ రాష్ట్రం భద్రాచలం శ్రీరాముని దర్శనానికి శనివారం రాత్రి బయలుదేరారు. మండలంలోని తాడువాయి సమీపంలోకి వచ్చే సరికి జగిత్యాల నుంచి పాలకొల్లు ధాన్యం లోడుతో వెళుతున్న లారీ వీరి బస్సును వెనుక పక్క భాగంలో (సుమారు రెండు సీట్లు వద్ద ) బలంగా ఢీకొంది. దీంతో వెనుక సీట్లో చేయి బయటకు పెట్టుకుని ఉన్న రాజాన పద్మకుమారి చేయి తెగిపడిపోయింది. పక్కనే ఉన్న నాయుడు రామలక్ష్మికి కూడా గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను 108 వాహనంలో స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. వెనుక ఉన్న మిగిలిన ప్రయాణికులు పద్మకుమారి చేయిని వెతికి ఏరియా ఆసుపత్రికి తీసుకువచ్చారు. దీంతో ప్రాథమిక చికిత్స చేసి, మెరుగైన వైద్యం కోసం రాజమండ్రి పంపించారు. ఆర్టీసీ డ్రైవర్ షేక్ అఫ్రాన్ ఫిర్యాదు మేరకు సూర్యపేటకు చెందిన లారీ డ్రైవర్ కంభం ఆంజనేయులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై చెప్పారు.
బస్సును ఢీకొన్న లారీ.. ఇద్దరికి గాయాలు


