ఉండి: యండగండిలో ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇవి. పాలకోడేరు మండలం గొల్లలకోడేరు నుంచి ఒరిస్సా రాష్ట్రానికి చెందిన కామేష్(20) స్థానికుడైన కార్తీక్ ఇద్దరు కలిసి ద్విచక్రవాహనంపై గరగపర్రు రోడ్డు నుంచి యండగండి వైపు వెళుతున్నారు. ఇదే సమయంలో యండగండి వైపు నుంచి వస్తున్న మరో వ్యక్తి ద్విచక్రవాహనం ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కామేష్ రోడ్డుపై పడి అక్కడికక్కడే మృతి చెందాడు. వాహనం నడుపుతున్న కార్తీక్కు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని చికిత్స నిమిత్తం ఏలూరు తరలించారు. మరో ద్విచక్రవాహనంపై వచ్చిన వ్యక్తికి గాయాలుకాగా అతడిని భీమవరంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై ఉండి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఏలూరు టౌన్: ఏలూరు రూరల్ సాయినగర్ శివారు సూర్యనారాయణ కాలనీలో గుర్తు తెలియని వృద్ధుడు మృతిచెంది రోడ్డుపక్కన పడి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. మృతుని వయస్సు సుమారు 50 సంవత్సరాలు ఉంటుందన్నారు. వడదెబ్బకు మృతి చెంది ఉంటాడా.. లేక అనారోగ్యంతో మృతిచెందాడా అనే అంశంపై పోలీసులు విచారణ చేపట్టారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి మృతదేహాన్ని ఏలూరు జీజీహెచ్ మార్చురీకి తరలించారు.


