ఏలూరు (టూటౌన్): 22ఏ భూ సమస్యల పరిష్కారంలో ఏలూరు జిల్లా రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచిందని జిల్లా ఇన్చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. కలెక్టరేట్లోని గోదావరి సమావేశపు హాలులో శుక్రవారం 22ఏ మెగా పరిష్కార మేళా కార్యక్రమంలో పాల్గొని ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 290 దరఖాస్తులకు సంబంధించి 74 ఎకరాలను 22 ఏ జాబితా నుంచి తొలగించి, సంబంధిత రైతులకు తొలగింపు ఉత్తర్వులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత డిసెంబర్లో రాష్ట్రంలోనే మొదటిసారిగా ఏలూరు జిల్లాలో 22ఏ మెగా పరిష్కార మేళా కార్యక్రమాన్ని నిర్వహించి వందలాది ఎకరాలను 22ఏ జాబితా నుంచి తొలగించామన్నారు. ప్రస్తుతం నిర్వహించిన కార్యక్రమంలో 290 దరఖాస్తులకు సంబంధించి 74 ఎకరాలను 22ఏ జాబితా నుంచి తొలగించి, ఉత్తర్వులను అందించామని, మరో 202 అర్జీలను పరిశీలించి 15 రోజులలలోగా పరిష్కారానికి చర్యలు తీసుకోమని అధికారులను ఆదేశించామన్నారు. కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలమేరకు రెండవ దఫా పరిష్కార మేళాను నిర్వహిస్తున్నామని, ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు. ఈ కార్యక్ర మంలో జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ, ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, పత్సమట్ల ధర్మరాజు, చిర్రి బాలరాజు, డీఆర్వో దేవకీదేవి తదితరులు పాల్గొన్నారు.


