ఏలూరు (టూటౌన్): పెట్రోల్ డీజిల్ ధరలు తక్షణమే ఉపసంహరించుకోవాలని సీపీఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఆర్ లింగరాజు డిమాండ్ చేశారు. ఆ పార్టీ ఆధ్వర్యంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంపుదలను నిరసిస్తూ కొత్త బస్టాండ్ వద్ద ఉన్న ఆర్టీసీ పెట్రోల్ బంక్ వద్ద వినూత్న రీతిలో ధర్నా నిర్వహిస్తూ ఆటోను లాగుతూ నిరసన తెలిపారు. నగర కార్యదర్శి పంపన రవికుమార్ అధ్యక్షత వహించారు. జిల్లా కార్యదర్శి ఆర్ లింగరాజు మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలపై నిత్యం భారాలు మోపుతూ కార్పొరేట్లకు ప్రజల సంపదను దోచిపెడుతుందని విమర్శించారు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గినప్పుడు ఈ దేశంలో ఆయిల్ ధరలు తగ్గించని ప్రభుత్వం యుద్ధాన్ని అడ్డుపెట్టుకుని ఆయిల్ కంపెనీల మాఫియాకు తలొగ్గి ప్రజలపై భారాల మోపిందని తీవ్రంగా విమర్శించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల అనంతరం కేంద్ర ప్రభుత్వం కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు నేడు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం ప్రజలను మోసం చేయడమేనన్నారు. కరోనా తర్వాత ప్రజలు కోలుకోలేక ఇబ్బందులు పడుతున్న ప్రజలపై ఈ ధరల పెంపు భాగంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డీఎన్వీడీ ప్రసాద్, కె,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


