గణపవరం: గణపవరం మండలం ఎస్. కొండేపాడు గ్రామంలో రెండు రోజుల క్రితం కలుషిత మైదాపిండితో వేసిన బజ్జీలు తిని తీవ్ర అస్వస్థతకు గురైన బాధితులను శుక్రవారం ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు పుప్పాల వాసుబాబు పరామర్శించారు. భీమవరంలోని వివిధ ప్రైవేటు ఆస్పత్రులలో చికిత్స పొందుతున్న వారి వద్దకు వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాఽధితుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో చర్చించారు. బాధితులంతా పూర్తిగా కోలుకునే వరకూ వైద్యం అందించాలని ఆయన వైద్యులను కోరారు. ఏ అవసరం వచ్చినా తనకు తెలియజేయాలని, అవసరమైన సహాయ సహకారాలు అందిస్తానని బాధితులకు భరోసా ఇచ్చారు. వాసుబాబు వెంట గణపవరం ఎంపీపీ అర్థవరం రాము, మండల వైఎస్సార్ సీపీ కన్వీనర్ దండు రాము, వైఎస్సార్ సీపీ మండల యూత్ అధ్యక్షుడు కొట్టు నరేష్, కొందేపాడు మాజీ సర్పంచ్ తోట సత్యనారాయణ, వైఎస్సార్ సీపీ కొండేపాడు గ్రామ అధ్యక్షుడు గంగుమోలు సూరిబాబు తదితరులు ఉన్నారు.
ఉంగుటూరు : మండలంలోని బాదంపూడిలో ఉండ్రాజవరపు గంగ ఇంట్లో దొంగతనానికి పాల్పడిన కేసులో నిందితుడు తాడేపల్లిగూడేనికి చెందిన బొగత శివకు ఏడాది జైలు, 2వేలు జరిమానా విధిస్తూ తాడేపల్లిగూడెం అడిషనల్ జ్యుడిషియల్ ఫస్టు క్లాస్ మెజిస్ట్రేట్ కె.లలిత తీర్పు శుక్రవారం వెలువరించినట్లు చేబ్రోలు ఎస్సై సూర్య భగవాన్ తెలిపారు. 6–7–2025న ఉండ్రాజవరపు గంగ వరంగల్ వెళ్లగా ఎవరు ఇంట్లో లేకపోవడం చూసి తాళాలు బద్దలు కొట్టి బీరువాలో బంగారపు మంగళ సూత్రాలు 4 గ్రామలు, బంగారు కాయిన్ 2 గ్రాములు, ఒక వెండి గ్లాసును శివ దొంగలించాడు. దీంతో ఎస్సై సూర్యభగవానన్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేసి నిందితుడిని కోర్టులో హజరపరిచారు. నేరం రుజువు కావడంతో నిందితుడికి శిక్ష వేశారు.


