పోలవరం రూరల్ : పాము కాటుకు గురై మహిళా కూలీ మృతిచెందిన సంఘటన పోలవరం మండలం గుంజవరంలో జరిగింది. పోలవరం మండలం పాత పట్టిసీమకు చెందిన జల్లిగంపల శాంత (32) గుంజవరం గ్రామంలో మొక్కజొన్న చేలో కూలి పనికి వెళ్లింది. చేలో పనిచేస్తున్న సమయంలో పాము కాటు వేసింది. స్థానికులు గుర్తించి పోలవరం ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తుండగా, మధ్యలో మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
నూజివీడు: పట్టణంలోని చిన్న గాంధీ బొమ్మ సెంటర్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. చిన్న గాంధీ బొమ్మ సెంటర్లోని పాపులర్ ఫ్యాన్సీ ఎదురుగా నుంచొని ఉన్న ఓ వ్యక్తి శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో సొమ్మసిల్లి పడిపోయి అపస్మార కస్థితికి చేరుకున్నాడు. సమీపంలోని వారు గమనించి నూజివీడు పట్టణ పోలీసులకు సమాచారం ఇవ్వగా సీఐ సత్య శ్రీనివాస్ 108 వాహనంలో క్షతగాత్రుడిని వైద్య చికిత్స నిమిత్తం నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించారు. అతడు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సుమారు 50 సంవత్సరాల వయసున్న అతని కుడి భుజంపై ఓంకారం పచ్చబొట్టు ఉందని, మృతుని వివరాలు తెలిసినవారు నూజివీడు పట్టణ పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలని సీఐ తెలిపారు.
జంగారెడ్డిగూడెం: ఉరివేసుకుని వ్యక్తి మృతిచెందిన ఘటనపై కేసు నమోదుచేసినట్లు ఎస్సై ఎన్వీ ప్రసాద్ తెలిపారు. ఆయన వివరాల ప్రకారం శ్రీకాకుళం జిల్లా, కొంచాడ గ్రామానికి చెందిన జెన్ని విశ్వనాథకుమార్ (37) జంగారెడ్డిగూడెంలో భార్య పిల్లలతో ఉంటూ, తాపీ పని చేసేవాడు. మృతుడి తమ్ముడు మతి స్థిమితం లేక ఎటో వెళ్లిపోయాడన్నారు. దీంతో విశ్వనాథకుమార్ మానసికంగా కుంగిపోయాడు. తరచుగా ఇంట్లో వారిపై కోప్పడటం, ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించేవాడు. మృతుడి అత్తగారు జంగారెడ్డిగూడెం కావడంతో మృతుడి పిల్లలు గౌతమ్, లీలా మనోహర్లు పట్టణంలోని రాముడు కుంట చెరువు ప్రాంతంలో ఉన్న అమ్మమ్మ ఇంటికి వెళ్తుండేవారు. చెరువు ప్రాంతం ప్రమాదమని పిల్లలను హెచ్చరిస్తూ ఉండేవాడు. ఈక్రమంలో 19వ తేదీ విశ్వనాథకుమార్ పనికి వెళ్లి ఇంటికి తిరిగి వచ్చే సరికి పెద్ద కుమారుడు అమ్మమ్మ ఇంటికి వెళ్ళాడని తెలిసి, తన మాట వినడం లేదని కోపంతో ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకుని ఉరివేసుకున్నాడు. గమనించిన భార్య కుమారి చుట్టుపక్కల వారి సహాయంలో కిందకు దించి స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి మృతిచెందినట్లు తెలిపారని, భార్య ఫిర్యాదుతో కేసు నమోదుచేసినట్లు తెలిపారు.
దెందులూరు: బాలికను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసగించడంతో పాటు కులం పేరుతో దూషించిన పరస రంగరాజుపై పోక్సో, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశామని దెందులూరు ఎస్సై ఆర్.శివాజీ తెలిపారు అక్కిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన బాలికను చల్లపల్లికి చెందిన రంగరాజు మాయమాటలు చెప్పి మోసగించాడు. ఆమె గర్భం దాల్చగా పెళ్లి చేసుకోమని అడిగితే కులం పేరుతో దూషించారన్నారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రంగరాజుపై కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు.


