ఉండి: గ్యాస్ కష్టాలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. వినియోగదారులు గ్యాస్ బుక్ చేసుకునేందుకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అర్ధరాత్రి సమయంలో అయితే గ్యాస్ బుక్ అవుతుందనే సమాచారంతో వినియోగదారులు అర్ధరాత్రి వరకు మేల్కొని ఆన్లైన్లో గ్యాస్ బుకింగ్ చేసుకుంటున్నారు. అంతేకాకుండా కంపెనీల నుంచి డీలర్లకు గ్యాస్ సరఫరా తక్కువ కావడంతో బుక్ చేసుకున్న వారిలో ఎవరికి ఎప్పుడు గ్యాస్ వస్తుందో తెలియక అల్లాడిపోతున్నారు. గ్యాస్ డోర్ డెలివరీ చేసేసరికి ఆలస్యం అవుతుందనో లేక తమవరకు రాదనే భయమో వినియోగదారులు గ్యాస్ బండలు, పుస్తకాలు పట్టుకుని తెల్లవారగానే ఉండి పార్క్ ఎరుదుగా ఉన్న గ్యాస్ కంపెనీకి ఉరుకులు తీస్తున్నారు. తమవంతు వచ్చే వరకు ఎదురు చూసి గ్యాస్ పట్టుకెళుతున్నారు. గ్యాస్ స్టాక్ వుంటే సరేసరి లేకుంటే మరో రోజు ఈ ఇబ్బందులు తప్పవంటూ నిట్టూరుస్తున్నారు. మండలంలోని మరో గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ(హెచ్పీ) సరఫరా భీమవరం నుంచి జరుగుతుంది. ఈ ఏజెన్సీ గ్యాస్ ఎప్పుడు మండలానికి వస్తుందే.. ఎప్పుడు సరఫరా చేస్తారో తెలియని పరిస్థితి. ఇప్పటికే ఈ ఏజెన్సీపై పలువురు ఫిర్యాదులు చేస్తున్నారు. అధికారులు మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. గ్యాస్ ఇబ్బంది వల్ల మండలంలో పలు దుకాణాలు, హోటల్స్ మూతపడ్డాయి. ఉదయాన్నే హోటల్స్కి వెళ్ళే అలవాటు ఉండేవారు తీవ్ర ఇబ్బందిపడుతున్నారు. టీ, టిఫిన్స్ అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు తతెత్తుతున్నాయి. రంజాన్, క్రైస్తవులకు 40 రోజుల ఉపవాస ప్రార్థనల కాలం కావడంతో టీ, టిఫిన్స్కి డిమాండ్ ఏర్పడింది. సరఫరా లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.


