
క్షత్రగాత్రుల కుటుంబసభ్యులతో మాట్లాడుతున్న ఆర్డీఓ అచ్యుత్ అంబరీష్
పోడూరు: ఆచంట శివారు వల్లూరు తోట గ్రామంలో సోమవారం రాత్రి ఒక ఇంట్లో గ్యాస్సిలిండర్ పేలిన ఘటనలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల వివరాల ప్రకారం దివి వెంకట్రావు ఇంట్లో వంట చేస్తుండగా గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో ఇంట్లో ఉన్న దివి వెంకట్రావు(75), అతని భార్య ఆదిలక్ష్మి(60), కోడలు సావిత్రి(40) తీవ్రంగా గాయపడ్డారు. వీరిని కాపాడే ప్రయత్నంలో చుట్టుపక్కల ఉన్న బంధువులు దివి రత్నంరాజు, దివి ప్రసాదు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద ఘటనతో గ్రామస్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. స్థానికుల సమాచారంతో క్షత్రగాత్రులను 108 వాహనంలో పాలకొల్లు తరలించారు. వెంకట్రావు, ఆదిలక్ష్మి పాలకొల్లు ప్రభుత్వాసుపత్రిలో, సావిత్రి, రత్నంరాజు, ప్రసాద్ పాలకొల్లులోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న వెంకట్రావు, ఆదిలక్ష్మిల పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.