నూజివీడుకు వరం
నూజివీడు: నాడు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు సంకల్పం త్వరలోనే సాకారం కానుంది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన కేంద్రీయ విద్యాలయాన్ని నూజివీడులో ఏర్పాటు చేయడానికి అలుపెరగని కృషి చేసిన ప్రతాప్ అప్పారావు కృషి నేడు నూజివీడే కాకుండా జిల్లాలోని విద్యార్థుల భవిష్యత్కు సోపానంగా మారనుంది. ఏడాది కాలంగా ప్రారంభానికి ఎదురుచూస్తున్న కేంద్రీయ విద్యాలయంలో ఎట్టకేలకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు కోసం పట్టువదలని విక్రమార్కుడిలా ప్రతాప్ అప్పారావు నాలుగు సార్లు ఢిల్లీ చుట్టూ, 40 సార్లు సికింద్రాబాద్లోని కేంద్రీయ విద్యాలయ రీజనల్ కార్యాలయం చుట్టూ తిరిగి నూజివీడుకు కేంద్రీయ విద్యాలయాన్ని మంజూరు చేయించడంలో సఫలీకృతులయ్యారు. మంజూరు చేయించడమే కాకుండా నాటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి శాశ్వత భవనాలను నిర్మించేందుకు అవసరమైన ఏడెకరాల స్థలాన్ని సైతం కేటాయింప చేశారు. 2025 విద్యా సంవత్సరంలోనే అడ్మిషన్లను ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ అనివార్య కారణాల వల్ల ప్రారంభించలేకపోయారు. అడ్మిషన్ల ప్రక్రియలో భాగంగా ఏప్రిల్ 2 తేదీ వరకు ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.
భవనాల నిర్మాణ పనులు ప్రారంభం
ఎంప్లాయిస్ కాలనీలోని తాత్కాలిక భవనంలో తరగతులు ప్రారంభమైన తరువాత నుంచి కేంద్రీయ విద్యాలయానికే కేటాయించిన ఏడెకరాల స్థలంలో భవనాల నిర్మాణాన్ని చేపట్టనున్నారు. దాదాపు రూ.30 కోట్లతో చేపట్టనున్న ఈ నిర్మాణాల్లో భాగంగా స్కూల్ భవనం, మౌలిక వసతుల కల్పన, చుట్టూ ప్రహరీ నిర్మాణం, ఆటస్థలం అభివృద్ధి తదితర వాటిని నిర్మించనున్నారు.
నూజివీడు కేంద్రీయ విద్యాలయంలో ఏప్రిల్ నుంచి తరగతులు
1 నుంచి 5వ తరగతి వరకు అడ్మిషన్లు
వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏడెకరాల స్థలం కేటాయింపు
అలుపెరగని కృషి చేసిన మాజీ ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు
కేంద్రీయ విద్యాలయాన్ని నూజివీడుకు తీసుకురావాలని పట్టుదలతో పనిచేశాను. ఇది నూజివీడు సిగలో మరో మణిహారం కానుంది. ఏప్రిల్ నుంచి తరగతులు ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు. ఈ విద్యాలయం వల్ల ఈ ప్రాంత విద్యార్థుల భవిష్యత్తు బాగుంటుంది. నేను అడిగిన వెంటనే నాటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఏడెకరాల స్థలాన్ని కేటాయిస్తూ జీవో ఇచ్చింది. నాయకులు చేసే మంచి పనులే తరాలు మారినా ఎల్లకాలం ఉంటాయి. ఏ ప్రభుత్వం ఉన్నా.. ఈ ప్రాంత విద్యార్థులకు మంచి జరగాలన్నదే వైఎస్సార్సీపీ ఉద్దేశం.
మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, మాజీ ఎమ్మెల్యే, నూజివీడు
పట్టణంలోని ఎంప్లాయిస్ కాలనీలో ఉన్న మండల పరిషత్ యూపీ స్కూల్ విద్యార్థులు లేక పన్నెండేళ్ల క్రితమే మూతబడింది. ఈ నేపథ్యంలో దీనిలో కేంద్రీయ విద్యాలయాన్ని తాత్కాలికంగా నడిపేందుకు 2023లోనే ప్రభుత్వ నిధులు దాదాపు రూ.80 లక్షలతో అదనపు గదులను నిర్మించారు. దీంతో 16 తరగతి గదులను, వేర్వేరుగా బాత్రూమ్లను, మరుగుదొడ్లను నిర్మించి సిద్ధం చేశారు. 2024 ఎన్నికల ముందే అన్ని ఏర్పాట్లు పూర్తిచేసి భవనాన్ని సిద్ధం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత కేంద్రీయ విద్యాలయం నిర్వహణకు అందుబాటులోకి తెచ్చిన తాత్కాలిక భవనంలో హౌసింగ్, ఇరిగేషన్ కార్యాలయాలను ఏర్పాటు చేశారు. దీనిని అప్పట్లో ప్రతాప్ అప్పారావు, వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. అప్పటి మున్సిపల్ కమిషనర్ ఆర్ వెంకట్రామిరెడ్డితో ప్రతాప్ అప్పారావు మాట్లాడి ఏర్పాటు చేసిన కార్యాలయాలను వెంటనే అక్కడి నుంచి వేరే చోటకు మార్పించారు. దీనివల్ల జాప్యం జరగడంతో అడ్మిషన్ల ప్రక్రియ ఆలస్యమైంది.


