కాళ్ల: సంపద సృష్టిస్తానని చెప్పి రాష్ట్ర ప్రజలను మోసం చేసి మీ కుటుంబాలకు సంపద సృష్టించుకుంటున్నారని రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పాత పాటి శ్రీనివాసరాజు ఆరోపించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రబాబు ఎన్నికల ముందు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని, ప్రజలను ఆదుకుంటానని కల్లబొల్లి మాటలు చెప్పి రాష్ట్ర ప్రజలను నమ్మించి మోసం చేశారని ఎద్దేవా చేసారు. వైఎస్సార్సీపీ హయాంలో రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి 33 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చారని గుర్తు చేశారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లు కావస్తున్న ఇల్లు నిర్మాణానికై నా నిధులు ఇచ్చారా అని ప్రశ్నించారు. పార్టీ నాయకులకు ఎంపీలకు, అనుకూలమైన వారికి సంపద సృష్టించడం తప్ప రాష్ట్ర ప్రజల అభివృద్ధికి సంపద సృష్టించిన దాఖలాలు ఎక్కడా లేవని విమర్శించారు. వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగినట్టు నానా యాగీ చేశారు తప్ప నిజం లేదని అన్నారు. లడ్డు విషయంలో గానీ, మద్యం విషయంలో గాని లేనిపోని ఆరోపణలు చేశారు తప్ప నిజం నిరూపించలేకపోయారని అన్నారు. జగన్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రజలు ఎంతో ఆనందంగా ఉండేవారని గుర్తు చేశారు. ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలు అందించిన ఆసుపత్రులకు బకాయిలు చెల్లించకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వం విద్యను భ్రష్టు పట్టించడం వల్ల విద్యార్థులంతా ప్రైవేట్ స్కూల్లకు వెళుతున్నారని అన్నారు. మద్యం విచ్చలవిడిగా విక్రయిస్తున్నారని ప్రతి గ్రామంలోనూ బెల్ట్ షాపులు పెట్టి ప్రజల ఆరోగ్యాలతో కూటమి ప్రభుత్వం ఆడుకుంటుందన్నారు. అమరావతి అభివద్ధి పేరుతో అవినీతికి పాల్పడుతూ వారికి అనుకూలమైన వారికి పనులు అప్పగించి దోచుకుంటున్నారని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో తప్పనిసరిగా ప్రజలు జగన్మోహన్ రెడ్డికే పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు.


