
దేశంలో జనగణన నిర్వహించబోతున్నట్టు ఆరేళ్ల సుదీర్ఘ జాప్యం అనంతరం బుధవారం అధికారిక ప్రకటన వెలువడింది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ఈనెల 16న విడుదల చేస్తామని, 2027 మార్చి 1తో ఈ మొత్తం ప్రక్రియ పూర్తవుతుందని అందులో తెలియజేశారు. అంటే ఆ ఏడాది ఫిబ్రవరి 28తో జనగణనను ముగిస్తారన్నమాట. మంచు కురిసే లద్దాఖ్, జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో వచ్చే ఏడాది అక్టోబర్ 1కల్లా జనగణన ప్రక్రియ ముగుస్తుంది. అంటే సెప్టెంబర్ నెలాఖరుకు జనగణన పూర్తవుతుంది.
ఈ నెల 16న నోటిఫికేషన్ విడుదల కాబోతోంది. ఆ తర్వాతగానీ మెథడాలజీ తదితర వివరాలపై స్పష్టత రాదు. ప్రక్రియ ముగించదల్చుకున్న తేదీని గమనిస్తే వచ్చే లోక్సభ ఎన్నికల నాటికి తుది గణాంకాలు వెల్లడికావొచ్చని తెలుస్తోంది. కనుక ప్రస్తుత లోక్సభ గడువు ముగిసేలోగా నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ఉండకపోవచ్చు. స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారి జనగణనతోపాటు కులగణన కూడా వుండబోతోంది. రాజకీ యంగా, సామాజికంగా సంచలనం కలిగించగల కులగణన స్వరూప స్వభావాలేమిటో తెలియా లన్నా నోటిఫికేషన్ వచ్చేవరకూ ఆగాల్సిందే.
జనగణన రెండు దశల్లో వుంటుంది. మంచుకురిసే ప్రాంతాలు మినహా దేశంలో మిగిలినచోట్ల వచ్చే ఏడాది మార్చి–ఏప్రిల్ నెలల్లో తొలి దశఉంటుంది. అందులో నివాస గృహాలు, వాటి యాజమాన్య వివరాలు, నివాసం వుండేవారి సంఖ్య, వారికి ఎలాంటి సౌకర్యాలున్నాయో, ఏయే వాహనాలున్నాయో లెక్కేస్తారు. రెండో దశలో ఇంటి యజమాని పేరు, ఆయన భార్యాపిల్లలు, విద్యార్హతలు, ఉద్యోగ వ్యాపార వివరాలు, ఆదాయ వనరులు, కులమతాలు వగైరాలు తెలుసుకుంటారు.
ప్రభుత్వాలకు డేటా ప్రాణప్రదమైనది. ఏ విధానం రూపొందించాలన్నా, ఏ పథకం ప్రవేశ పెట్టాలన్నా, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా వాటి లబ్ధిదారులెందరు, ప్రభుత్వ నిర్ణయాల ప్రభావం ఎందరిపై పడుతుంది వగైరా అంశాలన్నీ అవసరమవుతాయి. దేశంలో పట్టణీకరణ విస్తృతి, స్త్రీ పురుష నిష్పత్తి, కుటుంబాల ఆర్థిక స్థితిగతులు, వలసలు, నివాసగృహాల తీరుతెన్నులు వగైరాలన్నీ జనగణనలోనే వెల్లడవుతాయి. మహిళలకు అవసరమైన పథకాలకూ, దారిద్య్ర నిర్మూలన పథకాల రూపకల్పనకూ, గృహనిర్మాణం, ఉపాధి హామీ పథకం వంటివి ఎక్కడెక్కడ అవసరమో తేల్చడానికి జనగణనే ఆధారం.
ఒక్కమాటలో చెప్పాలంటే దేశ సంపూర్ణ ముఖచిత్రం ఈ జనగణన ద్వారా ఆవిష్కృతమవుతుంది. ఆఖరుగా 2011లో జనగణన జరిగింది గనుక 2021లో వాస్తవంగా తదుపరి జనగణన వుండాలి. అది మొదలుకాబోతోందని 2019 డిసెంబర్లో కేంద్రం ప్రకటించింది కూడా. ఆ ప్రక్రియ తొలి దశ 2020లో మొదలయ్యేలోగానే కరోనా మహ మ్మారి విరుచుకుపడటంతో జనగణన కాస్తా మూలనబడింది. ఆ తర్వాతైనా దాన్ని ప్రారంభించా లన్న ఆసక్తి కేంద్రంలో ఎందుకనో కనబడలేదు. కారణాలేమిటో కూడా చెప్పలేదు.
కరోనా ప్రభావం తగ్గాక ప్రపంచంలో అమెరికా, చైనా, జపాన్, జర్మనీ, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక వంటి 143 దేశాలు యుద్ధప్రాతిపదికన జనగణన పూర్తిచేశాయి. మనతోసహా 44 దేశాలు మాత్రమే దానికి దూరంగా వున్నాయి. కేంద్ర హోంశాఖ ప్రతినిధి చెప్పినట్టు అప్పుడు జనగణన పూర్తయిన దేశాల్లో లభ్యమైన డేటా నాణ్యమైనది, సమగ్రమైనదీ కాదని తేలివుండొచ్చు. కానీ విధాన నిర్ణయాల రూప కల్పనలో అక్కడి ప్రభుత్వాలకు ఎంతో కొంత పనికొచ్చింది. అసలు లేనిదానికన్నా ఇది మేలే. మన వరకూ చూస్తే జనగణన ఆలస్యం వల్ల విద్య, ఆరోగ్యం, ఆర్థిక స్థితిగతులు వంటి 15 అతి కీలకమైన సర్వేలు నిలిచిపోయాయి. ఫలితంగా పథకాల అమలు చీకట్లో తడుములాటగా మిగిలింది.
దేశంలో చాలామంది, ముఖ్యంగా రాజకీయంగా చురుగ్గా ఉండదల్చుకున్నవారు ఎదురు చూసేది నియోజకవర్గాల పునర్విభజన గురించే. 1971 జనాభా లెక్కల ఆధారంగా 1973లో లోక్ సభ స్థానాల సంఖ్యను 543గా నిర్ధారించారు. ఆ తర్వాత పునర్విభజన జోలికెళ్తే సమస్య లెదురవు తాయన్న భయంతో రెండు రాజ్యాంగ సవరణల ద్వారా దాన్నే కొనసాగిస్తున్నారు. ఈశాన్య రాష్ట్రా ల్లోనూ, తూర్పునున్న హిందీయేతర రాష్ట్రాల్లోనూ, దక్షిణాది రాష్ట్రాల్లోనూ కేంద్ర ప్రభుత్వ కుటుంబ నియంత్రణ సమర్థంగా అమలుకావటంతో జనాభా రేటు నియంత్రణలో వుంది.
కానీ హిందీ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఆ విషయంలో చొరవచూపలేదు. దాంతో అక్కడ జనాభా పెరిగింది. జనాభా లెక్కల ఆధారంగా పునర్విభజన ప్రక్రియవుంటుంది కనుక తమ ప్రాంతాల్లో లోక్సభ స్థానాలు గణనీయంగా తగ్గుతాయని హిందీయేతర రాష్ట్రాలు వాదిస్తున్నాయి. 2011నాటి జనగణన తుది ఫలితాలు 2013లో వెల్లడయ్యాయి. ఇప్పుడు కూడా అదే సమయంపడితే 2029లోగానీ పూర్తి ఫలితాలు రావు. ఆ తర్వాతే పునర్విభజన ప్రక్రియ ఉంటుందని భావించాలి.
జాప్యం మాటెలావున్నా జనగణన ప్రారంభం కాబోతోందన్న ప్రకటన హర్షించదగ్గది. సాధా రణ ప్రజానీకానికి జనగణనపై పెద్దగా ఆసక్తివుండదు. కానీ విధాన నిర్ణేతలూ, విశ్లేషకులూ దీన్ని ప్రాణప్రదంగా భావిస్తారు. ఎందుకంటే అన్ని రకాల సర్వేలకూ ఇదే ప్రాతిపదిక. నేతలూ, పార్టీలూ సరేసరి. ఎవరినుద్దేశించి ఎలాంటి పథకాలు రూపొందించాలో, ఏ సమస్యల్ని ప్రధానంగా ప్రస్తావించాలో నిర్ణయించుకోవటానికి జనగణన తోడ్పడుతుంది. ఈ ప్రక్రియకు అధునాతన సాంకేతికతను సద్వినియోగం చేసుకోవటం, పారదర్శకతకు చోటీయటం అవసరం. ఇక 1931 తర్వాత తొలిసారి కులగణన జరుగుతున్నందువల్ల వివాదాలు తలెత్తకుండా జాగరూకతతో వ్యవహరించాలి.