దేవరపల్లి: పొగాకు రైతుల కష్టాలను తెలుసుకుని వారికి భరోసాగా నిలిచేందుకు వచ్చే నెల 5వ తేదీన వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దేవరపల్లి పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శిస్తున్న విషయం తెలిసిందే. ఆయన పర్యటనకు సంబంధించి చేయాల్సిన ఏర్పాట్లను ఆ పార్టీ నేతలు సోమవారం పరిశీలించారు. జగన్ ప్రోగ్రాం కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్, వైఎస్సార్ సీపీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రీజినల్ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, పార్టీ తూర్పు గోదావరి, ఏలూరు జిల్లాల అధ్యక్షులు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, దూలం నాగేశ్వరరావు, మాజీ హోం మంత్రి, గోపాలపురం నియోజకవర్గ సమన్వయకర్త తానేటి వనిత, కొవ్వూరు నియోజకవర్గ సమన్వయకర్త, రాజమహేంద్రవరం మాజీ ఎంపీ, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్, మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, పోలవరం నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, మచిలీపట్నం పార్లమెంటరీ పరిశీలకులు జెట్టి గురునాధరావు, ఎంపీపీ కేవీకే దుర్గారావు, మూడు జిల్లాలకు చెందిన పలువురు సమన్వయకర్తలునీ కార్యక్రమంలో పాల్గొన్నారు. తొలుత దేవరపల్లి శివారున శివ ఫంక్షన్ హాలు సమీపంలోని ఖాళీ స్థలంలో హెలిప్యాడ్ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం, పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి వచ్చే నెల 5వ తేదీ ఉదయం 9 గంటలకు హెలికాప్టర్లో హెలిపాడ్కు చేరుకుంటారని చెల్లుబోయిన వేణు తెలిపారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పొగాకు వేలం కేంద్రానికి చేరుకుని, వేలం ప్రక్రియను పరిశీలించి, రైతుల ఇబ్బందులు తెలుసుకుంటారని వివరించారు. ఏలూరు, పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల్లోని రైతులు, పార్టీ నాయకులు ఉదయం 9 గంటలకే పొగాకు వేలం కేంద్రానికి చేరుకుని, అధినేత జగన్మోహన్రెడ్డికి ఘన స్వాగతం పలకాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ దేవరపల్లి, గోపాలపురం, నల్లజర్ల మండలాల అధ్యక్షులు కూచిపూడి సతీష్, వెలగా శ్రీరామ్మూర్తి, వెల్లంకి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.


