విద్యుత్ వెలుగుల్లో గోదావరి మేరీమాత పుణ్యక్షేత్రం
తాళ్లపూడి: వేగేశ్వరపురంలోని గోదావరి మేరీమాత పుణ్యక్షేత్ర మహోత్సవాలు ఈ నెల 28, 29, 30 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ మేరకు పుణ్యక్షేత్ర డైరెక్టర్, ఫాదర్ టి.జాన్ ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయ ప్రాంగణాన్ని రంగులు, విద్యుద్దీపాలతో ముస్తాబు చేస్తున్నారు. ఉత్సవాల్లో ప్రతి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు పరిశుద్ధ జపమాల, దివ్యబలి పూజలు నిర్వహిస్తారు. మంగళవారం అఖండ జ్యోతిప్రజ్వలన చేసి ఉత్సవాలు ప్రారంభిస్తారు. దివ్య బలిపూజ, మేరీమాత ఊరేగింపు, 29న దివ్య బలిపూజ, స్తుతి ఆరాధన, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. 30న సమిష్టి దివ్య బలిపూజలో ఏలూరు ిపీఠాధిపతులు బిషప్ పొలిమెర జయరావు పాల్గొంటారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా భోజన వసతి ఏర్పాట్లు చేస్తున్నట్లు డైరెక్టర్ టి.జాన్ తెలిపారు.


