దేవరపల్లి: ఓ భక్తుడు నాణేలతో నాలుగు అడుగుల వేంకటేశ్వరస్వామి విగ్రహాన్ని తయారు చేసి అబ్బురపరిచాడు. గోపాలపురం మండలం రాజంపాలేనికి చెందిన యర్రంశెట్టి రామకృష్ణకు వేంకటేశ్వరస్వామి అంటే ఎంతో ఇష్టం. చిల్లర నాణేలతో స్వామివారి విగ్రహాన్ని తయారు చేయాలని సంకల్పించాడు. దీనికి కుటుంబ సభ్యుల ప్రోత్సాహం తోడైంది. బంధుమిత్రులు, భక్తుల నుంచి రూపాయి, ఐదు రూపాయల నాణేల సేకరించాడు. సుమారు రూ. 1.08 లక్షల నాణేలతో ఫిబ్రవరి 19న తన ఇంటి వద్ద వేంకటేశ్వరస్వామి విగ్రహం తయారీని ప్రారంభించాడు. సుమారు 65 రోజులు కష్టపడి స్వామివారి విగ్రహం తయారు చేసినట్టు రామకృష్ణ తెలిపారు. తిరునామం, శంఖు చక్రాలు వెండితో తయారు చేయించారు. పూజల అనంతరం ఈ నెల 29, 30 తేదీల్లో స్వామివారి విగ్రహాన్ని గ్రామంలో ఊరేగించి, 30న ద్వారకా తిరుమలలోని వేంకటేశ్వర స్వామివారి దేవస్థానానికి అప్పగించనున్నట్టు ఆయన చెప్పారు. అక్కడ విగ్రహాన్ని భక్తుల సందర్శనార్థం ప్రతిష్ఠిస్తారని ఆయన వివరించారు.


