పెద్దాపురం (సామర్లకోట): చేనేత సమస్యలు పరిష్కరించాలనే డిమాండుతో ఈ నెల 13వ తేదీ నుంచి కాకినాడ కలెక్టరేట్ వద్ద రిలే నిరాహార దీక్షలు చేస్తున్నట్లు ఆప్కో మాజీ డైరెక్టర్ ముప్పన వీర్రాజు తెలిపారు. పెద్దాపురం చేనేత సంఘం కార్యాలయంలో మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర స్థాయిలో చేనేత సహకార సంఘాలకు రూ.203 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని, నిలుపు చేసిన త్రిఫ్టు ఫండ్, స్కీం 30 శాతం రిబేటు, నూలు సబ్సిడీ, మార్కెటింగ్ ఇన్సెంటివ్, 2018 రుణమాఫీ పథకాలను పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని, సంఘాలకు ముడి సరకులు ఇచ్చి, పని కల్పించాలని, సహకార సంఘాల వద్ద ఉన్న నిల్వలను ఆప్కో పూర్తిగా కొనుగోలు చేయాలని కోరారు. తమ డిమాండ్ల సాధన కోసమే ఈ నెల 13 నుంచి కలెక్టరేట్ వద్ద రిలే దీక్షలు చేపడుతున్నామని, వీటిని విజయవంతం చేయాలని వీర్రాజు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అల్లక రాజు, తూతిక సత్యనారాయణ, కట్టా రాజబాబు, వానపల్లి పురుషోత్తం, చింతా వీరభద్రరావు, బీరక వీరభద్రస్వామి పాల్గొన్నారు.


