● అధికారులను పరుగులు పెట్టిస్తున్న పులి
● చిక్కకుండా సంచారం
దేవీపట్నం: రెండు నెలలుగా అటవీ అధికారులను ముప్పుతిప్పలు పెడుతున్న పులి గమ్యం ఎటువైపో అంతుచిక్కడం లేదు. నాలుగు రోజుల నుంచి గోదావరి పరివాహక ప్రాంతంలో తిష్ట వేసి, కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో సంచరిస్తూ వెనుకకు, ముందుకు పయనిస్తుందే తప్ప స్పష్టమైన మార్గం వైపు వెళ్లడం లేదు. శనివారం సాయంత్రం జోడుమామిళ్ల వద్ద గోకవరం దండంగి ఆర్అండ్బీ రహదారిని దాటి, పరగసానిపాడు, పూడిపల్లి వద్ద కొండపైకి చేరింది. సోమవారం ఉదయం బోడిగూడెం, డి.రావిలంక గ్రామాల వరకూ సంచరించి, రాత్రికి పరగసానిపాడుకు చేరింది. మంగళవారం నాగళ్లపల్లి ప్రాంతంలో సంచరిస్తున్నట్లు సమాచారం. ఇదే విధంగా సంచరిస్తే నాగళ్లపల్లి, గొందూరు గ్రామాల వద్ద తూర్పు వైపుగా కొండ దాటితే దేవారం పంచాయతీలోని చిన్నారిగండి మరలే అవకాశం ఉంది. ఒకవేళ గోదావరిని దాటేందుకు ప్రయత్నిస్తే పోలవరం ప్రాజెక్టు స్పిల్వే దిగువన గల అంగుళూరు, పురుషొత్తపట్నం వైపునకు వెళ్లి, గోదావరిని దాటవచ్చు. ఒకవేళ అదే జరిగితే పులి పయనం ప్రారంభమైన మహారాష్ట్రలోని తడోబా అభయారణ్యంలోకి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రలను దాటుకుని వచ్చిన దారిలోనే వెళ్లే అవకాశం ఉంది. కాగా.. పులి సంచారంపై రంపచోడవరం సబ్ డీఎఫ్ఓ అనూష, వైల్డ్లైఫ్ రేంజి అధికారి కొండలరావు, సిబ్బంది రేయింబవళ్లు పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు సమీప గ్రామాల్లోని ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ప్రస్తుతం పులి సంచరించే ప్రాంతాల్లోని తమ పశువులు దాని బారిన పడతాయోమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.


