కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ప్రతి కేసులో టెక్నికల్ ఎవిడెన్స్ సేకరించి, అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఉపయోగించి దర్యాప్తు చేయాలని, తద్వారా నేర నిర్ధారణ రేటు పెంచవచ్చని ఎస్పీ డి.నరసింహకిశోర్ సూచించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం అధికారులతో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. పెండింగ్ లో ఉన్న గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసులు, ప్రాపర్టీ కేసులు, ఎన్ఫోర్స్మెంట్ వర్క్, డీపీఓకు సంబంధించి పెండింగ్ రిప్లై ఫైల్స్, ఎన్బీడబ్ల్యూఎస్, ఎన్డీపీఎస్ కేసులలో దర్యాప్తు, రికవరీలపై సర్కిల్ వారీగా పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పీజీఆర్ఎస్ ఫిర్యాదులపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని, జిల్లాలో మహిళల భద్రతకు గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. ఓపెన్ డ్రింకింగ్పై ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలతో పాటు, డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించాలన్నారు. రౌడీషీటర్ల కదలికలు, కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఉంచాలన్నారు. తీవ్రమైన కేసులలో నిర్ణీత గడువు లోపల విచారణ పూర్తి చేసి, చార్జిషీట్ దాఖలు చేయాలన్నారు. ప్రాపర్టీ క్రైమ్ కేసుల్లో రికవరీ పెంచాలని, జిల్లావ్యాప్తంగా గుర్తించిన బ్లాక్ స్పాట్లలో డ్రోన్ సర్వైలెనన్స్ విరివిగా ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్యమైన అన్ని ప్రాంతాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అనుమానిత ప్రాంతాలలో కార్డన్ ఆపరేషన్స్ నిర్వహించాలన్నారు. పోలీసు అధికారులు అందరూ విలేజ్ విజిట్స్, పల్లె నిద్ర తప్పక చేయాలన్నారు. తద్వారా రాబోయే పుష్కరాల్లో ఎదురయ్యే వివిధ సమస్యలను అరికట్టవచ్చన్నారు. రాత్రి పూట అన్ని స్టేషన్లలో గస్తీలు ముమ్మరం చెయ్యాలని, అనుమానితుల వేలిముద్రలు ఎంఎస్డీ డివైస్ ద్వారా చెక్ చేయాలన్నారు. గత నెలలో విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులు, సిబ్బందికి ఎస్పీ ప్రశంసా పత్రాలు అందజేశారు. అడిషనల్ ఎస్పీ ఎల్.చెంచిరెడ్డి, ఎస్బీ డీఎస్పీ బి.రామకృష్ణ, జోనల్ డీఎస్పీలు, ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, ఇతర పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
నేర సమీక్షా సమావేశంలో
ఎస్పీ నరసింహకిశోర్ సూచన


