సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): ధాన్యం కొనుగోళ్లు సమన్వయంతో చేపట్టాలని కలెక్టర్ కీర్తి స్పష్టం చేశారు. మంగళవారం కలెక్టరేట్లో రబీ 2025–26 సీజన్కు సంబంధించి డిస్ట్రిక్ట్ ప్రొక్యూర్మెంట్ కమిటీ సమావేశం కలెక్టర్ కీర్తి ఆధ్వర్యంలో నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ గతంలో అవకతవకలకు పాల్పడిన, రైతులను ఇబ్బందులకు గురి చేసిన వ్యక్తులు, మిల్లర్లను ప్రస్తుత సేకరణ ప్రక్రియకు దూరంగా ఉంచాలని ఆదేశించారు. గన్నీ బ్యాగుల నాణ్యతపై దృష్టి సారించాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో కోతలు జరిపిన ధాన్యాన్ని తక్షణమే సేకరించి రవాణా చేయడానికి వాహనాలను సిద్ధంగా ఉంచాలని, అవసరమైతే ఒకే రోజు 30 వేల మెట్రిక్ టన్నుల వరి తరలించేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని తెలిపారు. గత ఖరీఫ్ సీజన్లో 2,557 వాహనాలు రిజిస్టర్ కాగా, 2,190 వాహనాలు వినియోగంలోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. రైతుల వద్ద సుమారు 1,100 ట్రాక్టర్లు అందుబాటులో ఉన్నాయని, మిగిలిన వాహనాలను ప్రైవేట్ ఆపరేటర్ల నుంచి సమీకరించనున్నట్లు పేర్కొన్నారు. ధాన్యం సేకరణ, రవాణా ప్రక్రియల పర్యవేక్షణకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి 8309487151 నంబర్ను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. జాయింట్ కలెక్టర్ మేఘస్వరూప్ మాట్లాడుతూ జిల్లాలో 256 ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని, డి.ఆర్.డి.ఏ ద్వారా కొనుగోలు కేంద్రాలను కూడా ప్రారంభించే చర్యలు చేపట్టినట్లు తెలిపారు. జిల్లా రెవెన్యూ అధికారి టి.సీతారామమూర్తి, జిల్లా మేనేజర్ (సి.ఎస్) బి.గణేష్ కుమార్, ఆర్డీవోలు కె.ఆనందరావు, ఆర్.శివరాముడు, జిల్లా పౌర సరఫరాల అధికారి వి.పార్వతి, జిల్లా వ్యవసాయ అధికారి రాబర్ట్ పాల్, జిల్లా రవాణా అధికారి ఆర్ సురేష్, మిల్లర్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
కలెక్టర్ కీర్తి ఆదేశం


