పి.గన్నవరం: స్థానిక వైనతేయ నదీ తీరాన కొలువైన పట్టాభి రామస్వామి ఆలయంలో ఈ నెల 27న జరుగనున్న సీతారాముల కల్యాణోత్సవాలకు ఆలయ ధర్మకర్తలు పేరిచర్ల భీమరాజు, సత్యవాణి దంపతులు కోవా స్వీట్లతో తయారు చేయిస్తున్న కంత (సారె) భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ మహోత్సవంలో రాముల వారి తరఫున సీతమ్మవారికి ఈ కంతను సమర్పిస్తారు. వివిధ రకాల ఫలాలు, పుష్పాలు, కూరగాయలు, చీరలు, పూల సజ్జ వంటి ఆకృతుల్లో కోవాతో తయారు చేస్తున్న స్వీట్లు కనువిందు చేస్తున్నాయి. గత 17 ఏళ్లుగా ఈ ఆనవాతీని వారు కొనసాగిస్తున్నారు.
ఈ కల్యాణానికి 20 రోజుల ముందుగా 100 రకాలకు పైగా కోవా స్వీట్లు, మరో 100 రకాల పిండి వంటలు తయారు చేయిస్తారు. స్వీట్లు, పిండి వంటల తయారీలో స్థానిక శ్రీరామ్ గార్డెన్స్కు చెందిన మహిళలు సహకరిస్తున్నారు. ఈ సారెకు 30 రకాల పండ్లను చేర్చి సీతమ్మకు కంతను సమర్పిస్తారు. సీతా రాముల కల్యాణాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలిరానున్నారు.


