స్వామివారిని దర్శించుకున్న నగరి మాజీ ఎమ్మెల్యే రోజా
అల్లవరం: మండలం దేవగుప్తంలోని ఉమాపార్వతి సమేత మల్లేశ్వరస్వామి ఆలయంలో ఐదు రోజులుగా జరిగిన నక్షత్ర నవగ్రహ శివ పంచాయతన, సుబ్రహ్మణేశ్వర యాగం బుధవారంతో ముగిసింది. వేద పండితులు పోచినపెద్ది శ్యామ్శర్మ ఆధ్వర్యంలో బుధవారం మహా పూర్ణాహూతి అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి ఆర్కే రోజా, మాజీ ఎంపీ చింతా అనురాధతో కలిసి పట్టువస్త్రాన్ని సమర్పించారు. అనంతరం యాగశాలలో కొలువైన దేవతామూర్తులను దర్శించుకుని స్వామి వారిని దర్శించుకున్నారు. రామచంద్రాపురం నియోజకవర్గ వైఎస్సార్ సీపీ కో ఆర్డినేటర్ పిల్లి సూర్యప్రకాష్ యాగశాలను సందర్శించి మల్లేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాసరావు, దొమ్మేటి రాము, సర్పంచ్ సాధనాల వెంకటరావు, తిక్కా ప్రసాద్, చిట్టూరి వెంకటనారాయణ, తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వద్ద భారీ అన్నసమారాధన నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు.
లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో..
సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో బుధవారం మాజీ మంత్రి రోజా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆమెకు ఆలయ మర్యాదలతో అర్చకులు స్వాగతం పలికారు. పూజల అనంతరం అర్చకులు ఆమెకు ఆశీర్వచనం చేసి లడ్డూ ప్రసాదం అందజేశారు.
అయినవిల్లిలో..
అయినవిల్లి: స్థానిక విఘ్నేశ్వరస్వామివారిని మాజీ ఎమ్మెల్యే, నగరి వైఎస్సార్ సీపీ ఇన్చార్జి రోజా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రధానార్చకులు మాచరి వినాయకరావు, ఆలయ సిబ్బంది ఆమెకు స్వాగతం పలికారు. అనంతరం ఆమెకు వేదాశీర్వచనం చేసి చిత్రపటం, ప్రసాదం అందజేశారు.


