● ట్రాకర్ సాయంతో ముందుకు వెళ్తున్న అటవీ అధికారులు, సిబ్బంది
● ఎర్రంపాలెం వైపు వెళ్లినట్టు గుర్తింపు
గంగవరం: జిల్లాలో గంగవరం మండలంలో పెద్దపులి సంచారం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. అటవీశాఖ అధికారులు, సిబ్బంది, ప్రజలకు పులి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. మంగళవారం ఉదయం ఆరు గంటల నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. దొరమామిడికి వెళ్లే రహదారిలో కొండ సమీపంలో పులిని బంధించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఐనా పులి చిక్కలేదు. బుధవారం తెల్లవారే సరికి దొరమామిడి మార్గంలోనే దుంప తోటలో ఒక ఆవును హతమర్చి పాత కొత్తాడ, టేకులవీధి, ఎర్రంపాలెం వైపు పులి పయనించినట్లు తెలుస్తోంది. బుధవారం ఉదయం నుంచి అటవీశాఖ అధికారులు, సిబ్బంది పులి జాడ కోసం ప్రయత్నిస్తున్నారు. రేడియో ట్రాకింగ్ ద్వారా అడ్డతీగల, ఫోక్స్పేట ఫారెస్టు రేంజ్ అఽధికారులు డివిజనల్ అటవీ శాఖాధికారి శివకుమార్ గంగల్, అడ్డతీగల సబ్–డీఎఫ్ఓ జేవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో అటవీశాఖ సిబ్బంది, బేస్ క్యాంప్ సిబ్బంది సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. కాగా మంగళవారం రాత్రి కొంత మంది అటవీశాఖ బీట్ అధికారులు, బేస్ క్యాంప్ హెల్పర్లు కొండ పైభాగానికి వెళ్లి మరీ పులిని బంధించే ప్రయత్నం చేశారు.


